Telugu Global
NEWS

చంద్రబాబును కేఏ పాల్‌ తో పోల్చిన కొమ్మినేని

(ప్రముఖ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస రావు చంద్రబాబు నాయుడిని కేఏ పాల్‌ తో పోల్చారు…. ఆయన మాటల్లోనే….) ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలోకి వచ్చి నలభై ఒక్క సంవత్సరాలు అయింది. ఆయన వయసు కూడా డెబ్బైకి చేరింది. ఈ వయసులో, ఇంత అనుభవంలో ఆయన ఎంత హుందాగా ఉంటే బాగుంటుంది. కానీ చివరికి ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ మాట్లాడినట్లుగానే ఏవేవో మాట్లాడుతూ అప్రతిష్ట పాలు కావడం బాదాకరంగా ఉంది. అది ఆయనకు, ముఖ్యమంత్రి […]

చంద్రబాబును కేఏ పాల్‌ తో పోల్చిన కొమ్మినేని
X

(ప్రముఖ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస రావు చంద్రబాబు నాయుడిని కేఏ పాల్‌ తో పోల్చారు…. ఆయన మాటల్లోనే….)

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలోకి వచ్చి నలభై ఒక్క సంవత్సరాలు అయింది. ఆయన వయసు కూడా డెబ్బైకి చేరింది. ఈ వయసులో, ఇంత అనుభవంలో ఆయన ఎంత హుందాగా ఉంటే బాగుంటుంది. కానీ చివరికి ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ మాట్లాడినట్లుగానే ఏవేవో మాట్లాడుతూ అప్రతిష్ట పాలు కావడం బాదాకరంగా ఉంది. అది ఆయనకు, ముఖ్యమంత్రి పదవికి పరువు కాదు. చంద్రబాబు ఈవిఎమ్ లపై చేస్తున్న విమర్శలు,ఆరోపణలు రోజురోజుకు హద్దులు దాటి పోతున్నాయి.

తాజాగా ఆయన రష్యా హాకర్లు ఈవి ఎమ్ లను హాక్ చేయవచ్చని అనడం ఇందుకు పరాకాష్ట అని చెప్పాలి. పాల్ అదే మాట చెప్పారు. చంద్రబాబు అలాగే మాట్లాడారు. వీళ్లిద్దరూ కూడబలుక్కుని మాట్లాడారా?లేక ఎవరికి వారు చెప్పారో తెలియదు కాని ప్రజల దృష్టిలో చంద్రబాబు స్థాయి పాల్ స్థాయికి పడిపోయిందన్న భావన కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఆయన స్వయంగా ఐదుసార్లు ఎన్నికలకు టిడిపి తరపున నాయకత్వం వహించారు.

1999, 2004, 2009, 2014 లలో ఎప్పుడూ ఆయనకు ఈవిఎమ్ లపై అనుమానం రాలేదు. 2019 లో మాత్రమే ఆయనకు ఈవిఎమ్ లపై అనుమానం వచ్చింది. పైగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తానే కనిపెట్టానన్నంతగా ప్రచారం చేసుకుంటారు. ఈ ఐదు ఎన్నికలలో ఆయన ఈసారి ఏమి అవుతుందన్నది ఇంకా తేలలేదు. కాని అంతకుముందు రెండుసార్లు గెలిచారు. రెండుసార్లు ఓటమి చెందారు. అప్పుడు రాని సందేహాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయన్నది అంతుపట్టడం లేదు.

2014లో నరేంద్ర మోడీతో కలిసి జోడి కట్టి మరీ ఎన్నికలలో పోటీచేశారు కదా..అప్పుడు ఈవిఎమ్ ల టాంపరింగ్ చేశారా అంటే అదేమీ లేదని ఆయనే చెబుతారు. మరి ఇప్పుడు ఎలా జరుగుతుందన్నదానికి సహేతుకతకాని లాజిక్ గాని లేకుండా మాట్లాడుతున్నారు. పైగా ఆయా రాష్ట్రాలకు వెళ్లి వేరే పని లేనట్లు ప్రచారం చేసి వస్తున్నారు.

ఏపిలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాలలో ఈవిఎమ్ లపై అనుమానం కలిగించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. దీనిని బట్టి ఏపిలో రాజకీయ దృశ్యం ఏ విధంగా ఉండబోతోందో ఆయన చెప్పకనే చెబుతున్నారన్నమాట.

