Telugu Global
NEWS

చంద్రబాబుకు పైత్యం ఉంది.... మంచి గిఫ్ట్ ఇస్తా....

కుల మతాలకు అతీతంగా ప్రజలు టీఆర్ఎస్‌కు అండగా నిలిచారన్నారు సీఎం కేసీఆర్‌. ఇది తెలంగాణ సకలజనుల విజయం అని అభివర్ణించారు. గెలుపుతో గర్వపడకుండా వినయంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాసేవకు మాత్రమే సమయాన్ని ఖర్చు చేయాలని… వృథా అంశాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఈ దపాలో కోటి ఎకరాలకు నీరు ఇచ్చి తీరుతామన్నారు. కాళేశ్వరం కావాలా… శనేశ్వరం కావాలా అంటే ప్రజలు కాళేశ్వరమే కోరుకున్నారని… ఆ కర్తవ్య నిర్వాహణకు పనిచేస్తామన్నారు.  కులవృత్తులను కాపాడుతామన్నారు.  విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అదే […]

చంద్రబాబుకు పైత్యం ఉంది.... మంచి గిఫ్ట్ ఇస్తా....
X

కుల మతాలకు అతీతంగా ప్రజలు టీఆర్ఎస్‌కు అండగా నిలిచారన్నారు సీఎం కేసీఆర్‌. ఇది తెలంగాణ సకలజనుల విజయం అని అభివర్ణించారు. గెలుపుతో గర్వపడకుండా వినయంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రజాసేవకు మాత్రమే సమయాన్ని ఖర్చు చేయాలని… వృథా అంశాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఈ దపాలో కోటి ఎకరాలకు నీరు ఇచ్చి తీరుతామన్నారు. కాళేశ్వరం కావాలా… శనేశ్వరం కావాలా అంటే ప్రజలు కాళేశ్వరమే కోరుకున్నారని… ఆ కర్తవ్య నిర్వాహణకు పనిచేస్తామన్నారు.

కులవృత్తులను కాపాడుతామన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అదే బరువుగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ధీమాగా బతికే తెలంగాణ నిర్మిస్తామన్నారు. త్వరలోనే ప్రతి ఊరికి ఈఎన్‌టీ టీం వెళ్తుందని… ఆ తర్వాత డెంటల్ డాక్టర్ల టీం ప్రజల వద్దకు వెళ్తుందన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతామన్నారు.

దళితులు, గిరిజనుల పేదరికం పోగొట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పేదరికం అన్నది పెద్ద సోషలిస్ట్ అని…. పేదరికానికి రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ అంటూ ఏమీ తేడా ఉండదన్నారు. కాబట్టి అగ్రకులాల పిల్లల కోసం కూడా రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మిస్తామన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పేదరికం ఏ కులంలో ఉన్నా దాన్ని నిర్మూలిస్తామన్నారు.

ఒక్క రీపోలింగ్ కూడా లేకుండా ఎన్నికలు జరగడం గర్వకారణమన్నారు. డబ్బు ప్రవాహం లాంటి దరిద్రాలైతే కొన్ని జరిగాయన్నారు. మీడియా కూడా ఎన్నికల సందర్భంగా పరిణితి ప్రదర్శించిందన్నారు. దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషిస్తామన్నారు. కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ పాత్ర ప్రేక్షక పాత్రగా ఉండబోదన్నారు. తెలంగాణలో ఉన్న మేధాశక్తి దేశానికి కూడా ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు.

మమతాబెనర్జీ, నితీష్ కుమార్‌లు ఫోన్ చేసి అభినంధించారని కేసీఆర్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లో తాము ప్రధాన పాత్ర పోషించబోతున్నామన్నది ఖాయమన్నారు. ఈ విషయాన్ని తాను ఇంగ్లీష్‌లో, హిందీలో కూడా అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నానన్నారు.

ఈ దేశంలో నాన్‌ కాంగ్రెస్‌, నాన్ బీజేపీ పాలన వచ్చి తీరాల్సిందేనన్నారు. ఆ దిశగా దేశానికి తెలంగాణ దారి చూపుతుందన్నారు. ఈ దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే… ఇప్పటికి కేవలం 30వేల టీఎంసీలు మాత్రమే వాడుకోగలుగు తున్నామని ఈపరిస్థితిని చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ దేశంలో 15 కోట్ల మంది రైతుల పరిస్థితి అన్నమో రామచంద్రా అని అలమటించడం సరికాదన్నారు.

