Telugu Global
NEWS

ఏపీ ప్రజల బ్యాంకు అకౌంట్లను మార్చే డేటా కూడా ఉంది- సైబరాబాద్ సీపీ

ఏపీ ప్రజల డేటా కుంభకోణంలో ఎంతటి పెద్దవారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు సైబరాబాద్ కమిషనర్‌ సజ్జనార్‌. దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించిన సున్నితమై, కీలకమైన డేటా మొత్తం ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వద్ద ఉండడాన్ని గుర్తించామన్నారు. డేటా స్కాంపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులు వేధించడం సరికాదన్నారు. పబ్లిక్‌లో పెట్టడానికి వీల్లేని సున్నితమైన ఏపీ ప్రజల సమాచారం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో […]

ఏపీ ప్రజల బ్యాంకు అకౌంట్లను మార్చే డేటా కూడా ఉంది- సైబరాబాద్ సీపీ
X

ఏపీ ప్రజల డేటా కుంభకోణంలో ఎంతటి పెద్దవారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు సైబరాబాద్ కమిషనర్‌ సజ్జనార్‌. దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించిన సున్నితమై, కీలకమైన డేటా మొత్తం ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వద్ద ఉండడాన్ని గుర్తించామన్నారు.

డేటా స్కాంపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులు వేధించడం సరికాదన్నారు. పబ్లిక్‌లో పెట్టడానికి వీల్లేని సున్నితమైన ఏపీ ప్రజల సమాచారం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారన్నారు. టీడీపీకి చెందిన సేవా మిత్రా యాప్‌ ద్వారా నియోజకవర్గాల వారీగా డేటా సేకరించారని కమిషనర్ వివరించారు.

పట్టుబడిన వారి వద్ద ఉన్న డేటాలో … వైసీపీ ఓటర్లు ఎవరు?,జనసేన ఓటర్లు ఎవరు?, టీడీపీ ఓటర్లు ఎవరు?, తటస్తులు ఎవరు అన్నది నాలుగు కేటగిరీలుగా విభజన చేశారని కమిషనర్‌ వివరించారు. ఓట్లు తొలగించేందుకు ఈ సేవా మిత్రా యాప్‌ను వాడుతున్నట్టు గుర్తించామన్నారు. ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన ప్రజల సున్నితమైన వివరాలు టీడీపీకి చెందిన సేవా మిత్రా యాప్‌లో ఉన్నాయన్నారు కమిషనర్.

ఈ డేటా కేవలం ప్రభుత్వం వద్ద మాత్రమే ఉంటుందని.. అలాంటిది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వచ్చిందంటే దాన్ని బట్టే ఈ డేటా ఎవరి నుంచి వచ్చిందన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. డేటాను దుర్వినియోగం చేసి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నించినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రధాన సూత్రధారి అశోక్ దొరికితే మరిన్ని వివరాలు బయటకొస్తాయన్నారు. అశోక్‌ తనంతకు తాను లొంగిపోయి విచారణకు సహకరించాలన్నారు.

ఏపీ ప్రజల డేటా చోరికీ సంబంధించి పూర్తి సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఈ వ్యవహారం ఓటర్లకు సంబంధించినది కావడంతో ఈసీకి కూడా సమాచారం అందించామన్నారు. ఆధార్‌ డేటా కూడా లీక్ అయినట్టు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామన్నారు. వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారన్నారు. ఏపీ పోలీసుల తీరు సరిగా లేదని సైబరాబాద్ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫిర్యాదుదారుడిని బెదిరించినందుకు ఏపీ పోలీసులపైనా కేసులు నమోదు చేశామన్నారు. ఏపీ పోలీసులకు ఇంత అత్యుత్సాహం ఎందుకని ప్రశ్నించారు. కేసుతో సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకోగానే కేవలం మూడున్నర గంటల్లోనే గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఏపీ పోలీసులు రావాల్సిన అవసరం ఏముందని కమిషనర్‌ ప్రశ్నించారు. నిందితుల వద్ద ఉన్న డేటా ఆధారంగా ప్రజలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల నుంచి ఓటు వరకూ ఎలాంటి మార్పులైనా చేయవచ్చన్నారు.

First Published:  4 March 2019 4:42 AM GMT
Next Story