Telugu Global
NEWS

ఐపీఎల్ -12 లో తెలుగు వెలుగులు

ఆంధ్ర, తెలంగాణా క్రికెటర్లకు భలే చాన్స్ జైపూర్ లో ముగిసిన 12వ సీజన్ వేలం ఆరుగురు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లకు ఐపీఎల్ కాంట్రాక్టు ఐపీఎల్ 12వ సీజన్ వేలం హంగామా జైపూర్ లో ముగిసింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు…వేలం ద్వారా తమ అవసరాలకు తగిన ఆటగాళ్లను సొంతం చేసుకొని…ఇక సమరమే అంటున్నాయి. ఐపీఎల్ లో 160 మంది క్రికెటర్లు…. మొత్తం 160 మంది క్రికెటర్లలో….తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో కోనసీమకు చెందిన […]

ఐపీఎల్ -12 లో తెలుగు వెలుగులు
X
  • ఆంధ్ర, తెలంగాణా క్రికెటర్లకు భలే చాన్స్
  • జైపూర్ లో ముగిసిన 12వ సీజన్ వేలం
  • ఆరుగురు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లకు ఐపీఎల్ కాంట్రాక్టు

ఐపీఎల్ 12వ సీజన్ వేలం హంగామా జైపూర్ లో ముగిసింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు…వేలం ద్వారా తమ అవసరాలకు తగిన ఆటగాళ్లను సొంతం చేసుకొని…ఇక సమరమే అంటున్నాయి.

ఐపీఎల్ లో 160 మంది క్రికెటర్లు….

మొత్తం 160 మంది క్రికెటర్లలో….తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో కోనసీమకు చెందిన ఓ ఆల్ రౌండర్, దుగ్గిరాలకు చెందిన పేస్ బౌలర్ , హైదరాబాదీ మెరుపు ఫాస్ట్ బౌలర్ సైతం ఉన్నారు.

భారత దేశవాళీ టీ-20 క్రికెట్ ఐపీఎల్ అంటే … ఓ పండుగ, ఓ సంరంభం…ఓ హంగామా. వేలం నుంచి చీర్ గాళ్స్ చిందుల వరకూ…. లీగ్ దశ పోటీల నుంచి టైటిల్ సమరం వరకూ…ఈ ధూమ్ ధామ్ క్రికెట్లో సందడే సందడి.

2019 ఐపీఎల్ సీజన్ కోసం…జైపూర్ లో తొలిసారిగా నిర్వహించిన వేలం కార్యక్రమం ద్వారా…మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు…తమ అవసరాలకు తగిన ఆటగాళ్లను సొంతం చేసుకొని …తుదిజట్ల కూర్పును ఖరారు చేసుకొని మరీ సమరానికి సై అంటున్నాయి.

ఆరుగురు మాత్రమే తెలుగు క్రికెటర్లు…

మొత్తం 354 మంది స్వదేశీ, విదేశీ క్రికెటర్ల నుంచి…కేవలం 60 మంది ఆటగాళ్లను మాత్రమే వివిధ ఫ్రాంచైజీలు వేలం ద్వారా తమతమ జట్లలో తీసుకొన్నాయి. ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన 160మందికి పైగా ఆటగాళ్లలో …తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మాత్రమే ఉన్నారంటే ఆశ్చర్యపోవలిసిందే.

రిటెయినర్లుగా రాయుడు, బుయ్, సిరాజ్….

గత ఏడాది నిర్వహించిన వేలం ద్వారా…అంబటి రాయుడు, మహ్మద్ సిరాజుద్దీన్, రికీ బుయ్ లాంటి క్రికెటర్లు వివిధ జట్లలో చోటు సంపాదిస్తే…ప్రస్తుత సీజన్ వేలం ద్వారా…ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారి, ఆల్ రౌండర్ బండారు అయ్యప్ప, పేస్ బౌలర్ పృథ్వీరాజ్ …ఢిల్లీ, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లలో చేరారు.

2018 ఐపీఎల్ సీజన్ వేలంలో…తెలుగుతేజం అంబటి రాయుడును …చెన్నై ఫ్రాంచైజీ 2 కోట్ల 20 లక్షల రూపాయల ధరకే సొంతం చేసుకొంది. అంతేకాదు…వచ్చే సీజన్ కు సైతం…రాయుడును తమజట్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది.

