Telugu Global
NEWS

అన్నిరోజులూ ఒకలా ఉండవ్... పరిటాలకు దగ్గుబాటి వార్నింగ్‌

మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితులు మిగిలిన నియోజక వర్గాలకు భిన్నంగా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ దాదాపు కనుమరుగు అయినా…. రాప్తాడు నియోజక వర్గంలో మాత్రం ప్రత్యర్థుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిటాల కుటుంబం కనుసన్నల్లోనే రాప్తాడులో అధికారపార్టీ నేతల ఆగడాలు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు పరిటాల కుటుంబంపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు నియోజక వర్గంలోని వివిధ మండలాలకు […]

అన్నిరోజులూ ఒకలా ఉండవ్... పరిటాలకు దగ్గుబాటి వార్నింగ్‌
X

మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితులు మిగిలిన నియోజక వర్గాలకు భిన్నంగా ఉన్నాయి.

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ దాదాపు కనుమరుగు అయినా…. రాప్తాడు నియోజక వర్గంలో మాత్రం ప్రత్యర్థుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిటాల కుటుంబం కనుసన్నల్లోనే రాప్తాడులో అధికారపార్టీ నేతల ఆగడాలు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు పరిటాల కుటుంబంపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు నియోజక వర్గంలోని వివిధ మండలాలకు ఎంపీపీగా ఉన్న సొంతపార్టీ నేతలనే పక్కన పెట్టి… తన బంధువులకు ఒక్కొక్కరికి ఒక్కో మండలాన్ని పరిటాల సునీత అప్పగించడంపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. కుటుంబసభ్యులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం నచ్చక ఇప్పటికే పరిటాల రవికి కీలకమైన అనుచరులుగా ఉన్న వారు కూడా టీడీపీకి దూరమయ్యారు.

తాజాగా రాప్తాడు టీడీపీ ఎంపీపీ కూడా ఆ జాబితాలో చేరారు. రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌ టీడీపీ నేతే అయినా సరే ఆయన్నుపక్కన పెట్టి రాప్తాడు మండలంలోని వ్యవహారాలను మంత్రి పరిటాల సునీత తన సోదరుడు మురళీకి అప్పగించారు.

ఇదే తరహాలో నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లిని తన చిన్నాన్న ఎల్. నారాయణ చౌదరికి, అనంతపురం రూరల్‌ మండలాన్ని పరిటాల మహీంద్రకు, రామగరి మండలాన్ని రామ్మూర్తినాయుడికి, ఆత్మకూరు మండలాన్ని తన సోదరుడు బాలాజీకి పరిటాల సునీత అప్పగించారు.

దాంతో ఆయా మండలాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు డమ్మీలుగా మారారు. మండలాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్న పరిటాల కుటుంబసభ్యులు చెప్పినట్టుగానే అధికారులు నడుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాప్తాడు టీడీపీ ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌ను పక్కన పెట్టి మంత్రి సోదరుడు మురళీ చెప్పినట్టుగానే అధికారులు నడుచుకుంటున్నారు.

చివరకు దగ్గుబాటి ప్రసాద్ సొంతూరులో కూడా ఆయన్ను ఆహ్వానించకుండా కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించగా… దగ్గుపాటి ప్రసాద్‌ గ్రామస్తులతో కలిసి అధికారులను ఘోరావ్ చేశారు. ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారులను నిలదీశారు.” మీకు ప్రోటోకాల్ తెలియదా… సొంత పంచాయతీలో నాకు తెలియకుండా కార్యక్రమం నిర్వహిస్తారా?. అసలేమనుకుంటున్నారు?. మీ వెనుక ఎవరైనా ఉండి చేయిస్తున్నారేమో!… వారికి చెప్పండి. అన్ని రోజులు ఒకలా ఉండవు. తమాషాలు చేయొద్దు” అని పరోక్షంగా దగ్గుబాటి ప్రసాద్ పరిటాల కుటుంబ సభ్యులను హెచ్చరించారు.

అయితే ఒకవైపు మంత్రి కుటుంబసభ్యులు, మరో వైపు టీడీపీకే చెందిన ప్రజాప్రతినిధుల మధ్య తాము నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు.

First Published:  30 Nov 2018 12:31 AM GMT
Next Story