Telugu Global
NEWS

ఏపీలో ఎన్నికల సభలే సభలు !

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, లోక్ స‌భ‌ ఎన్నికలకు ఇక ఎంతో కాలం లేదు. వారం రోజుల లోపే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో దేశవ్యాప్తంగా లోక్ స‌భ‌కు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీల నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దూకుతున్నారు. అసంతృప్తులు, అసమ్మతులు […]

ఏపీలో ఎన్నికల సభలే సభలు !
X

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, లోక్ స‌భ‌ ఎన్నికలకు ఇక ఎంతో కాలం లేదు. వారం రోజుల లోపే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో దేశవ్యాప్తంగా లోక్ స‌భ‌కు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.

రాజకీయ పార్టీల నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దూకుతున్నారు. అసంతృప్తులు, అసమ్మతులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకపక్క ఇవి ఇలా జరుగుతుంటే మరొక పక్క ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా భారీ ఎత్తున బహిరంగ సభలకు, సమావేశాలకు తెర తీస్తున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన భారీ బహిరంగ సభలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భరోసా యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించింది. తిరుపతిలో ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో సభను ఏర్పాటు చేసింది. భరోసా బస్సు యాత్ర సాగిన ప్రతి జిల్లాలోనూ ఓ బహిరంగ సభను నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు.

ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ శివారులోని రామవరప్పాడు లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు ముందు రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేనిఫెస్టో కమిటీ సమావేశమై మ్యానిఫెస్టో ఖరారు చేయనుంది. రామవరప్పాడు భారీ బహిరంగ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలను జగన్మోహన్ రెడ్డి ప్ర‌క‌టించే అవకాశం ఉందంటున్నారు.

ఈ సమావేశం తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ఈ బస్సు యాత్ర ను పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి దాదాపు అన్ని జిల్లాల్లోనూ భారీ బహిరంగ సభలలో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు.

ఇటీవలే రాజకీయ నేత‌గా కొత్త అవతారం ఎత్తిన ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఈనెల 14న రాజమహేంద్రవరం లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం సభలో పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరించనున్నారు. ఈ సభ అనంతరం ఉత్తరాంధ్రలోనూ, ఇత‌ర‌ జిల్లాలలోనూ భారీ సభలను ఏర్పాటు చేసేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది.

ఇక అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 13వ తేదీ నుంచి జిల్లాలలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఇక ముందు చంద్రబాబు నాయుడు పాల్గొనే బహిరంగ సభలు అన్నీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలు, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కూడా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సభలను నిర్వ‌హించే అవ‌కాశం ఉందంటున్నారు.

First Published:  9 March 2019 4:11 AM GMT
Next Story