Telugu Global
NEWS

కిమిడి “లేఖ”ల వెంకట్రావు.... అనే టిడిపి అధ్యక్షుడు!

ఆయన పేరు కిమిడి కళా వెంకట్రావు. పాత తరం నాయకుడు. కళా వెంకట్రావు శిష్యుడైన ఉత్తరాంధ్ర నాయకుడి కుమారుడు. గురువు మీద అభిమానంతో తన కుమారుడికి ఇంటి పేరుతో సహా గురువు గారి పేరు పెట్టుకున్నారు ఆయన. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కిమిడి కళా వెంకట్రావు మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్టీలోనూ ఎన్నో పదవులు పొందారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలకు సరిహద్దు మారుమూల గ్రామం కిమిడి కళా వెంకట్రావుది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ […]

కిమిడి “లేఖ”ల వెంకట్రావు.... అనే టిడిపి అధ్యక్షుడు!
X

ఆయన పేరు కిమిడి కళా వెంకట్రావు. పాత తరం నాయకుడు. కళా వెంకట్రావు శిష్యుడైన ఉత్తరాంధ్ర నాయకుడి కుమారుడు. గురువు మీద అభిమానంతో తన కుమారుడికి ఇంటి పేరుతో సహా గురువు గారి పేరు పెట్టుకున్నారు ఆయన. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కిమిడి కళా వెంకట్రావు మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్టీలోనూ ఎన్నో పదవులు పొందారు.

శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలకు సరిహద్దు మారుమూల గ్రామం కిమిడి కళా వెంకట్రావుది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కళా వెంకట్రావు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడం లోనూ, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రచారం చేయడం లోనూ కిమిడి కళా వెంకట్రావు వెనుక పడ్డారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా ప్రతి అంశానికి బహిరంగ లేఖలు రాస్తూ చేతులు దులుపుకుంటున్నారని అపవాదును గత కొన్నాళ్లుగా కిమిడి కళా వెంకట్రావు మోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీకి దాదాపు నాలుగు బహిరంగ లేఖలు రాశారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ పై బిజెపి ప్రభుత్వం శ్రద్ధ చూపక పోయినప్పుడు కేంద్ర రైల్వే మంత్రి కి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కి కూడా రెండేసి లేఖలు రాశారు కిమిడి కళా వెంకట్రావు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గడచిన నాలుగు సంవత్సరాలలో బహిరంగ లేఖలు రాస్తూనే ఉన్నారు. తమ అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన తర్వాత, తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు టీఆర్ ఎస్ లో చేరిన తర్వాత కూడా కేసీఆర్ కు లేఖలు రాశారు కిమిడి కళా వెంకట్రావు.

ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ను కుత‌కుత‌లాడిస్తున్న‌ ఓటర్ల తొలగింపు అంశంపై కూడా మరో లేఖ రాశారు కిమిడి కళా వెంకట్రావు. విలేకర్ల సమావేశాల్లోనూ, పత్రికా ప్రకటనల ద్వారాను ప్రత్యర్ధుల పై విరుచుకు పడాల్సిన తమ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆ లేఖల మాటున తలదాచుకోవడం సమంజసంగా లేదని పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయితే ‘లేఖల వెంకట్రావు’ అని సంభోదిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  7 March 2019 11:15 PM GMT
Next Story