Telugu Global
NEWS

టీ-20లో విండీస్ పై నాలుగేళ్ల తర్వాత టీమిండియా గెలుపు

కోల్ కతా టీ-20లో కుల్దీప్ స్పిన్ జాదూ ఖలీల్, కృణాల్ అరంగేట్రం అదుర్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు…. టీ-20 ప్రపంచ చాంపియన్ విండీస్ పై…మాజీ చాంపియన్ టీమిండియా నాలుగేళ్ల విరామం తర్వాత తొలివిజయం సాధించింది. తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన తొలిమ్యాచ్ లో ఆతిథ్య టీమిండియా 5 వికెట్ల విజయం నమోదు చేసింది.  విండీస్ తో ఆడిన గత ఐదుమ్యాచ్ ల్లోనూ పరాజయాలు […]

టీ-20లో విండీస్ పై నాలుగేళ్ల తర్వాత టీమిండియా గెలుపు
X
  • కోల్ కతా టీ-20లో కుల్దీప్ స్పిన్ జాదూ
  • ఖలీల్, కృణాల్ అరంగేట్రం అదుర్స్
  • కెప్టెన్ గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు….

టీ-20 ప్రపంచ చాంపియన్ విండీస్ పై…మాజీ చాంపియన్ టీమిండియా నాలుగేళ్ల విరామం తర్వాత తొలివిజయం సాధించింది.

తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన తొలిమ్యాచ్ లో ఆతిథ్య టీమిండియా 5 వికెట్ల విజయం నమోదు చేసింది.

విండీస్ తో ఆడిన గత ఐదుమ్యాచ్ ల్లోనూ పరాజయాలు పొందిన టీమిండియా 2014 తర్వాత…కరీబియన్ టీమ్ పై టీ-20 విజయం సాధించడం ఇదే మొదటి సారి.

ప్రస్తుత కోల్ కతా టీ-20 మ్యాచ్ వరకూ…విండీస్ తో తొమ్మిది టీ-20 మ్యాచ్ ల్లో తలపడిన టీమిండియాకు ఇది మూడో గెలుపు మాత్రమే. విండీస్ చేతిలో ఐదు పరాజయాలు పొందిన టీమిండియా….ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రెండో ర్యాంక్ లో ఉంటే…కరీబియన్ టీమ్ మాత్రం 7వ ర్యాంకర్ గా ఉంది.

ధోనీ లేకుండానే గెలుపు….

ప్రపంచ టీ-20 చాంపియన్ విండీస్ తో తీన్మార్ సిరీస్ లో…2వ ర్యాంకర్ టీమిండియా బోణీ కొట్టింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో టీమిండియా గట్టి పోటీ ఎదుర్కొని 5 వికెట్ల విజయంతో 1-0 తో పైచేయి సాధించింది.

అంతేకాదు టీమిండియా ప్రత్యర్థిగా విండీస్ జట్టు అతితక్కువ టీ-20 స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా… భారతగడ్డపై టీమిండియా తన తొలి టీ-20 మ్యాచ్ ఆడటం విశేషం.

అరంగేట్రం అదుర్స్….

టీమిండియా యువఆటగాళ్లు ఖలీల్ అహ్మద్, కృణాల్ పాండ్యా…టీ-20 అరంగేట్రంలో అదరగొట్టారు. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా…. లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా …భారత 77వ, 78వ టీ-20 క్యాప్ లు అందుకొన్న క్రికెటర్లుగా రికార్డుల్లో చేరారు.

ఖలీల్ నాలుగు ఓవర్లలో ఓ మేడిన్ ఓవర్ తో సహా కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొడితే…కృణాల్ పాండ్యా ఆల్ రౌండ్ షోతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

బౌలింగ్ లో పాండ్యా 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టడంతో పాటు…9 బాల్స్ లో 3 బౌండ్రీలతో 21 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. మొత్తం మీద ఈ ఇద్దరు క్రికెటర్లు తమ అరంగేట్రం మ్యాచ్ ను చిరస్మరణీయం చేసుకోగలిగారు.

100 వికెట్ల కుల్దీప్ యాదవ్….

టీమిండియా యువ బౌలర్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్….టీ-20 ఫార్మాట్లో వికెట్ల సెంచరీ పూర్తి చేశాడు.

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా…23 ఏళ్ల కుల్దీప్ యాదవ్ అరుదైన ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు.

గత ఏడాది కింగ్ స్టన్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టీ-20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కుల్దీప్…దేశవాళీ టీ-20 మ్యాచ్ లతో పాటు…ఇప్పటి వరకూ ఆడిన 23 ఇంటర్నేనషల్ టీ-20 మ్యాచ్ ల ద్వారా మొత్తం 100 వికెట్లు సాధించాడు. అరుదైన ఈ రికార్డు సాధించిన భారత తొలిబౌలర్ గా నిలిచాడు.

కోల్ కతా టీ-20 మ్యాచ్ లో…కుల్దీప్ మొత్తం 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

డారెన్ బ్రావో , రోవ్ మాన్ పావెల్, కార్లోస్ బ్రాత్ వెయిట్ వికెట్లను కుల్దీప్ యాదవ్ సాధించడం ద్వారా టీమిండియా విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

First Published:  5 Nov 2018 6:34 AM GMT
Next Story