2 కోట్ల 60 లక్షల సిరాజ్….

ఇక…హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజుద్దీన్ సైతం…గత సీజన్లోనే 2 కోట్ల 60 లక్షల రూపాయల వేలం ధరకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో చోటు సంపాదించాడు.

అంతేకాదు..2019 ఐపీఎల్ సీజన్ కు సైతం సిరాజ్ ను తమజట్టులోని కొనసాగించాలని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం నిర్ణయించింది.

భారత జూనియర్ క్రికెటర్, ఆంధ్ర మిడిలార్డర్ ఆటగాడు రికీ బుయ్ సైతం…గత సీజన్లోనే 20 లక్షల రూపాయల ధరకు… హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో చోటు సంపాదించాడు.

ప్రస్తుత 12వ సీజన్లో సైతం రికీ బుయ్ ను …హైదరాబాద్ ఫ్రాంచైజీ రిటైయిన్ చేసుకోడం ద్వారా భుజం తట్టి మరోసారి ప్రోత్సహించింది.

విహారికి 2 కోట్ల ధర….

ఇక…జైపూర్ లో ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్ వేలం లో మాత్రం…ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారి, ఆల్ రౌండర్ అయ్యప్ప, ఫాస్ట్ బౌలర్ పృథ్వీరాజ్…ఢిల్లీ, కోల్ కతా ఫ్రాంచైజీల జట్లలో చోటు సంపాదించగలిగారు.

ఇండియా-ఏ జట్టులో సభ్యుడిగా నిలకడగా రాణించడం ద్వారా…భారత టెస్టు జట్టులో చోటు సంపాదించిన ఆంధ్ర రంజీ కెప్టెన్ , కాకినాడ కుర్రాడు హునుమ విహారికి…ఐపీఎల్ వేలంలో అనూహ్యంగా 2 కోట్ల రూపాయల ధర పలికింది.

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన రెండోటెస్టులో పార్ట్ టైమ్ బౌలర్ గా, స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా ఆడిన హనుమ విహారిని…. ఢిల్లీ ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది. 2019 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున విహారి … ఆల్ రౌండర్ పాత్ర పోషించ బోతున్నాడు.

అయ్యప్పకు 20 లక్షలు….

కోనసీమలోని రాజోలులో క్రికెట్ ఓనమాలు దిద్దుకొని…ఆంధ్ర రంజీజట్టులో చోటు సంపాదించడం ద్వారా…ఐపీఎల్ స్థాయికి ఎదిగిన ఆల్ రౌండర్ బండారు అయ్యప్ప. అయ్యప్ప కనీస వేలం ధర 20 లక్షలుగా ఉంటే…అదే ధరకు ఢిల్లీ ఫ్రాంచైజీ అయ్యప్పను సొంతం చేసుకొంది.

ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లు రబాడా, ఇశాంత్ శర్మ, క్రిస్ మాథ్యూస్ లాంటి దిగ్గజాలతో కలసి….రిక్కీ పాంటింగ్ శిక్షణలో అయ్యప్ప సిద్ధం కాబోతున్నాడు.

కోల్ కతా జట్టులో పృథ్వీ రాజ్….

మరోవైపు…గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన 19 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ పృథ్వీరాజ్ సైతం…ఐపీఎల్ వేలం ద్వారా…కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు.

ఎడమచేతివాటం పేసర్ గా తొలిసీజన్లోనే సత్తా చాటుకొన్న పృథ్వీరాజ్ ను 20 లక్షల రూపాయల కనీసధరకు….కోల్ కతా ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది.

ముగ్గురే కోటీశ్వరులు….

ఈ ఆరుగురు ఆటగాళ్లలో … సిరాజ్, రాయుడు, విహారి మాత్రమే 2 కోట్ల రూపాయలకు పైగా కాంట్రాక్టులు అందుకొని…ఐపీఎల్ కరోడ్ పతులుగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు అంచనాలకు మించి రాణించడం ద్వారా…ఇటు తెలంగాణ… అటు ఆంధ్ర క్రికెట్ అభిమానులు గర్వించేలా చేయాలని కోరుకొందాం.

First Published:  23 Dec 2018 7:00 AM GMT
Next Story