Telugu Global
NEWS

కొత్త వారితో ప్రయోగం... వ్యూహమేనా ?

కల్వకుంట్ల చంద్రశేఖర రావు…. రాజకీయ నాయకుడు, మేథావి, అపర చాణుక్యుడు, వ్యూహ రచనలో దిట్ట. అన్ని యుద్ధముల ఆరితేరిన వాడు. అవును. అన్ని యుద్ధములలోనూ కె.చంద్రశేఖర రావు ఆరి తేరారు. అందుకు తెలంగాణ ప్రత్యేక ఉద్యమమే పెద్ద ఉదాహరణ. అంతటి నాయకుడు ఏ పని చేసినా ఏదో వ్యూహం దాగి ఉంటుందని తల పండిన రాజకీయ విశ్లేషకులకే కాదు… ఇప్పుడిప్పుడే రాజకీయాలలోకి వచ్చిన వారికి కూడా తెలుస్తుంది. తెలంగాణకు మధ‌్యంతర ఎన్నికలు తీసుకువచ్చి అప్రతిహతంగా విజయం సాధించడం […]

కొత్త వారితో ప్రయోగం... వ్యూహమేనా ?
X

కల్వకుంట్ల చంద్రశేఖర రావు…. రాజకీయ నాయకుడు, మేథావి, అపర చాణుక్యుడు, వ్యూహ రచనలో దిట్ట. అన్ని యుద్ధముల ఆరితేరిన వాడు. అవును. అన్ని యుద్ధములలోనూ కె.చంద్రశేఖర రావు ఆరి తేరారు. అందుకు తెలంగాణ ప్రత్యేక ఉద్యమమే పెద్ద ఉదాహరణ.

అంతటి నాయకుడు ఏ పని చేసినా ఏదో వ్యూహం దాగి ఉంటుందని తల పండిన రాజకీయ విశ్లేషకులకే కాదు… ఇప్పుడిప్పుడే రాజకీయాలలోకి వచ్చిన వారికి కూడా తెలుస్తుంది. తెలంగాణకు మధ‌్యంతర ఎన్నికలు తీసుకువచ్చి అప్రతిహతంగా విజయం సాధించడం కూడా కల్వకుంట్ల వారి రాజకీయ ఎత్తుగడలో భాగమే.

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ తన క్యాబినెట్ విస్తరణలో మాత్రం ఆచి తూచి వ్యవహరించారు. పత్రికలకు లీకులు ఇస్తూ… ఇదిగో… అదిగో అంటూ నాన్చారు. దీని వెనుక కూడా ఏదో వ్యూహం దాగి ఉందని అందరూ భావించేలా చేశారు.

తీరా మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం పెట్టి… ఎవరు మంత్రులు అని చెప్పకుండా చివరివరకూ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. దీంతో మీడియాలో ఎవరికి నచ్చిన విధంగా వారు కథనాలు రాసుకుంటున్నారు. అయితే, అధికార పార్టీ పత్రికగా చెప్పుకుంటున్న ఓ పత్రికలో మాత్రం ఈ సారి కొత్త వారికే ఎక్కువ అవకాశాలున్నాయని కథనాలు రాశారు. దీని వెనుక కూడా ఏదో వ్యూహ రచన ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎన్నికల్లో విజయం తర్వాత తన కుమారుడ్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడ్ని చేశారు. దీనికి కూడా కొంత సమయం తీసుకున్నారు. ఆ తర్వాత నెలన్నరకు మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారు. అది కూడా కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇచ్చి సీనియర్లను పక్కన పెడుతున్నారంటున్నారు.

దీనికి కారణం క్యాబినెట్ లో తనకు ఎదురు చెప్పే వారు కాని, ఇలా చేద్దామా అని సలహా ఇచ్చే వారు కాని ఉండకుండా చేసుకోవడమే కారణమని అంటున్నారు. అంతే కాదు… సీనియర్లను పార్టీకి పరిమితం చేస్తే వారి వల్ల ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అన్నది మరో వ్యూహంగా చెబుతున్నారు.

ఇవన్నీ తన కుమారుడికి పట్టాభిషేకం చేయడంలో భాగంగా జరుగుతున్నవే అంటున్నారు. మొత్తానికి కొత్త వారితో మంత్రివర్గ విస్తరణ కూడా ఓ వ్యూహంలో భాగంగానే జరుగుతోందని అంటున్నారు.

First Published:  17 Feb 2019 10:33 PM GMT
Next Story