Telugu Global
NEWS

భారత మహిళా క్రికెట్లో మరాఠా మెరికలు....

భారత మహిళా స్టార్ క్రికెటర్లు అనగానే…మిథాలీరాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. ముంబైలో పుట్టి.. భారత మహిళా క్రికెట్లోకి దూసుకొచ్చిన మరాఠా మెరికలు స్మృతి మందానా, జెమీమా రోడ్రిగేజ్ అంచనాలకు మించి రాణించి వారేవ్వా అనిపించుకొంటున్నారు. ప్రపంచ మహిళా క్రికెట్లో సుదీర్ఘకాలం రాణించగలమంటూ చెప్పకనే చెబుతున్నారు…. ఇద్దరూ ఇద్దరే….  ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశం భారత్. పేరుకు జాతీయక్రీడ హాకీ మాత్రమే అయినా…క్రికెట్ అనధికారిక జాతీయక్రీడగా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ […]

భారత మహిళా క్రికెట్లో మరాఠా మెరికలు....
X

భారత మహిళా స్టార్ క్రికెటర్లు అనగానే…మిథాలీరాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. ముంబైలో పుట్టి.. భారత మహిళా క్రికెట్లోకి దూసుకొచ్చిన మరాఠా మెరికలు స్మృతి మందానా, జెమీమా రోడ్రిగేజ్ అంచనాలకు మించి రాణించి వారేవ్వా అనిపించుకొంటున్నారు. ప్రపంచ మహిళా క్రికెట్లో సుదీర్ఘకాలం రాణించగలమంటూ చెప్పకనే చెబుతున్నారు….

ఇద్దరూ ఇద్దరే….

ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశం భారత్. పేరుకు జాతీయక్రీడ హాకీ మాత్రమే అయినా…క్రికెట్ అనధికారిక జాతీయక్రీడగా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తోంది. భారత క్రికెట్ అనగానే పురుషుల క్రికెట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. పురుషుల క్రికెట్ తో పోల్చిచూస్తే ఈమధ్య కాలం వరకూ మహిళాక్రికెట్ కు లభిస్తున్న ఆదరణ అంతంత మాత్రమే.

ఐసీసీ ఆదేశాలతో మహిళా క్రికెట్ ను సైతం బీసీసీఐకి అనుబంధంగా చేర్చుకోడంతో…మహిళా క్రికెట్ కు ప్రోత్సాహం, ఆదరణతో పాటు ప్రచారం కూడా గణనీయంగా పెరిగింది. గత మూడు దశాబ్దాలుగా పడుతూ లేస్తూ వచ్చిన భారత మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి ఒకరిద్దరు ప్లేయర్లు మాత్రమే… స్టార్ ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

మిథాలీకి వారసులు….

వన్డే క్రికెట్లో 34 ఏళ్ల మిథాలీ, టీ-20 క్రికెట్లో హర్మన్ ప్రీత్ కౌర్ ప్రధాన క్రికెటర్లుగా కొనసాగుతున్నారు. అయితే…ఈ ఇద్దరినీ మించిన సత్తా తమలో ఉందని మరాఠా మెరుపుతీగలు 22 ఏళ్ల స్మృతి మందానా, 18 ఏళ్ల జెమీమా రోడ్రిగేస్ తమ ఆటతీరుతో చాటుకొంటూ వస్తున్నారు.

మెరుపు ఓపెనర్ స్మతి ….

భారత మహిళా క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నమ్మదగిన ఓపెనర్ ఎవరంటే… ముంబై ప్లేయర్ స్మృతి మందానా అని మాత్రమే చెప్పాలి. ఎడమచేతి వాటం ఓపెనర్ గా, నిలకడగా రాణించే ప్లేయర్ గా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకొన్న స్మృతి ..ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డులను సైతం గెలుచుకొంది.

వన్డేల్లో వండర్ ఓపెనర్….

16 ఏళ్ల వయసులోనే భారత వన్డే జట్టులో చోటు సంపాదించిన స్మృతి మందానా…బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా 2013 సిరీస్ లో వన్డే అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి భారత బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్, టీ-20 ప్రపంచకప్ టోర్నీల్లో మందానా నిలకడగా రాణించడం ద్వారా స్టార్ ప్లేయర్ల జాబితాలో చేరిపోయింది.

