Telugu Global
NEWS

ఎనిమిది స్థానాల్లో కారు బోల్తా: తెలంగాణ భవన్ అంచనా

“లోక్ సభకు జరుగుతున్న ఎన్నికలలో తెలంగాణలోని 16 స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంటుంది. మిగిలిన ఒక్క స్థానంలోనూ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ  విజయం సాధిస్తుంది” తెలంగాణలోని ఎన్నికల సభలో పాల్గొంటున్న ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చేస్తున్న వ్యాఖ్యలు. తెలంగాణలో ఉన్న అన్ని స్థానాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని కేటీఆర్ చెబుతున్నా… పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని […]

ఎనిమిది స్థానాల్లో కారు బోల్తా: తెలంగాణ భవన్ అంచనా
X

“లోక్ సభకు జరుగుతున్న ఎన్నికలలో తెలంగాణలోని 16 స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంటుంది. మిగిలిన ఒక్క స్థానంలోనూ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ విజయం సాధిస్తుంది” తెలంగాణలోని ఎన్నికల సభలో పాల్గొంటున్న ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చేస్తున్న వ్యాఖ్యలు.

తెలంగాణలో ఉన్న అన్ని స్థానాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని కేటీఆర్ చెబుతున్నా… పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరిపిన అభిప్రాయ సేకరణ కానీ, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణ కానీ చూస్తుంటే ఎనిమిది లోక్ సభ స్థానాల్లో ఓటమి తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే కాంగ్రెస్ పార్టీ గెలిచే లోక్ సభ స్థానాల సంఖ్య మరో రెండు మూడుకు పెరగవచ్చని అంటున్నారు.

ఐదారు నెలల క్రితం తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పరిస్థితికి…. ఇప్పుడున్న పరిస్థితికి మధ్య భారీ తేడాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు చెబుతున్నారు. శాసనసభ ఎన్నికలు కేసీఆర్ కు సంబంధించినవని, లోక్ సభ ఎన్నికలు మాత్రం బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోరుగా ప్రజలు భావిస్తున్నారని అంటున్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు కూడా ఆ పార్టీకి అనుకూలిస్తాయని అంటున్నారు. చేవెళ్ల, మల్కాజ్ గిరి, ఖమ్మం, భువనగిరి, మహబూబ్ నగర్, వరంగల్ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

అభ్యర్థుల మార్పుతో పాటు నాలుగు నెలలుగా తెలంగాణలోని రైతులు, మహిళలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నట్లుగా పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

First Published:  23 March 2019 10:00 PM GMT
Next Story