Telugu Global
NEWS

రెవెన్యూ ఉద్యమం రానున్నదా ?

లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరో మూడు వారాల్లో రానున్నాయి. అప్పటికి తెలంగాణలో పరిషత్ ఎన్నికలు కూడా పూర్తి అవుతాయి. ఆ తరువాతే రాష్ట్రంలో కోడ్ ముగిసిపోయి అసలు పాలన మొదలవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. ఏం చేస్తారో ఇప్పటి వరకు స్పష్టత రానప్పటికీ రెవెన్యూ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర , జిల్లా స్థాయిలో ఈ శాఖను సాధారణ పరిపాలన శాఖలో కలిపేసి, క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ […]

రెవెన్యూ ఉద్యమం రానున్నదా ?
X

లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరో మూడు వారాల్లో రానున్నాయి. అప్పటికి తెలంగాణలో పరిషత్ ఎన్నికలు కూడా పూర్తి అవుతాయి. ఆ తరువాతే రాష్ట్రంలో కోడ్ ముగిసిపోయి అసలు పాలన మొదలవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. ఏం చేస్తారో ఇప్పటి వరకు స్పష్టత రానప్పటికీ రెవెన్యూ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర , జిల్లా స్థాయిలో ఈ శాఖను సాధారణ పరిపాలన శాఖలో కలిపేసి, క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారని అంటున్నారు. జిల్లా పాలనా పగ్గాలను కలెక్టర్ కు అప్పగించి ఆయనకు సహాయంగా మరో నలుగురు అధికారులను నియమిస్తారని తెలుస్తోంది. కలెక్టర్ హోదా పేరును మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, రెవెన్యూ శాఖ రద్దును ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అవినీతి అంతటా ఉందని, దానిని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలిగానీ, మొత్తం శాఖనే రద్దు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలే కొన్నిజరిగాయి. రెవెన్యూ శాఖను పంచాయతీరాజ్ లో విలీనం చేయాలని తలపోశారు. కానీ, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు కేసీఆర్ మళ్లీ మార్పులకు పూనుకుంటున్నారు. ఇది రుచించని ఉద్యోగులు ఆందోళన దిశగా అడుగులు వేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు మాత్రమే సమ్మెకు దిగితే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ప్రభుత్వంలోని కీలక నేతలను, ఉన్నతాధికారులను, కింది స్థాయిలో ఉన్న పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తోంది. రెవెన్యూ ఉద్యోగుల సమ్మెకు జనాదరణ లభించకుండా ఉండేలా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది.

కానీ, రెవెన్యూ ఉద్యోగులకు ఇతర శాఖల ఉద్యోగులు తోడైతే ఇబ్బందులు తప్పవేమోనని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది సకల జనుల సమ్మెలాగా ఉధృతమైతే పాలనాపరంగా చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు. అన్ని శాఖల ఉద్యోగులు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు అండగా నిలుచుంటే తెలంగాణలో అది మరో ఉద్యమం అవుతుందని పేర్కొంటున్నారు. ఎంతటి విషమ సమస్యలైనా అవలీలగా పరిష్కరించుకునే గులాబీ దళపతి దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

First Published:  28 April 2019 8:42 PM GMT
Next Story