Telugu Global
National

అసెంబ్లీ రద్దు దిశగా మహారాష్ట్ర, హర్యాణా?

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ‘ముందస్తు’ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ బాటలోనే బీజేపీ ముఖ్యమంత్రులు కూడా పయనించాలని భావిస్తున్నారా..? సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, మోడీ హవా ఉండబోతోంది.. కనుక దాన్ని తమకు అనుకూలంగా మలచుకొని అసెంబ్లీలో కూడా బీజేపీని తిరిగి నిలబెట్టాలని భావిస్తున్నారా అంటే.. జరిగే పరిణామాలు అవుననే అంటున్నాయి. మహారాష్ట్ర, హర్యాణాలోని బీజేపీ ప్రభుత్వాలు రద్దు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో ప్రతీ […]

అసెంబ్లీ రద్దు దిశగా మహారాష్ట్ర, హర్యాణా?
X

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ‘ముందస్తు’ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ బాటలోనే బీజేపీ ముఖ్యమంత్రులు కూడా పయనించాలని భావిస్తున్నారా..? సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, మోడీ హవా ఉండబోతోంది.. కనుక దాన్ని తమకు అనుకూలంగా మలచుకొని అసెంబ్లీలో కూడా బీజేపీని తిరిగి నిలబెట్టాలని భావిస్తున్నారా అంటే.. జరిగే పరిణామాలు అవుననే అంటున్నాయి.

మహారాష్ట్ర, హర్యాణాలోని బీజేపీ ప్రభుత్వాలు రద్దు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో ప్రతీ వారం కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తుంటారు. ఈ వారానికి సంబంధించిన సమావేశం మంగళవారం జరిగింది. అయితే అనూహ్యంగా ఇవాళ కూడా కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. దీనిపై ఆరా తీయగా అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని మహారాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.

ఇక, హర్యాణా ప్రభుత్వం కూడా మహారాష్ట్ర బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో తమ రాష్ట్రానికి కూడా ముందస్తు ఎన్నికలు జరపాలని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నిర్ణయించారు. మూడు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవాళే హర్యాణా అసెంబ్లీ రద్దుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం బయటకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ రెండు అసెంబ్లీలు ముందస్తుకు వెళ్లడానికి నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్తవంగా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది అక్టోబర్ వరకు పదవీ కాలం ఉంది. కాని ఏడు నెలల ముందే ఎన్నికలకు వెళ్లడంపై బీజేపీ అధిష్టానం ముందే రచించిన ప్రణాళిక అని తెలుస్తోంది.

ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన – బీజేపీ ఒక అవగాహను వచ్చాయి. మిగిలిన పార్టీలన్నీ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు రావడం ప్రతిపక్షాలకు పెద్ద దెబ్బ అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

First Published:  7 March 2019 11:07 PM GMT
Next Story