Telugu Global
International

జెంటిల్మన్ గేమ్ లో మహిళా ప్రపంచకప్

కరీబియన్ ద్వీపాలు వేదికగా 2018 టీ-20 ప్రపంచకప్ నవంబర్ 9 నుంచి 24 వరకూ వరల్డ్ వార్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా భారత్ పోటీ తొలిసారిగా మహిళా ప్రపంచకప్ లో డీఆర్ ఎస్ విధానం ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే…. బౌండ్రీల జోరు, సిక్సర్ల హోరు…పరుగుల వెల్లువ. వీరబాదుడు, బండబాదుడు… పిచ్చకొట్టుడు. ఇలాంటి ధనాధన్, ఫటాఫట్ ఆటలో మహిళలకు ప్రపంచకప్ ఏంటా అంటూ ఆశ్చర్యపోకండి. కరీబియన్ ద్వీపాలు వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్న 2018 […]

జెంటిల్మన్ గేమ్ లో మహిళా ప్రపంచకప్
X
  • కరీబియన్ ద్వీపాలు వేదికగా 2018 టీ-20 ప్రపంచకప్
  • నవంబర్ 9 నుంచి 24 వరకూ వరల్డ్ వార్
  • హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా భారత్ పోటీ
  • తొలిసారిగా మహిళా ప్రపంచకప్ లో డీఆర్ ఎస్ విధానం

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే…. బౌండ్రీల జోరు, సిక్సర్ల హోరు…పరుగుల వెల్లువ. వీరబాదుడు, బండబాదుడు… పిచ్చకొట్టుడు. ఇలాంటి ధనాధన్, ఫటాఫట్ ఆటలో మహిళలకు ప్రపంచకప్ ఏంటా అంటూ ఆశ్చర్యపోకండి. కరీబియన్ ద్వీపాలు వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్న 2018 ప్రపంచకప్ విశేషాలు ఓసారి చూద్దాం…

పురుషులకు దీటుగా….

మూడక్షరాల ఆట క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. సిక్సర్లు, బౌండ్రీలు, పరుగులు, వికెట్లు, రికార్డులతో సాగిపోయే….క్రికెట్లో మహిళలు సైతం పురుషులకు తీసిపోని విధంగా రాణిస్తున్నారు.

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్…ఇన్ స్టంట్ వన్డే క్రికెట్…మూడున్నర గంటల్లో ధూమ్ ధామ్ గా ముగిసిపోయే టీ-20 ఫార్మాట్లో సైతం…మహిళలు పోటీపడుతున్నారు.

20 ఓవర్లు…60 థ్రిల్స్ గా సాగిపోయే…వీరబాదుడు, యమదంచుడు టీ-20 ఫార్మాట్లో…2018 మహిళా ప్రపంచకప్ కు… విండీస్ కమ్ కరీబియన్ ద్వీపాలు వేదికగా రంగం సిద్ధమయ్యింది.

ప్రపంచ మహిళా క్రికెట్ లోని పది అగ్రశ్రేణి జట్లు… ఢీ అంటే ఢీ అంటున్నాయి.

బాదుడే బాదుడు….

మూడున్నర గంటల సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగిపోయే టీ-20 క్రికెట్ అంటేనే…బాదుడు. బ్యాట్ ను ఝళిపిస్తూ బౌండ్రీలు, సిక్సర్ల మోత మోగించడమే కాదు…పరుగుల హోరెత్తించడం.

ఇలాంటి ఫార్మాట్లో కేవలం పురుషులకు మాత్రమే కాదు…మహిళలకు సైతం ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు.

కేవలం తొమ్మిదేళ్ల క్రితం నుంచి మహిళలకు సైతం…టీ-20 ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తూ వస్తోంది. 2009లో లండన్ వేదికగా తొలిసారిగా మహిళా టీ-20 ప్రపంచకప్ ను నిర్వహించారు.

9 ఏళ్లు- 5 ప్రపంచకప్ టోర్నీలు….

2009 లో ప్రారంభమైన మహిళా ప్రపంచకప్ లో…గత తొమ్మిదేళ్ల కాలంలోనే ఐదు ప్రపంచకప్ టోర్నీలు నిర్వహించారు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల షోగానే సాగుతూ వస్తోంది.

