Telugu Global
NEWS

 భారత టేబుల్ టెన్నిస్ యువరాణి మనీకా బాత్రా....

భారత టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనీకా బాత్రా శకానికి తెరలేచింది. గత ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ లో సాధించిన అసాధారణ విజయాలతో… 23 ఏళ్ల మనీకా టీటీ రాణిగా నిలిచింది. ప్రపంచ మహిళల మొదటి 50 మంది అత్యుత్తమ ప్లేయర్ల జాబితాలో చోటు సంపాదించింది. ప్రపంచ క్రీడ టేబుల్ టెన్నిస్ లో ..చైనా, జపాన్, కొరియా, స్వీడన్, జర్మనీ, హాంకాంగ్, సింగపూర్, నైజీరియా లాంటి దేశాల ఆధిపత్యానికి భారత్ సవాలు విసిరే రోజులు […]

 భారత టేబుల్ టెన్నిస్ యువరాణి మనీకా బాత్రా....
X

భారత టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనీకా బాత్రా శకానికి తెరలేచింది. గత ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ లో సాధించిన అసాధారణ విజయాలతో… 23 ఏళ్ల మనీకా టీటీ రాణిగా నిలిచింది. ప్రపంచ మహిళల మొదటి 50 మంది అత్యుత్తమ ప్లేయర్ల జాబితాలో చోటు సంపాదించింది.

ప్రపంచ క్రీడ టేబుల్ టెన్నిస్ లో ..చైనా, జపాన్, కొరియా, స్వీడన్, జర్మనీ, హాంకాంగ్, సింగపూర్, నైజీరియా లాంటి దేశాల ఆధిపత్యానికి భారత్ సవాలు విసిరే రోజులు వచ్చాయి.

క్రికెట్టే ఊపిరిగా భావించే భారత్ లో… టేబుల్ టెన్నిస్ సైతం గత కొద్ది దశాబ్దాలుగా తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తోంది.

భారత టేబుల్ టెన్నిస్ అనగానే… జగన్నాథ్, కమలేశ్ మెహ్తా, చంద్రశేఖర్, ఇందూ పూరి, మోనాలిసా బారువా, ఆచంట శరత్ కమల్ లాంటి మేటి క్రీడాకారులు అతికొద్దిమంది మాత్రమే గుర్తుకు వస్తారు.

చదరంగం, షూటింగ్, కుస్తీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడలతో పోల్చిచూస్తే…. టేబుల్ టెన్నిస్ లో మన క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో సాధించిన విజయాలు, పతకాలు అంతంత మాత్రమే.

గోల్డ్ కోస్ట్ లో గోల్డ్ రష్….

భారత టేబుల్ టెన్నిస్ ఉనికికోసం నానాపాట్లు పడుతున్న సమయంలో…. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ ఫలితాలు కొత్తఊపిరి పోశాయి. సింగపూర్, నైజీరియా దేశాల సంపూర్ణ ఆధిపత్యంలో ఉండే కామన్వెల్త్ గేమ్స్..

టీటీ పురుషుల, మహిళల విభాగాలలో భారత్…12 ఏళ్ల విరామం తర్వాత బంగారు పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలుగుతేజం శరత్ కమల్ నాయకత్వంలోని పురుషుల జట్టు, ఢిల్లీ మెరుపుతీగ మనీకా బాత్రా కెప్టెన్సీలోని మహిళాజట్టు టీమ్ బంగారు పతకాలతో వెలిగిపోయాయి.

పురుషుల, మహిళల టీమ్, వ్యక్తిగత విభాగాలలో భారత టీటీ క్రీడాకారులు ఏకంగా ఎనిమిది పతకాలు సాధించారు. ఇందులో భారత మహిళా టీటీ సంచలనం మనీకా బాత్రా సాధించినవే నాలుగు పతకాలు ఉన్నాయి. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న భారత అత్యుత్తమ అథ్లెట్ గా మనీకా బాత్రా గుర్తింపు తెచ్చుకొంది.

సచిన్ స్ఫూర్తితో….

నాలుగేళ్ల చిరుప్రాయంలోనే టీటీ ర్యాకెట్ చేతపట్టిన మనీకా….ఆట కోసం చదువునే త్యాగం చేసింది. ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కళాశాలలో చదువుతూ అర్థంతరంగా చదువుకు దూరమయ్యింది. మాస్టర్ సచిన్ టెండుల్కర్ స్ఫూర్తి, సీనియర్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ ప్రేరణతో పూర్తిస్థాయిలో టేబుల్ టెన్నిస్ పైనే దృష్టి కేంద్రీకరించింది.

ఒడ్డుపొడుగుకు తగ్గ అందం ఉండడంతో మనీకాకు మోడలింగ్ లోనూ తగిన అవకాశాలు వచ్చినా…తిరస్కరించింది. సోదరుడు సాహిల్, అక్క ఆంచల్ ఇద్దరూ టీటీ ప్లేయర్లే కావడంతో…..అదే క్రీడలో తాను దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ …అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకురావాలని పంతం పట్టింది.

శిక్షకుడు సందీప్ గుప్తా నేతృత్వంలో కఠోరసాధన చేసి…ముందుగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది.

పతకాల కొండ….

ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ టీటీ బరిలోకి దిగిన మనీకా… చిలీ ఓపెన్ అండర్ -21 విభాగంలో కాంస్య పతకంతో బోణీ కొట్టింది. ఆ తర్వాత జరిగిన 12వ దక్షిణాసియా క్రీడల టీటీలో సైతం మూడు బంగారు పతకాలు, ఓ రజతం సంపాదించింది.

2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ దూసుకెళ్లిన మనీక పోటీ సెమీస్ వరకూ వెళ్లలేకపోయింది. ఆ తర్వాతి ఏడాది జరిగిన కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో…. మహిళల టీమ్, మహిళల డబుల్స్ విభాగాలలో రజత, మహిళల సింగిల్స్ లో కాంస్య పతకాలు సాధించడం ద్వారా తన సత్తాను చాటుకొంది.

దక్షిణాసియా జోన్ అర్హత పోటీలలో విజేతగా నిలవడం ద్వారా…2016 రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించినా…తొలిరౌండ్లోనే మనీకాకు పరాజయం తప్పలేదు. పోలెండ్ ప్లేయర్ కాట్రాజినా చేతిలో పరాజయం పొందిన

మనీకా మరింత పట్టుదలతో సాధన చేసి…లోపాలను సవరించుకొని…ప్రపంచ స్థాయిలో 58వ ర్యాంక్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకొంది.

కామన్వెల్త్ గేమ్స్ స్టార్ మనీకా….

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో….ఎలాంటి అచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు….టీమ్ విభాగాలలో నైజీరియా, సింగపూర్ జట్లకు బంగారు పతకాలతో గండి కొట్టాయి. ఇక మహిళల టీమ్ వ్యక్తిగత విభాగాలలో 22 ఏళ్ల మనీకా విశ్వరూపమే ప్రదర్శించింది. సింగపూర్ కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంక్ ప్లేయర్ ఫెంగ్ తియాన్ వీపై ఒకసారి కాదు…రెండుసార్లు సంచలన విజయాలు సాధించి…డబుల్ గోల్డ్ సొంతం చేసుకొంది.

మహిళల టీమ్, వ్యక్తిగతంగా మహిళల సింగిల్స్ లో సైతం మనీక బంగారు కొండగా నిలిచింది. మహిళల డబుల్స్ లో మౌమా దాస్ తో జంటగా బంగారు పతకం మ్యాచ్ కు అర్హత సాధించినా…చివరకు రజత పతకంతో సరిపెట్టుకొంది. మిక్సిడ్ డబుల్స్ లో సైతం కాంస్య పతకం గెలుచుకొంది.

కామన్వెల్త్ గేమ్స్ లో మొత్తం 221మంది సభ్యుల అథ్లెట్ల బృందం పతకాలవేటకు దిగితే…మనీకా బాత్రా ఒక్కడే నాలుగు పతకాలు సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. భారత అత్యుత్తమ అథ్లెట్ గౌరవం దక్కించుకొంది. ిఇప్పటికే ప్రపంచ 4వ ర్యాంక్ ప్లేయర్ ను ఓడించిన మనీక తన ర్యాంక్ ను 58 నుంచి 47కు మెరుగుపరచుకోగలిగింది.

ఆసియాక్రీడల్లో అరుదైన పతకం….

జకార్తా వేదికగా ముగిసిన 2018 ఆసియాక్రీడల టేబుల్ టెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ విభాగంలో భారత్ తొలిసారిగా కాంస్య పతకం గెలుచుకోడంలో…మనీకా తనవంతు పాత్ర నిర్వర్తించింది. శరత్ కమల్ తో జంటగా.. పతకం వేటకు దిగిన మనీక….సెమీస్ లో ఓటమి ఎదురైనా కాంస్యపతకంతో పోటీలను ముగించింది. ఆసియాక్రీడల టీటీ చరిత్రలో పతకం సాధించిన భారత తొలి మహిళా టీటీ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది.

అరుదైన రికార్డుల మనీకా….

ప్రపంచ మహిళా టీటీ మొదటి 50 మంది అత్యుత్తమ ప్లేయర్ల జాబితాలో మనీక తొలిసారిగా చోటు సంపాదించింది. ప్రపంచ టీటీ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం మనీకా బాత్రా 47వ స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా టీటీ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది.

అంతేకాదు…గోల్డ్ కోస్ట్ వేదికగా గత ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో మనీకా బాత్రా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది. ఇందులో మహిళల సింగిల్స్, టీమ్ విభాగాల బంగారు పతకాలు సైతం ఉన్నాయి. జకార్తా ఆసియా క్రీడల్లో సైతం మనీకా మిక్సిడ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సంపాదించింది.

తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ తో కలసి జంటగా మిక్సిడ్ డబుల్స్ బరిలోకి దిగిన మనీకా బ్రాంజ్ మెడల్ అందుకొంది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో పతకాలతో పాటు…ప్రపంచ ర్యాంకింగ్స్ 47వ ర్యాంక్ సాధించిన భారత తొలి మహిళగా మనీకా బాత్రా చరిత్ర సృష్టించింది.

భారత బ్యాడ్మింటన్ కు సింధు, సైనా, భారత టెన్నిస్ కు సానియా తెచ్చిన గుర్తింపునే…తాను టేబుల్ టెన్నిస్ క్రీడకు తీసుకురాగలిగితే….తన త్యాగం, కృషి , అంకితభావం ఫలించినట్లేనని మనీకా గట్టిగానమ్ముతోంది.

First Published:  11 Feb 2019 9:16 PM GMT
Next Story