త్వరలోనే తాను ఢిల్లీకి వెళ్లి జాతీయ రాజకీయాలకు దారి చూపుతానన్నారు. సమయం అసన్నమైందని ప్రతిఒక్కరూ సానుకూలంగా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. తాను జాతీయ రాజకీయాల్లో నాలుగు పార్టీలను ఒకచోట కూర్చోబెట్టి గొప్పగా చెప్పుకునేందుకు వెళ్లడం లేదని… దేశంలో ప్రజలను ఏకం చేసేందుకు తాను ఢిల్లీ వెళ్తానన్నారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు రావాల్సిన మరో 18 సీట్ల వరకు పోయాయన్నారు. చెప్పినప్పటికీ పార్టీ నేతలే ఒకరిని ఒకరు చంపుకున్నారన్నారు. అందుకు ఖమ్మం జిల్లాయే ఉదాహరణ అని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పార్టీ నేతలే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారన్నారు. స్పీకర్ ఓడిపోవడం దురదృష్టకరమన్నారు.

అసదుద్దీన్‌ ఓవైసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్‌. తాను అసద్‌ నిన్నటి మీటింగ్‌లో దేశంలోని ప్రజల గురించి మాట్లాడుతుంటే… బయట మాత్రం చిల్లర ప్రచారం చేశారు. దేశంలోని మైనార్టీలను ఏకతాటికిపైకి తేవడం ఎలా అన్నదానిపై తాము చర్చించామన్నారు. దేశంలో పర్యటించేందుకు అసద్‌కు ఒకటి, తనకు ఒకటి హెలికాప్టర్‌ కూడా బుక్‌ చేశామన్నారు.

విభజించి పాలించు సిద్ధాంతం నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియాలో ఇంకా కులాలు, మతాలు అని కొట్టుకుంటున్నారని…. కాబట్టి చైనాకు పోటీగా వచ్చే అవకాశమే లేదని చైనా ప్రభుత్వానికి ఒక కమిషన్‌ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. దేశంలో అంత చులకన భావన ఉందన్నారు.

మూడు రాష్ట్రాల్లో మరో దిక్కులేకే కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా కనీసం తాగునీటి సమస్యలను ఈ దేశంలోని పాలకులు తీర్చలేకపోయారన్నారు. కేసీఆర్‌ ఏం చేస్తారు అనుకుంటున్నారని… ఏం చేస్తానో చేసి చూపిస్తానన్నారు. త్వరలోనే తాను చాలా యాక్టివ్ అవుతానన్నారు. రాబోయే నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో ఊహించని మార్పును చూస్తారని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే రాంమందిరం అంటూ గొడవ తెస్తున్నారని వ్యాఖ్యానించారు. రేపు 11.30కు పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉంటుందన్నారు. ప్రతిపక్షాల పేరుతో తెలంగాణలో గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం జరిగిందన్నారు.

పాకిస్తాన్‌తో సమస్యను పరిష్కరించడం చేతగాదు గానీ…. ఒక్కడో మారుమూల ఉన్న గ్రామంలోని ఒక స్కూల్‌పై కేంద్రం పెత్తనం ఎందుకని కేసీఆర్‌ ప్రశ్నించారు. విద్యా, వైద్యం లాంటి అంశాలను రాష్ట్రానికి వదిలేస్తే ప్రజలకు మరింత మంచి జరుగుతుందన్నారు.

సుప్రీం కోర్టు హద్దులు దాటి తీర్పులు ఇచ్చిందన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడుందని సుప్రీంకోర్టును కేసీఆర్‌ ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దు అనడానికి సుప్రీంకోర్టు ఎవరని ప్రశ్నించారు కేసీఆర్. కాంగ్రెస్‌, బీజేపీ పొగరుబోతు తనమే దేశానికి శత్రువు అని మండిపడ్డారు. ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీం కోర్టు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. దేశానికి మార్పు అవసరమని… ఆ సమయం ఆసన్నమైందన్నారు.

దేశంలో ప్రజలను అగౌరవపరిచే విధానం పోవాలన్నారు. ప్రపంచంలోని దేశాలు మొత్తం రైతులకు అద్బుతమైన సబ్సిడీలు ఇస్తున్నాయని… మన దేశంలో మాత్రం రైతుకు సబ్సిడీలు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.

First Published:  11 Dec 2018 8:20 AM GMT
Next Story