Telugu Global
NEWS

భారత్-పాక్ వన్డే మ్యాచ్ పై విమర్శల వెల్లువ

మ్యాచ్ ను ఫార్సుగా మార్చారంటూ విమర్శలు భారత్-పాక్ మ్యాచ్ తో 100 కోట్ల వ్యాపారం… ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల లీగ్ మ్యాచ్ ను…ఓ తంతుగా ముగించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. భారత్, పాక్ సంతతి అభిమానులు ఎక్కువగా ఉండే మాంచెస్టర్ వేదికగా నిర్వహించిన ఈ మ్యాచ్ కు రెండుదేశాల అభిమానులు వెల్లువలా తరలి వచ్చారు. వర్షం కారణంగా…. పూర్తి 50 ఓవర్లపాటు సాగకుండా ముగిసిన ఈ మ్యాచ్ లో విజేతను డక్ వర్త్ […]

భారత్-పాక్ వన్డే మ్యాచ్ పై విమర్శల వెల్లువ
X
  • మ్యాచ్ ను ఫార్సుగా మార్చారంటూ విమర్శలు
  • భారత్-పాక్ మ్యాచ్ తో 100 కోట్ల వ్యాపారం…

ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల లీగ్ మ్యాచ్ ను…ఓ తంతుగా ముగించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
భారత్, పాక్ సంతతి అభిమానులు ఎక్కువగా ఉండే మాంచెస్టర్ వేదికగా నిర్వహించిన ఈ మ్యాచ్ కు రెండుదేశాల అభిమానులు
వెల్లువలా తరలి వచ్చారు.

వర్షం కారణంగా…. పూర్తి 50 ఓవర్లపాటు సాగకుండా ముగిసిన ఈ మ్యాచ్ లో విజేతను డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం
ప్రకటించారు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగుల భారీస్కోరు సాధించింది. సమాధానంగా 337 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాక్ జట్టు…35 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసిన సమయంలో… వానదెబ్బతో మ్యాచ్ నిలిచిపోయింది.

దీంతో వర్షం కారణంగా నష్టపోయిన సమయం, వికెట్లు, పరుగులను..డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా నిర్ణయించారు.
దీని ప్రకారం పాకిస్తాన్ మ్యాచ్ నెగ్గాలంటే 5 ఓవర్లలో 136 పరుగులు…అంటే ..ఓవర్ కు 28 పరుగులు చొప్పున చేయాల్సి వచ్చింది.

అంటే పాక్ జట్టు 40 ఓవర్లలోనే 302 పరుగుల స్కోరు చేయాలని అంపైర్లు ప్రకటించారు. పాక్ జట్టు మాత్రం చివరకు 40 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు మాత్రమే చేయగలిగింది.

క్రికెట్ విశ్లేషకుల విసుర్లు..

వర్షం పడిన సమయంలో…చేజింగ్ కు దిగిన జట్లకు అపారనష్టం వాటిల్లుతోందని…పాక్ జట్టు ఓవర్ కు 28 పరుగుల చొప్పున సాధించాలని చెప్పడాన్ని మించిన ఫార్సు మరొకటి లేదంటూ బీసీబీ కామెంటీటర్ జోనాథన్ , గ్రీమ్ స్వాన్ తప్పుపట్టారు.

వన్డే క్రికెట్ అంటే ఇంత ఫార్సుగా ఉంటుందన్న సందేహం భావితరాలకు కలిగేలా చేశారని విసుర్లు విసిరారు.

మరోవైపు..ఐసీసీ మాత్రం తాము నిబంధనల ప్రకారమే మ్యాచ్ ను నిర్వహించామని సమర్థించుకొంటోంది.

ఒక్క మ్యాచ్ తో 100 కోట్ల వ్యాపరం…

భారత్, పాక్ అభిమానుల మనోభావాలతో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లాభసాటి వ్యాపారమే చేసింది. ఓ సాధారణ క్రికెట్ మ్యాచ్ ను..
యుద్ధంలా చిత్రించి…ఓ తంతులా మార్చి 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోగలిగింది. మ్యాచ్ రోజున సెకనుకు లక్ష రూపాయల చొప్పున ప్రకటనలకు వసూలు చేసింది.

20 సెకన్ల యాడ్ కు 20 లక్షల రూపాయల చొప్పున వసూలు చేయటం ద్వారా 100కోట్ల రూపాయలు ఆర్జించింది.

మొత్తం మీద…భారత్-పాక్ సమరం…ఓ క్రికెట్ మ్యాచ్ లా సాగకుండా స్టార్ ఇండియా, ఐసీసీల జాయింట్ వ్యాపారంలో సాగటం.. పెద్దమనుషుల క్రీడ క్రికెట్ ను అపహాస్యం చేసేలా మిగిలింది.

First Published:  17 Jun 2019 4:35 AM GMT
Next Story