Telugu Global
NEWS

ఈవీఎంల కొరత.... నిజామాబాద్ ఎన్నిక షెడ్యూల్ మార్పు?

దేశమంతా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పోలింగ్ గురించే చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కూతురు ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారు ఏ కారణాలతో పోటీలో ఉన్నా.. ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిలా మారింది. ఈ ఎన్నికను తొలుత బ్యాలెట్ పద్దతిలో చేస్తామని ఈసీ ప్రకటించినా…. కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించాలని చెప్పడంతో పోలింగ్ షెడ్యూల్ మారే పరిస్థితికి వచ్చింది. తెలంగాణలోని 17 […]

ఈవీఎంల కొరత.... నిజామాబాద్ ఎన్నిక షెడ్యూల్ మార్పు?
X

దేశమంతా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పోలింగ్ గురించే చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కూతురు ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారు ఏ కారణాలతో పోటీలో ఉన్నా.. ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిలా మారింది.

ఈ ఎన్నికను తొలుత బ్యాలెట్ పద్దతిలో చేస్తామని ఈసీ ప్రకటించినా…. కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించాలని చెప్పడంతో పోలింగ్ షెడ్యూల్ మారే పరిస్థితికి వచ్చింది. తెలంగాణలోని 17 స్థానాలకు ఏప్రిల్ 11నే పోలింగ్ నిర్వహిస్తుండగా.. సీఈసీ ఆదేశాలతో నిజామాబాద్ పోలింగ్ తేదీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు బరిలో ఉన్న అభ్యర్థుల ప్రకారం నిజామాబాద్‌కు పోలింగ్ నిర్వహించాలంటే తప్పని సరిగా ఎం3 ఈవీఎంలు అవసరం. ఈ మోడల్‌కు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లు అమర్చవచ్చు. కానీ ఆ మోడల్ ఈవీఎంలు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇప్పటికే ఉన్న మెషీన్లను దేశవ్యాప్తంగా సర్థుబాటు చేశారు.

అంతే కాకుండా ఈసీఐఎల్ ఎం3లను సర్థుబాటు చేసినా.. నిజామాబాద్ కోసం 26,820 బ్యాలెట్ యూనిట్లు 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీ ప్యాట్లు అవసరం ఉంది. ఇవి కావాలని రాష్ట్ర కార్యాలయం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది.

దీంతో ఈ పరికరాలన్నీ సమకూర్చడానికి సీఈసీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈసీఐఎల్ పంపే కొత్త యూనిట్ల పరిశీలన, ప్రథమ స్థాయి తనిఖీలు, ర్యాండమైజేషన్ చేయాలంటే నిర్ణీత గడువులోగా కుదరదు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం నిజామాబాద్ షెడ్యూల్ మార్చే పనిలో పడింది. ఇవాళ అధికారికంగా నిజామాబాద్ షెడ్యూల్ గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

First Published:  31 March 2019 9:23 PM GMT
Next Story