Telugu Global
NEWS

జగన్‌ పేరుతో డబ్బులు వసూలు...

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరుతో ఒక ముఠా దందాకు దిగింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ కొందరు పార్టీ నేతల నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించింది. పది రోజులుగా ఈ వ్యవహారం సాగుతోంది. దీన్ని గుర్తించిన వైసీపీ నేతలు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్‌ వ్యక్తిగత సహాయకుడు వినియోగిస్తున్న అధికారిక నెంబర్‌ను స్పూఫింగ్‌ చేసి దాని ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ […]

జగన్‌ పేరుతో డబ్బులు వసూలు...
X

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరుతో ఒక ముఠా దందాకు దిగింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ కొందరు పార్టీ నేతల నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించింది. పది రోజులుగా ఈ వ్యవహారం సాగుతోంది. దీన్ని గుర్తించిన వైసీపీ నేతలు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జగన్‌ వ్యక్తిగత సహాయకుడు వినియోగిస్తున్న అధికారిక నెంబర్‌ను స్పూఫింగ్‌ చేసి దాని ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు ఈ తరహా కాల్స్ వస్తున్నాయి.

స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్ అందించే వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో అనేకం ఉండడంతో వాటి ద్వారా స్పూఫింగ్ సాప్ట్‌వేర్‌ను కొనుగోలు చేసేనట్టు భావిస్తున్నారు. ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని అందులోకి ఎంటర్‌ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్‌ నంబర్‌తోపాటు ఫోన్‌కాల్‌ అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్‌ రిసీవ్‌ చేసుకునేప్పుడు అతడి సెల్‌ఫోన్‌లో ఎవరి నంబర్‌ డిస్‌ప్లే కావాలో ముందుగానే పొందుపరుస్తారు.

ఈ యాప్ ను అవకాశంగా తీసుకుని జగన్‌ వ్యక్తిగత సహాయకుడి నెంబర్‌ను వాడుకున్నారు దుండగులు. ఫోన్ రాగానే జగన్‌ వ్యక్తిగత సహాయకుడి పేరు మొబైల్‌లో డిస్‌ప్లే అవుతుండడంతో … నిజమైన ఫోన్‌ కాల్‌గా వైసీపీ నేతలు నమ్మేస్తున్నారు. ఫోన్‌ తీయగానే జగన్‌ తరహాలో మాటలు వినిపిస్తున్నాయి. తాను పాదయాత్రలో ఉన్నానని, మిగిలిన విషయాలు చర్చించేందుకు వేరే వ్యక్తి సంప్రదిస్తారని చెబుతూ ఫోన్‌ కట్‌ చేస్తున్నాడు. ఆ వెంటనే వాట్సాప్‌ ద్వారా నేతలతో నకిలీ ముఠా చర్చలకు దిగుతోంది.

వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో బిజీగా ఉన్నారని చెబుతూ వెంటనే రూ.10 లక్షలు విశాఖపట్నం పంపించాలని సైబర్‌ నేరగాళ్లు సూచిస్తున్నారు. అంతేకాదు… వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఉన్నందున ఆయనకు కాల్‌ చేసి డిస్ట్రబ్‌ చేయవద్దని, ఆయనే మీకు కాల్‌ చేస్తారంటూ కూడా మోసగాళ్లు సూచిస్తున్నారు.

ఈ వాట్సాప్‌ నెంబర్‌ డీపీగా ఎంపీ పూనం మహజన్ ఫోటో కనిపిస్తోంది. + 1(507)407–9047 నెంబర్‌ ద్వారా దుండగులు వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారు. వెంటనే 10 లక్షలు పంపించాలంటూ నేతలకు వాట్సాప్‌లో సూచిస్తున్నారు.

ఈ విషయాన్ని గుర్తించిన వైసీపీ నేతలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ముఠా మాయలో పడి వైసీపీ నేతలెవరైనా డబ్బులు చెల్లించారా అన్నది ఇంకా తెలియడం లేదు.

First Published:  24 Dec 2018 9:43 PM GMT
Next Story