Telugu Global
NEWS

మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్  స్టార్ మేరీ కోమ్....

ఏడు ప్రపంచ పతకాలు సాధించిన ఒకే ఒక్క మహిళ ముగ్గురు బిడ్డల తల్లిగా ఆరో బంగారు పతకం భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం, మణిపూర్ మణిపూస మేరీ కోమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ముగ్గురు బిడ్డల తల్లిగా…35 ఏళ్ల వయసులో ప్రపంచ బాక్సింగ్ బంగారు పతకం సాధించి… భారత మహిళలకే గర్వకారణంగా నిలిచింది. భారత బాక్సింగ్ మణిపూస, మణిపూర్ ఆణిముత్యం మేరీకోమ్…. కేవలం…. బాక్సింగ్ కోసమే పుట్టిన క్రీడాకారిణి. గత రెండుదశాబ్దాలుగా భారత మహిళా బాక్సింగ్ లో నిత్యనూతనంగా […]

మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్  స్టార్ మేరీ కోమ్....
X
  • ఏడు ప్రపంచ పతకాలు సాధించిన ఒకే ఒక్క మహిళ
  • ముగ్గురు బిడ్డల తల్లిగా ఆరో బంగారు పతకం

భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం, మణిపూర్ మణిపూస మేరీ కోమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ముగ్గురు బిడ్డల తల్లిగా…35 ఏళ్ల వయసులో ప్రపంచ బాక్సింగ్ బంగారు పతకం సాధించి… భారత మహిళలకే గర్వకారణంగా నిలిచింది.

భారత బాక్సింగ్ మణిపూస, మణిపూర్ ఆణిముత్యం మేరీకోమ్…. కేవలం…. బాక్సింగ్ కోసమే పుట్టిన క్రీడాకారిణి.

గత రెండుదశాబ్దాలుగా భారత మహిళా బాక్సింగ్ లో నిత్యనూతనంగా వెలుగొందుతున్న మేరీకోమ్ 35 ఏళ్ళ లేటు వయసులోనూ…అదీ ముగ్గురు బిడ్డల తల్లిగా.. తన పంచ్ ల్లో వాడీ వేడీ ఏమాత్రం తగ్గలేదని చాటుకొంటూ వస్తోంది. ప్రతిభకు వయసు, కుటుంబ బాధ్యతలు ఏమాత్రం అడ్డుకాదని మరోసారి నిరూపించింది.

అథ్లెటిక్స్ నుంచి బాక్సింగ్ కు….

ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలోని కాంగ్తీ గ్రామానికి చెందిన మేరీ కోమ్ కు బాల్యం నుంచి క్రీడలంటే ఎంతో మక్కువ. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలైన 400 మీటర్ల పరుగు, జావలిన్ త్రో అంశాలలో మంచి అథ్లెట్ గా గుర్తింపు తెచ్చుకోవాలన్న పట్టుదల మేరీలో ఉండేది. అయితే…1988 బ్యాంకాక్ ఆసియాక్రీడల బాక్సింగ్ లో బంగారు పతకం సాధించిన మణిపూర్ బాక్సర్ డింకో సింగ్ స్ఫూర్తితో మేరీకోమ్ బాక్సింగ్ వైపు దృష్టి మళ్లించింది.

ఆడపిల్లలకు బాక్సింగ్ లాంటి మొరటు క్రీడ ఏంటా అంటూ అమ్మానాన్నలతో పాటు గ్రామస్థులూ నిరుత్సాహ పరచినా… మేరీకోమ్ తన సాధన కొనసాగించింది. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో రాణించిన మేరీకోమ్… ఆ తర్వాత జాతీయస్థాయిలోనూ గుర్తింపు సంపాదించింది.

ఆరుసార్లు విశ్వవిజేతగా…..

ప్రపంచ అమెచ్యూర్ మహిళా బాక్సింగ్ లో ఆరుసార్లు విశ్వవిజేతగా బంగారు పతకాలు సాధించిన ఘనత మేరీకోమ్ కు మాత్రమే దక్కుతుంది. వరుసగా ఏడు ప్రపంచకప్ పోటీల్లో ఆరు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన అరుదైన, అసాధారణ రికార్డు కూడా మేరీకోమ్ పేరుతోనే ఉంది.