ఇంగ్లండ్ వేదికగా 2009లో నిర్వహించిన ప్రారంభ ప్రపంచకప్ లో ఆతిథ్య ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.

2010 ప్రపంచకప్ నుంచి 2014 ప్రపంచకప్ వరకూ నిర్వహించిన మూడుటోర్నీల్లోనూ…ఆస్ట్రేలియా విజేతగా నిలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించింది. మహిళా ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా మూడు ప్రపంచకప్ లు నెగ్గిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది.

ఆ తర్వాత…భారత్ వేదికగా ముగిసిన 2016 ప్రపంచకప్ లో మాత్రం…తొలిసారిగా టైటిల్ నెగ్గడం ద్వారా వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఆధిపత్యానికి కరీబియన్ మహిళలు తొలిసారిగా గండి కొట్టి…తమకు తామే సాటిగా నిలిచారు.

ఆస్ట్రేలియా తీన్మార్….

గత ఐదు మహిళా ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆస్ట్రేలియా మూడుసార్లు, ఇంగ్లండ్, విండీస్ ఒక్కోసారి టైటిల్ నెగ్గితే… న్యూజిలాండ్, ఇంగ్లండ్ చెరో రెండుసార్లు, ఆస్ట్రేలియా ఒకసారి రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకొన్నాయి.

మహిళా టీ-20 ప్రపంచకప్ అంటే …ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల… మూడుస్తంభాలాట మాత్రమే కాదని… నాలుగోస్తంభం రూపంలో తామూ ఉన్నామని..2016 ప్రపంచకప్ సాధించడం ద్వారా… కరీబియన్ మహిళలు చాటుకొన్నారు.

ఇటు చార్లొట్టీ- అటు ఎల్సీ….

మహిళా టీ-20 చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ ఘనతను ఇంగ్లండ్ ప్లేయర్ చార్లొట్టీ ఎడ్వర్డ్స్ సొంతం చేసుకొంది. చార్లొట్టీ 768 పరుగులు సాధించింది.

ఇక…బౌలింగ్ విభాగంలో…కంగారూ పేసర్ ఎల్సీ పెర్రీ నంబర్ వన్ బౌలర్ గా నిలిచింది. ఎల్సీ ఇప్పటి వరకూ 27 వికెట్లు పడగొట్టి అగ్రశ్రేణి బౌలర్ గా రికార్డుల్లో చేరింది.

మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే ఆస్ట్రేలియా అన్నమాటే గుర్తుకు వస్తుంది. గత ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో మూడుసార్లు విజేతగా నిలవడం తోపాటు.. వరుసగా మూడుసార్లు ట్రోఫీ అందుకొన్న జట్టు కంగారూ టీమ్ మాత్రమే…

మెరుపు వేగంతో సాగిపోయే టీ-20 మహిళా ప్రపంచకప్ అంటే…ఆస్ట్రేలియా మాత్రమే అగ్రశ్రేణి జట్టుగా ముందు వరుసలో ఉంటుంది. 2010 ప్రపంచకప్ టోర్నీలో విన్నర్ గా బోణీ కొట్టిన ఆస్ట్రేలియా…ఆ తర్వాత జరిగిన 2012, 2014 పోటీలలో సైతం తిరుగులేని విజేతగా నిలిచింది.

భారత్ వేదికగా ముగిసిన 2016 ప్రపంచకప్ లో సైతం కంగారూ టీమ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఐదు ప్రపంచకప్ టోర్నీల్లోనూ…ఆస్ట్రేలియా మొత్తం 26 మ్యాచ్ లు ఆడి… 19 విజయాలు, 6 పరాజయాల రికార్డుతో ఉంది. మొత్తం 75 విజయశాతంతో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా గుర్తింపు తెచ్చుకొంది.

ఇప్పటి వరకూ మహిళా క్రికెట్ మొదటి మూడు అగ్రశ్రేణి జట్ల ఘనత ఎంటో చూశాం. మరి..మహిళా టీ-20 ప్రపంచకప్ లో భారత ట్రాక్ రికార్డు ఏంటో కూడా ఓసారి చూద్దాం.

