Telugu Global
National

అమిత్‌ షాకు పెద్దపీట.... రాజీనామాకు సిద్ధపడ్డ రాజ్‌నాథ్‌

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీలో అగ్రనేతల ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అత్యంత సన్నిహితుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పార్టీలో లుకలుకలకు కారణమవుతోంది. గురువారం రాత్రి ప్రకటించిన క్యాబినెట్ కమిటీలో అత్యధిక కమిటీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చోటు కల్సించారు. ఆయనకు ఏకంగా ఎనిమిది క్యాబినెట్ కమిటీల్లో చోటు దక్కింది. ఇది సహజంగానే పార్టీ సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు. ముఖ్యంగా కేంద్ర […]

అమిత్‌ షాకు పెద్దపీట.... రాజీనామాకు సిద్ధపడ్డ రాజ్‌నాథ్‌
X

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీలో అగ్రనేతల ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అత్యంత సన్నిహితుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పార్టీలో లుకలుకలకు కారణమవుతోంది.

గురువారం రాత్రి ప్రకటించిన క్యాబినెట్ కమిటీలో అత్యధిక కమిటీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చోటు కల్సించారు. ఆయనకు ఏకంగా ఎనిమిది క్యాబినెట్ కమిటీల్లో చోటు దక్కింది. ఇది సహజంగానే పార్టీ సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు. ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి కేవలం రెండంటే రెండే కమిటీల్లో చోటు కల్పించారు. దీంతో ఆయన అలిగి రాజీనామా చేసే వరకూ వెళ్లారు. అనేక తర్జన భర్జనల తర్వాత, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జోక్యంతో రాజ్ నాథ్ కు మరో నాలుగు క్యాబినెట్ కమిటీల్లో చోటు కల్సించారు. ఇదంతా గురువారం అర్ధ్రరాత్రి వరకూ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హైడ్రామా. తాత్కాలికంగా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడినా భవిష్యత్ లో మాత్రం పార్టీలో ఇబ్బందులు తప్పవని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వయోభారం పేరుతో కొందరు సీనియర్లకు టిక్కట్లు నిరాకరించిన నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం…. ముందు ముందు మరిన్నికీలక నిర్ణయాలు తీసుకుంటుందనే భయం సీనియర్లను వెంటాడుతోంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ వంటి జూనియర్ లకు ప్రముఖ స్థానం కల్పించడం సీనియర్లకు మింగుడుపడడం లేదంటున్నారు.

ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోను ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని కూడా అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలలో ఆర్ ఎస్ ఎస్ మితిమీరిన జోక్యం చేసుకుంటోందంటూ వారిని కూడా షా, మోదీ ద్వయం పక్కన పెట్టే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు.

రాజకీయ చాణక్యంతో కేంద్రంలోను, కొన్ని రాష్ట్రాలలోను అధికారాన్ని అందించిన అమిత్ షా, నరేంద్ర మోడీలను నిలువరించడం ఇక సాధ్యం కాకపోవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. వివిధ రాష్ట్రాలలో కమలం ఎంత వికసిస్తే బీజేపీ సీనియర్లకు అన్ని ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  7 Jun 2019 12:05 AM GMT
Next Story