Telugu Global
NEWS

మీరు మారడం లేదా? ఇదీ అంతే?- రాజ్ దీప్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం

ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని నిరాశపరచడంతోపాటు జాతికి వెన్నుపోటు పొడిచారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. విశాఖలో ఇండియా టుడే నిర్వహించిన ఇండియా కాంక్లేవ్‌-2018 కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్ సర్దేశాయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపామని చంద్రబాబు చెప్పారు. దేశంలో ప్రజలకు కనీస స్వేచ్చ కూడా లేకుండాపోయిందన్నారు. ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, వ్యక్తిగత గోప్యతకు అవకాశమే లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వాల పాలన […]

మీరు మారడం లేదా? ఇదీ అంతే?- రాజ్ దీప్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం
X

ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని నిరాశపరచడంతోపాటు జాతికి వెన్నుపోటు పొడిచారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. విశాఖలో ఇండియా టుడే నిర్వహించిన ఇండియా కాంక్లేవ్‌-2018 కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్ సర్దేశాయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు.

దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపామని చంద్రబాబు చెప్పారు. దేశంలో ప్రజలకు కనీస స్వేచ్చ కూడా లేకుండాపోయిందన్నారు. ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, వ్యక్తిగత గోప్యతకు అవకాశమే లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వాల పాలన కంటే ఎన్డీఏ పాలన చెత్తగా ఉందన్నారు.

ప్రజలు అంగీకరించినా…. అంగీకరించకపోయినా హైదరాబాద్‌ను నిర్మించింది తానేనన్నారు. ప్రజలు మరిచిపోయినా హైదరాబాద్‌ను నిర్మించింది తానేనన్న వాస్తవాన్ని చరిత్ర మరిచిపోదన్నారు చంద్రబాబు. ఇప్పుడు మరో రాజధాని అమరావతిని కూడా తాను నిర్మిస్తున్నానని చెప్పారు.

పెద్ద నోట్ల రద్దును సమర్ధించి… కమిటీకి చైర్మన్‌గా ఉండి ఇప్పుడు ఎలా విమర్శిస్తున్నారని ప్రశ్నించగా… మీరు నమ్మినట్టే తాను కూడా మోడీని నమ్మానని నవ్వేశారు చంద్రబాబు. గోద్రా అల్లర్ల సమయంలో మోడీ చేత రాజీనామా చేయించాలని
డిమాండ్ చేసిన ఏకైక వ్యక్తిని తాను మాత్రమేనన్నారు.

రాహుల్‌ గాంధీనే యూపీఏ తరపున ప్రధాని అభ్యర్థి అని స్టాలిన్ చెబుతున్నారని… మరి మీ వైఖరి ఏమిటని ప్రశ్నించగా… స్టాలిన్ వైఖరి వారి పార్టీ నిర్ణయమన్నారు. యూపీఏ నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామన్నారు. రాహులే యూపీఏ ప్రధాని అభ్యర్థి అంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్ధించలేదు.

సీబీఐకి విశ్వసనీయత లేదు కాబట్టే ఏపీలోకి రాకుండా నిషేధం విధించామని చంద్రబాబు చెప్పారు. ”సీబీఐ కంటే నా ఏసీబీ బాగా పనిచేస్తోంది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీరు ఐదేళ్లకొకసారి స్నేహితులను, శత్రువులను మారుస్తారా అని రాజ్‌దీప్ ప్రశ్నించగా… చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు.

జర్నలిస్టుగా మీరు ఒకే మీడియా సంస్థలో శాశ్వతంగా ఉంటారా? ఇది అంతే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఎందుకు మార్చారని ప్రశ్నించగా… ఆ పరిస్థితి చూసి తాను కూడా సిగ్గుపడుతున్నానని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ వాళ్లు 20 కోట్లు పంచుతుంటే… తమ పార్టీ వాళ్లు కూడా ఏదో ఒకటి చేయాలంటున్నారని… ఇది సిస్టంలో ఏర్పడిన లోపం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

First Published:  22 Dec 2018 6:06 AM GMT
Next Story