Telugu Global
National

రాజీనామాల బాటలో పలువురు ప్రముఖులు

లోక్ సభ ఎన్నికల ఫలితాలు చాలా పార్టీలను కుదిపివేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంతటి నిరాశాజనకమైన ఫలితాలను ఏ మాత్రం ఊహించ లేదు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే స్వయంగా అమేథీలో ఓటమిని చవి చూశారు. కేరళలోని వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, పార్టీ దారుణ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. సహచరులు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నివారించడంతో ఆయన వెనక్కి తగ్గారనే వార్తలు వచ్చాయి. అయితే […]

రాజీనామాల బాటలో పలువురు ప్రముఖులు
X

లోక్ సభ ఎన్నికల ఫలితాలు చాలా పార్టీలను కుదిపివేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంతటి నిరాశాజనకమైన ఫలితాలను ఏ మాత్రం ఊహించ లేదు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే స్వయంగా అమేథీలో ఓటమిని చవి చూశారు. కేరళలోని వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, పార్టీ దారుణ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. సహచరులు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నివారించడంతో ఆయన వెనక్కి తగ్గారనే వార్తలు వచ్చాయి. అయితే గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండాల్సిన అవసరం లేదని…. బయటి వ్యక్తికి ఎవరికైనా పార్టీ పగ్గాలు అప్పగించి తాను తప్పుకుంటానని కృతనిశ్చయంతో రాహుల్‌ గాంధీ ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేశారంటున్న కొన్ని వ్యాఖ్యలు ఆలోచింపదగినవిగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబం నుంచే ఉండాలని లేదు. సమర్థులు ఎవ్వరైనా పార్టీ పగ్గాలు చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారని సమాచారం. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం మాత్రం రాహుల్ రాజీనామా ప్రతిపాదనను నిర్ద్వందంగా తోసిపుచ్చిందని చెబుతున్నారు. నిజానికి రాహుల్ గాంధీ మునుపటి కంటే కొంత పరిణితి సాధించినా, కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీకి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలనే వాదనలూ బయలుదేరాయి. యూపీలో ఆమె కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో పార్టీ కోలుకోవాలంటే సమూల ప్రక్షాళన తప్పదనేది సీనియర్ నాయకుల మాట. ఇక పలు రాష్ట్రాలకు చెందిన పిసీసీ అద్యక్షులు కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. మహారాష్ట్ర్ర పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ అయితే తాను రాజీనామా చేయడంతో పాటు ఓటమి పాలైన రాష్ట్ర్రాల నాయకులు అందరూ పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

ఇప్పటికే ఒడిసా, యూపీ పీసీసీ అధ్యక్షులు తమ రాజీనామాలు రాహుల్ గాంధీకి పంపించారు. ఇది ఇలా ఉంటే, అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నేతలు వారించడంతో వెనక్కి తగ్గారు. ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుని 18 ఎంపీ సీట్లు సాధించడంతో తృణమూల్ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. దీంతో మమత రాజీనామాకు సిద్ధమయ్యారు.

పార్టీ నేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు సీఎం పదవి అవసరం లేదని, సీఎం పదవికి తన అవసరం ఉందని భావించి రాజీనామా ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నానని ప్రకటించారు. లోపం ఎక్కడ ఉందో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని, రాజీనామాల ప్రహసనాలతో ఒరిగేదేమీ లేదని పార్టీల కార్యకర్తలు చెబుతున్నమాట.

First Published:  25 May 2019 11:30 PM GMT
Next Story