మరో వైపు టిడిపి క్యాడర్ ఈ వ్యాఖ్యల వల్ల నీరు కారిపోతోందని గుర్తించి, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షల తంతు నడిపారు. దానిపై కూడా టిడిపిలోనే పలు ప్రశ్నలు కూడా వచ్చాయి. ఇంకా నెల రోజుల గడువు ఉండగా, ఇప్పుడు నేతలను పిలిచి ఏ విధంగా గెలుస్తున్నారు…బూత్ స్థాయిలో ఎలా జరిగిందన్నది ఆరా తీయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈవిఎమ్ లలో ఓట్లు నిక్షిప్తం అయి ఉండగా, ఇప్పుడు ఏ సమీక్షలు చేసుకున్నా ఒరిగేది ఏమీ ఉండదు. అయినా ఏదో తెలియని భయంతో ఆయన ఉన్నారని అర్థం అవుతుంది. అందుకే పార్టీ వాళ్లతో తాను ఈవిఎమ్ లపై పోరాడుతున్నాను కనుక ఓడిపోతున్నానని ప్రచారం జరుగుతోందని, దానిని నమ్మవద్దని, డీలా పడవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

నిజానికి చంద్రబాబు ఇలాంటి పిచ్చి పనులు ఏవీ చేయకుండా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేసి ప్రశాంతంగా కూర్చుని ఉంటే టిడిపివారిలో కూడా ఆత్మస్థైర్యం అంతగా దెబ్బతినేది కాదు. కానీ ఎన్నికల ముందు ఎలా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను, జగన్ ను, కెసిఆర్ ను, మోడీని ఎలా ఆడిపోసుకున్నారో, అలాగే ఎన్నికల తర్వాత కూడా చేస్తుండడంతో టిడిపి వారికి డౌట్ వచ్చేసంది. పరిస్థితి అనుకూలంగా లేదని చంద్రబాబుకు తెలిసి పోయిందని, అందుకే ప్రత్యామ్నాయంగా పార్టీని మానసికంగా సిద్దం చేయడానికి, ఓటమి ఎదురైతే దానికి ఈవిఎమ్ ల మోసం అని ప్రచారం చేయడానికి చంద్రబాబు సిద్దం అవుతున్నారని టిడిపి వారే భావిస్తున్నారట.

అంతేకాక బిజెపిని వదలి పెట్టి తప్పు చేశామని అంతర్గత చర్చలలో అనుకుంటున్నారట. పదే పదే మోడీని, కెసిఆర్ ను దూషించడం ద్వారా మరిన్ని తప్పులు చేసినట్లయిందని అనుకుంటున్నారని కధనాలు వస్తున్నాయి. అంతేకాదు..అనంతపురం ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి ఓపెన్ గానే ఏభై కోట్లు ఖర్చు చేశామని, పసుపు కుంకుమ, వృద్దాప్య పెన్షన్ ల పెంపే పార్టీని రక్షిస్తున్నాయని అన్నారు.

చంద్రబాబుకూడా ఇదే నమ్మకంతో ఉండడం కూడా టిడిపి వారికి ఆందోళనకు గురి చేస్తోంది. పసుపు కుంకుమ డబ్బు తో నిమిత్తం లేకుండానే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయని టిడిపి వారు కూడా చెప్పుకుంటున్నారు. కాని పార్టీ నాయకత్వం ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేదని అంగీకరిస్తున్నట్లుగానే పసుపు కుంకుమ గురించి ప్రచారం చేసుకోవలసిన దుర్గతి పట్టిందని వారు వాపోతున్నారు. ఇలా ఒక్కొక్కటి విశ్లేషించుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో ఆత్మ స్థైర్యం దెబ్బతిన్నది చంద్రబాబు చర్యల వల్లేనన్న అబిప్రాయం కలుగుతోంది.

పైగా ఇప్పుడు ఏకంగా రష్యా హాకర్లు అంటూ మాట్లాడితే ఎపికి, రష్యాకి ఏమి సంబంధం? దేశ స్థాయిలో మోడీని గెలిపించాలని వారు ఎందుకు అనుకుంటారు? డబ్బు తీసుకుని చేసేటట్లయితే చంద్రబాబు వద్ద ఉన్న డబ్బు ఎంత మంది వద్ద ఉంది?ఆయన ఈ పనిచేయడానికి ఏ మాత్రం వెనుకాడేవారు కాదు కదా..నంద్యాల ఉప ఎన్నికలో పోలీసులతో కూడా ఓట్లువేయించుకున్న అనుభవం ఆయనది.

అధికారం నిలబెట్టుకోవడానికి ఆ హాకింగ్ ఏదో ఆయనే చేసుకునేవారు కదా అన్నదానికి సమాదానం దొరకదు.ఏతావాతా చెప్పాలంటే చంద్రబాబు ఎన్నికల ఫలితాలపై అదైర్యంగా ఉన్నారని ఆయన చేష్టలు, మాటలే చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మభ్య పెట్టే యత్నంలో వారిని మరింత గందరగోళానికి చంద్రబాబు గురిచేసినట్లే కనబడుతోంది. ఎన్నికలలో గెలవవచ్చు. ఓడవచ్చు. కాని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజాశాంతి పార్టీ నేత కెఎ పాల్ స్థాయికి దిగజారడం మాత్రం శోచనీయమే అని చెప్పాలి.

First Published:  29 April 2019 1:21 AM GMT
Next Story