Telugu Global
NEWS

చంద్రబాబు కోరిక నెరవేరుతుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. కేంద్రంలో బీజీపీయేతర ప్రభుత్వం ఏర్పడాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తుంటే ఆ అవకాశాలు కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆరో దశ పోలింగ్ తేదీ సమీపించింది. ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పరిశీలకులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఊహించినంతగా బలం పుంజుకోలేదని, కాబట్టి కమలదళానికి మేలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయని […]

చంద్రబాబు కోరిక నెరవేరుతుందా?
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. కేంద్రంలో బీజీపీయేతర ప్రభుత్వం ఏర్పడాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తుంటే ఆ అవకాశాలు కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఆరో దశ పోలింగ్ తేదీ సమీపించింది. ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పరిశీలకులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఊహించినంతగా బలం పుంజుకోలేదని, కాబట్టి కమలదళానికి మేలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారానికి కొద్ది సీట్ల దూరంలోనే నిలిచిపోతుందనేది వారి అభిప్రాయంగా ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలో కాంగ్రెస్ తప్పనిసరిగా సత్తా చాటితేనే పార్టీకి ఢిల్లీ గద్దెను ఎక్కే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అస్సాంలోనూ హస్తానికి అధిక సీట్లు రావాల్సి ఉంటుందని అంటున్నారు.

అటు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఎలాగూ విజయబావుటా ఎగురవేస్తారు. కానీ, ఆమె రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే. ఈ పరిణామాలు చంద్రబాబును ఆందోళనలో పడవేశాయని అంటున్నారు.

అందుకే జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకే మాటి మాటికీ 21 పార్టీలు అంటూ బాబు హడావుడి చేస్తున్నారని అంటున్నారు. కానీ, ఏపీలో చంద్రబాబు అధికారం కోల్పోయి, ఎంపీ సీట్లు కూడా తగినన్ని రాకపోతే బాబుకు అసలు సినిమా అప్పుడు ఉంటుందని అంటున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ కలిసి 40 ఎంపీ సీట్లు సాధించగలిగితే ఢిల్లీలో ఈ రెండు పార్టీలే కీలకం అవుతాయని చెబుతున్నారు. ఒకవేళ అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్ గానీ అధికారానికి సమాన దూరంలో నిలబడితే కూడా కేసీఆర్, వైఎస్ జగన్ నిర్ణయాలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని, అప్పుడు బాబు కూడా ఏమీ చేయలేక రెండు చేతులూ ఎత్తాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు.

ఇవన్నీ జరుగకుండా ఉండేందుకే బాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని, జాతీయస్థాయి నాయకులతో కలిసి ప్రచారానికి వెళ్తున్నారనేది పరిశీలకుల అభిప్రాయం. ఒకవేళ నిజంగానే చంద్రబాబును మినహాయించి ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమై తృతీయ ఫ్రంట్ గా ఏర్పడితే అది బాబుకు అశనిపాతమే.

First Published:  9 May 2019 10:49 PM GMT
Next Story