Telugu Global
National

ఎన్నికల సంఘంలో విభేదాలు.. సమావేశాలకు డుమ్మా కొడుతున్న అశోక్ లవాసా..!

దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. ముగ్గురు సభ్యులున్న కమిటీలో సభ్యుడైన అశోక్ లవాసా ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఈసీ నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారని సమాచారం. ఈ సారి ఎన్నికల సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని […]

ఎన్నికల సంఘంలో విభేదాలు.. సమావేశాలకు డుమ్మా కొడుతున్న అశోక్ లవాసా..!
X

దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. ముగ్గురు సభ్యులున్న కమిటీలో సభ్యుడైన అశోక్ లవాసా ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఈసీ నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారని సమాచారం.

ఈ సారి ఎన్నికల సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విపక్ష పార్టీ నేతలు పలుమార్లు ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇప్పుడు ఏకంగా ఈసీ సభ్యుడే ఎదురుతిరగడం చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీల నేతలు కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అశోక్ గుర్రుగా ఉన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలపై కాంగ్రెస్ చేసిన పిర్యాదుల్లో ఏకపక్షంగా వారికి క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

గత నెలన్నరగా ఈసీ తీసుకున్న చర్యల్లో తప్పులు ఎత్తిచూపుతూ అశోక్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునిల్ అరోరాకు కూడా లేఖ రాశారు. అయితే దీనిపై సీఈసీ ఇంత వరకు స్పందించలేదు. ముగ్గురు సభ్యుల కమిటీలో ఉన్న సునీల్ అరోరా, సుశీల చంద్ర జరుతుపున్న సమావేశాలకు అశోక్ దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. కనీసం ఈ విషయంలో వ్యాఖ్యలు చేసిన వారిని వారించకుండా వదిలేయడంపై ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

రేపు చివరి దశ పోలింగ్ ముగుస్తుందనగా ఈసీలోని విభేదాలు బయటకు పొక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.

First Published:  18 May 2019 1:16 AM GMT
Next Story