న్యూఢిల్లీ వేదికగా ముగిసిన 2018 మహిళా ప్రపంచ బాక్సింగ్ మహిళల 48 కిలోల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్ హన్నాను 5-0తో చిత్తు చేయటం ద్వారా…మేరీ ఆరో బంగారు పతకం సొంతం చేసుకొంది.

45 కిలోల నుంచి 48 కిలోలకు…

కెరియర్ ప్రారంభంలో 45 కిలోలు, ఆ తర్వాత 46 కిలోల విభాగాలలో విశ్వవిజేతగా నిలిచిన మేరీ కోమ్ ప్రస్తుతం 48 కిలోల విభాగంలో తన పోటీ కొనసాగిస్తోంది.

ఇక..ఆసియా మహిళా బాక్సింగ్ పోటీలలో సైతం ఐదు బంగారు పతకాలు గెలుచుకొన్న భారత ఏకైక బాక్సర్ మేరీ కోమ్ మాత్రమే.

2003, 2005 , 2010, 2012 ఆసియా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన మేరీ కోమ్ 2008 ఆసియా బాక్సింగ్ పోటీలో మాత్రం రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మూడేళ్ల విరామం తర్వాత….

లండన్ వేదికగా జరిగిన 2012 ఒలింపిక్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా బాక్సింగ్ లో….మేరీ కోమ్ భారీ అంచనాలతో బరిలోకి దిగినా చివరకు కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగిరాక తప్పలేదు.

2010 గాంగ్జావో ఆసియా క్రీడల్లో కాంస్యం, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన మేరీ కోమ్…. ఆ తర్వాత బాక్సింగ్ నుంచి విరామం తీసుకొంది. అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లిగా ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే… మూడేళ్లపాటు బాక్సింగ్ కు దూరమైన మేరీకోమ్… 2016లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యింది.

అంతేకాదు భారత బాక్సింగ్ పరిశీలకురాలిగానూ బాధ్యతలు తీసుకొంది. ఇలా పలురకాల కారణాలతో బాక్సింగ్ కు దూరంగా ఉన్నా…. ఫిట్ నెస్ ను మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సాధన కొనసాగిస్తూనే వచ్చింది.

ఒకే ఒక్క మహిళ మేరీ కోమ్….

వియత్నాం రాజధాని హోచిమిన్ సిటీ వేదికగా ముగిసిన 2017 ఆసియా మహిళా బాక్సింగ్ 48 కిలోల విభాగంలో పోటీకి దిగిన మేరీ కోమ్… స్థాయికి తగ్గట్టుగా రాణిస్తూ సెమీఫైనల్లో జపాన్, ఫైనల్లో ఉత్తర కొరియా బాక్సర్లను చిత్తు చేయడం ద్వారా బంగారు పతకం సొంతం చేసుకొంది.

ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ లో మాత్రమే కాదు… ఆసియా బాక్సింగ్ లోనూ ఐదు బంగారు పతకాలు సాధించడం ద్వారా మేరీ గోల్డ్ గా నిలిచిపోయింది.

అంతేకాదు…. 2018 న్యూఢిల్లీ ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో సైతం మేరీకోమ్…. మేరీగోల్డ్ గా నిలిచింది. ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలోనే ఆరు ప్రపంచ స్వర్ణాలు, ఓ రజతంతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించిన ఏకైక…. ఒకే ఒక్క బాక్సర్ గా రికార్డు నెలకొల్పింది.

అవార్డులే అవార్డులు….

2003లో అర్జున అవార్డు,2006లో పద్మశ్రీ, 2009లో దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2013లో పద్మభూషణ్ అవార్డులు పొందిన మేరీకోమ్…మణిపూర్ రాజధాని ఇంపాల్ లో ఓ బాక్సింగ్ అకాడమీని నిర్వహిస్తోంది.

ముగ్గురు బిడ్డల తల్లిగా, పార్లమెంట్ సభ్యురాలిగా, భారత బాక్సింగ్ పరిశీలకురాలిగా, అంతర్జాతీయ బాక్సర్ గా బహుముఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేరీ కోమ్ భారత మహిళలకే గర్వకారణంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది. 2022 ఏప్రిల్ 24వ వరకూ రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించే మేరీ కోమ్ ను మేరీ గోల్డ్ అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

First Published:  24 Nov 2018 11:35 PM GMT
Next Story