Telugu Global
NEWS

హైదరాబాద్ నుంచి పావురాలను పంపించేద్దాం!

హైదరాబాద్ మహానగరంలో పావురాల సంఖ్య అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా పావురాలు కనిపిస్తూనే ఉంటాయి. పావురాల సంఖ్య ఏటా కనివిని ఎరుగని రీతిలో పెరిగిపోతూనే ఉంది. ఈ పరిణామం చివరకు పక్షుల ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. పావురాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్ల హైదరాబాద్ నగరంలో ఇతర పక్షి జాతులు మనుగడ సాగించలేక పోతున్నాయి. పావురాల డామినేషన్‌ భరించలేక ఇతర జాతుల పక్షులు నగరాన్ని వదిలేస్తున్నట్టు అధికారులు […]

హైదరాబాద్ నుంచి పావురాలను పంపించేద్దాం!
X

హైదరాబాద్ మహానగరంలో పావురాల సంఖ్య అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా పావురాలు కనిపిస్తూనే ఉంటాయి. పావురాల సంఖ్య ఏటా కనివిని ఎరుగని రీతిలో పెరిగిపోతూనే ఉంది. ఈ పరిణామం చివరకు పక్షుల ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి.

పావురాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్ల హైదరాబాద్ నగరంలో ఇతర పక్షి జాతులు మనుగడ సాగించలేక పోతున్నాయి. పావురాల డామినేషన్‌ భరించలేక ఇతర జాతుల పక్షులు నగరాన్ని వదిలేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇతర పక్షులు పెట్టుకున్న గూళ్లను కూడా పావురాలు ఆక్రమిస్తున్నట్టు తేల్చారు.

ఇలా ఇతర జాతుల పక్షుల ఉనికిని పావురాలు పాడు చేస్తున్నాయని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పావురాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

పావురాల సంఖ్య ఇలా హైదరాబాద్‌లో ఇష్టారాజ్యంగా పెరిగిపోవడానికి ప్రజలే కారణమని నిపుణులు చెబుతున్నారు. పక్షుల మీద ప్రేమతో తెలిసీ తెలియక చాలా మంది పట్టణవాసులు పావురాలకు గింజలు వేయడం, ఆహారం అందించడం చేస్తున్నారని… దీని వల్ల పావురాల సంతతి వేగంగా పెరుగుతోందని చెబుతున్నారు.

గతంలో ఇతర జాతుల పక్షులు నివసించిన గూడు కూడా ఇప్పుడు పావురాల ఆక్రమణలోకి వచ్చినట్టు గుర్తించామని తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు.

పావురాల వల్ల మనిషికి తీవ్ర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని డాక్టర్‌ అప్తార్‌ అహ్మద్ హెచ్చరించారు. పావురాల ఈక ముక్కలు కొన్ని అతి సూక్ష్యంగా ఉంటాయని… అవి గాలి ద్వారా ముక్కులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అది జరిగితే తీవ్ర శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయని వివరించారు.

పావురాల మలం వల్ల కూడా ప్రమాదం ఉందని వివరించారు. పావురాల మలం కలిసిన నీటిని తాగినట్టయితే ఊపిరితిత్తులకు ఇబ్బందులు వస్తాయని వెల్లడించారు. అనేక వైరస్‌లు కూడా పావురాల ద్వారానే సులువుగా మనుషుల్లో విస్తరిస్తున్నాయని వైద్యుడు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో నగరంలో పావురాలకు ప్రజలు గింజలు, ఇతర ఆహారం వేయడాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని పక్షుల సంరక్షణ సంఘాలు కూడా కోరుతున్నాయి. పర్యావరణ సమతుల్యత సాధించేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదంటున్నారు.

First Published:  10 Jan 2019 2:26 AM GMT
Next Story