Telugu Global
NEWS

మంత్రి వర్గ విస్తరణ ఆలస్యంపై నాయకుల గుర్రు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీరుపై నాయకులు పెదవి విరుస్తున్నారు. ఎన్నికలు జరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగక పోవడం పట్ల పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అచ్చంగా అన్నీ తానే నడిపిస్తాం అంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల పార్టీ సీనియర్ నాయకులు, గెలిచిన సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ శాసన సభ్యుల సంఖ్యను […]

మంత్రి వర్గ విస్తరణ ఆలస్యంపై నాయకుల గుర్రు
X

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీరుపై నాయకులు పెదవి విరుస్తున్నారు. ఎన్నికలు జరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగక పోవడం పట్ల పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అచ్చంగా అన్నీ తానే నడిపిస్తాం అంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల పార్టీ సీనియర్ నాయకులు, గెలిచిన సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ శాసన సభ్యుల సంఖ్యను బట్టి పదహారు మందితో మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోం మంత్రి మహమ్మద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ నాయకుడు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ని స్పీకర్ గా నియమించారు. ఈ ముగ్గురు మినహా మిగిలిన వారు ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమించారు కేసీఆర్.

తెలంగాణలో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక పదవుల పందారం ఉంటుందని ఆశించిన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎనిమిది మందితో విస్తరణ అని ఒకసారి, పది మందితో విస్తరణ అని మరొకసారి, లోక్ సభ ఎన్నికల తర్వాత విస్తరణ అని మరోసారి ఇలా లీకులు మీద లీకులు ఇస్తూ ఆడుకుంటున్నారు.

జాతకాలను ముహూర్తాలను నమ్మే కే చంద్రశేఖరరావు మంత్రివర్గ విస్తరణ ముహూర్తాన్ని కూడా లీకులు గా వదులుతూ పార్టీ సీనియర్లను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఒకసారి, యాగాల పేరుతో ఒక సారి, అనారోగ్య కారణాలతో మరొకసారి క్యాబినెట్ విస్తరణ వాయిదా వేస్తున్నారంటూ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు.

అయితే, ఎవరి దగ్గర ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అనే భయంతో కిం అనకుండా కుక్కిన పేనుల్లా పడిఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్దతి కాదని వారు హితవు పలుకుతున్నారు.

అయితే ఇప్పుడిప్పుడే పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బంపర్‌ మెజారిటీ రాకూడదని టీఆర్‌ఎస్‌ నాయకులు కోరుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లోనే బొటాబొటీగా గెలిచి ఉంటే కేసీఆర్‌కు ఇంత అహంకారం ఉండేది కాదని…. వచ్చే ఎన్నికల్లో అయినా కాస్త ఎదురుదెబ్బ తగిలితే బాగుండని పార్టీ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

First Published:  31 Jan 2019 9:01 PM GMT
Next Story