గట్టెక్కాలనుకున్నారు... బొగ్గుల కుంపటితో ప్రాణాలు పోగొట్టుకున్నారు
మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. యువకులు నిద్రలోనే కన్నుమూశారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాలను బయటపడేయాలన్న ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కలిసి మేడ్చల్ జిల్లా శామీర్పేట పరిధిలోని బొమ్మరాశిపేట వద్ద ఫౌల్ట్రీ ఫాంను లీజుకు తీసుకున్నారు. అరవింద్, శివశంకర్లు సుధాకర్ అనే వ్యక్తి నుంచి ఫౌల్ట్రీ ఫాంను లీజుకు తీసుకున్నారు. ముదిరాజ్ అనే ఒక వ్యక్తిని పనిలో ఉంచుకున్నారు. వీరు ముగ్గురు కలిసి ఫౌల్ట్రీ ఫాంను నడుపుతున్నారు. గత రాత్రి వీరంతా […]
మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. యువకులు నిద్రలోనే కన్నుమూశారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాలను బయటపడేయాలన్న ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కలిసి మేడ్చల్ జిల్లా శామీర్పేట పరిధిలోని బొమ్మరాశిపేట వద్ద ఫౌల్ట్రీ ఫాంను లీజుకు తీసుకున్నారు.
అరవింద్, శివశంకర్లు సుధాకర్ అనే వ్యక్తి నుంచి ఫౌల్ట్రీ ఫాంను లీజుకు తీసుకున్నారు. ముదిరాజ్ అనే ఒక వ్యక్తిని పనిలో ఉంచుకున్నారు. వీరు ముగ్గురు కలిసి ఫౌల్ట్రీ ఫాంను నడుపుతున్నారు. గత రాత్రి వీరంతా రాత్రి ఒంటి గంట వరకు కోడి పిల్లలకు వ్యాక్సిన్ వేశారు. అదే రోజు వీరి స్నేహితుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి కూడా వీరిని కలిసేందుకు వచ్చి రాత్రి వారితోనే ఉండిపోయారు.
కోడి పిల్లలకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నలుగురు భోజనం చేశారు. అనంతరం పక్కనే ఉన్న ఒక గదిలో నిద్రపోయారు. ఉదయం ఫౌల్ట్రీ ఫాం వద్దకు వచ్చిన సతీశ్ అనే వ్యక్తి కోడిపిల్లలకు నీళ్ళు కూడా పెట్టని విషయాన్ని గమనించాడు. వెంటనే గది వద్దకు వెళ్లి నలుగురు యువకులను పిలువగా వారు స్పందించలేదు. దీంతో తలుపులు తోసేసి లోనికి వెళ్లి చూడగా యువకులు నలుగురు మంచం మీదే చనిపోయి ఉన్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. రాత్రి నిద్రపోయే ముందు దోమల బెడద తప్పించుకునేందుకు యువకులు బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రపోయారు. చలికారణంగా తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉండడంతో ఆక్సిజన్ అందక నిద్రలోనే యువకులు చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.