న్యూజిలాండ్ తో ఇటీవల ముగిసిన రెండోవన్డే వరకూ…తన కెరియర్ లో 45 మ్యాచ్ లు ఆడిన మందానా 16092 పరుగులు సాధించింది. ఇందులో నాలుగు శతకాలు, 13 అర్థశతకాలు సైతం ఉన్నాయి.

దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా టీ-20 క్యాప్ అందుకొన్న మందానా ఇప్పటి వరకూ ఆడిన 50 మ్యాచ్ ల్లో 83 పరుగులు అత్యధిక స్కోరుతో మొత్తం 1046 పరుగులు సాధించింది. ఆరు హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.

ముంబై చిచ్చరపిడుగు జెమీమా….

భారత మహిళా క్రికెట్ కు ముంబై అందించిన అపురూపకానుక 18 ఏళ్ల జెమీమా రోడ్రిగేస్. ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టి.. సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తూ వచ్చిన జెమీమాకు ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గా పేరుంది.

17 ఏళ్ల చిరుప్రాయంలోనే భారత సీనియర్ జట్టులో చేరిన జెమీమా 2018 సిరీస్ లో ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వన్డే క్యాప్ అందుకొంది. టీ-20 ల్లో మాత్రం సౌతాఫ్రికా ప్రత్యర్థిగా తొలిమ్యాచ్ ఆడిన జెమీమా..ఇప్పుడు భారతజట్టులో ఓ కీలక ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకొంది.

మందానా- జెమీమా జోరు…

భారత మహిళాజట్టు ప్రధాన శిక్షకుడుగా రామన్ బాధ్యతలు చేపట్టడంతోనే…జట్టు కూర్పులో మార్పులు చేర్పులు చేశారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలివన్డేలో… ప్రధాన ఓపెనర్ స్మృతి మందానాకు జంటగా జెమీమాను బరిలోకి దించారు.

నేపియర్ మెక్లీన్ పార్క్ వేదికగా ముగిసిన తొలివన్డేలో న్యూజిలాండ్ పై…భారత ఓపెనర్లు స్మృతి మంధానా- జెమీమా రోడ్రిగేస్ వీరవిహారం చేశారు. మొదటి వికెట్ కు సరికొత్త రికార్డు నెలకొల్పారు.

193 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన తమ జట్టుకు..190 పరుగుల భారీ భాగస్వామ్యంతో 9 వికెట్ల విజయం అందించారు.

20 ఏళ్ల ఓపెనర్ స్మృతి మంధానా 104 బాల్స్ లో 105 పరుగులకు అవుట్ కాగా, 18 ఏళ్ల జెమీమా 81 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచింది. ఈ ఇద్దరూ కేవలం 32.2 ఓవర్లలోనే 190 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయటం విశేషం.

స్మృతి సెంచరీలో 3 సిక్సర్లు, 9 బౌండ్రీలు, జెమీమా హాఫ్ సెంచరీలో 9 బౌండ్రీలు ఉన్నాయి. తన వన్డే కెరియర్ లో స్మృతి మంధానాకు ఇది నాలుగో శతకం కాగా… యంగ్ గన్ జెమీమాకు తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

రికార్డు భాగస్పామ్యం….

న్యూజిలాండ్ ప్రత్యర్థిగా భారత ఓపెనర్లు 190 పరుగులతో అతిపెద్ద భాగస్వామ్యం నమోదు చేయటం ఇదే మొదటిసారి.

ఈ ఇద్దరి ఆటతీరు చూస్తుంటే…భారత్ ను సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న కుదురైన ఓపెనర్ల జోడీ సమస్య తీరినట్లే కనిపిస్తోంది.

స్మృతి మందానా, జెమీమా లాంటి నవతరం ప్లేయర్ల స్ఫూర్తితో మరింతమంది యువతులు క్రికెట్ ను తమ కెరియర్ ను ఎంచుకోడం ఖాయమని బీసీసీఐ భావిస్తోంది.

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో లేడీస్ సైతం రాణిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది మరి!

First Published:  3 Feb 2019 6:30 AM GMT
Next Story