రెండుసార్లు సెమీస్ లో భారత్

తొమ్మిదేళ్ల …టీ-20 మహిళా ప్రపంచకప్ చరిత్రలో…భారత్ కూ కొద్దో..గొప్పో రికార్డే ఉంది. 2009 నుంచి 2016 ప్రపంచకప్ వరకూ… గత ఐదు టోర్నీల్లో పాల్గొంటూ వచ్చిన భారత్…. పెద్దజట్లలో చిన్నజట్టుగా… చిన్నజట్లలో పెద్దజట్టుగా గుర్తింపు తెచ్చుకొంది.

అత్యుత్తమంగా…. 2009, 2010 ప్రపంచకప్ టోర్నీల సెమీస్ కు అర్హత సంపాదించిన జట్టుగా భారత్ నిలిచింది.

గత..ఐదుటోర్నీల్లో 21 మ్యాచ్ లు ఆడిన భారత్ 9 విజయాలు, 12 పరాజయాల రికార్డుతో….42.89 విజయశాతాన్ని మాత్రమే సాధించింది.

హార్మన్ ప్రీత్ నాయకత్వంలో….

హార్డ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ ..హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో…భారతజట్టు..ప్రస్తుత 2018 ప్రపంచకప్ లో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. అదృష్టం కలసి వస్తే మొదటి మూడుజట్లలో ఒకటిగా నిలిచే అవకాశం లేకపోలేదు.

నవంబర్ 9 నుంచి 24 వరకూ గ్రూప్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈటోర్నీలో…మొత్తం 10 దేశాల జట్లు తలపడుతున్నాయి.

గ్రూప్-ఏ లీగ్ లో డిఫెండింగ్ చాంపియన్ విండీస్, మాజీ చాంపియన్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఢీ కొనబోతున్నాయి.

ఇక…గ్రూప్ -బీ లీగ్ లో మూడుసార్లు విజేత ఆసీస్, రెండుసార్లు రన్నరప్ న్యూజిలాండ్, భారత్, పాక్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి.

గయానా, సెయింట్ లూసియా వేదికలుగా…

గయానా నేషనల్ స్టేడియం, సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియం వేదికగా గ్రూప్ లీగ్ మ్యాచ్ లు, ఆంటీగాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లు నిర్వహిస్తారు.

రెండువారాలపాటు…23 మ్యాచ్ లుగా జరిగే ఈ టోర్నీలో తొలిసారిగా DRS కమ్ అంపైర్ నిర్ణయ సమీక్ష విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.

రెండుసార్లు సెమీ ఫైన లిస్ట్, హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు …గ్రూప్ – బీ లీగ్ లో… ఆసీస్, కివీస్, పాక్, ఐర్లాండ్ జట్లతో పోటీపడనుంది. ఈమ్యాచ్ లన్నీ గయానా నేషనల్ స్టేడియం వేదికగానే నిర్వహించనున్నారు.

న్యూజిలాండ్ తో భారత్ తొలిమ్యాచ్….

గ్రూప్- బీ లీగ్ లో భాగంగా…భారత్ తన తొలిమ్యాచ్ ను నవంబర్ 9న…గయానా నేషనల్ స్టేడియం వేదికగా… రెండుసార్లు రన్నరప్ న్యూజిలాండ్ తో ఆడనుంది.

నవంబర్ 11న జరిగే గ్రూప్ రెండో రౌండ్ పోటీలో… పాకిస్థాన్ తో భారత్ పోటీపడనుంది. నవంబర్ 12న జరిగే మూడోరౌండ్లో… ఐర్లాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

నవంబర్ 17న జరిగే అసలు సిసలు సమరంలో మూడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ పెద్దపోరాటమే చేయనుంది.

నవంబర్ 22న సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియంలో సెమీస్…నవంబర్ 24న ఆంటీగా స్టేడియంలో జరిగే టైటిల్ సమరంతో..2018 ప్రపంచకప్ కు తెరపడనుంది.

హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు…స్థాయికి తగ్గట్టుగా ఆడి….ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి అగ్రశ్రేణిజట్ల ఆధిపత్యానికి చెక్ చెప్పాలని…. ప్రపంచకప్ తో స్వదేశానికి తిరిగిరావాలని కోరుకొందాం.

First Published:  8 Nov 2018 3:46 AM GMT
Next Story