Telugu Global
National

కాళేశ్వరం... ఓ ఇంజనీరింగ్ అద్భుతం... ఇందులో 'మేఘా'ది మెగా పాత్ర

ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్‌లోని ప్రధానమైన లింక్ 1, 2 ఎత్తిపోతల కేంద్రాలను మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్ (మేఘా) యుద్ధ ప్రాతిపదికన రికార్డు సమయంలో పూర్తిచేసింది. లింక్-1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్-2 లోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్‌ కేంద్రాన్ని (ప్యాకేజీ 8) సిద్ధంచేసింది. ఈపనులను రెండేళ్ల రికార్డు సమయంలో పూర్తిచేయడం ద్వారా మేఘా శక్తి సామర్ధ్యాలను ప్రపంచానికి […]

కాళేశ్వరం... ఓ ఇంజనీరింగ్ అద్భుతం... ఇందులో మేఘాది మెగా పాత్ర
X

ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్‌లోని ప్రధానమైన లింక్ 1, 2 ఎత్తిపోతల కేంద్రాలను మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్ (మేఘా) యుద్ధ ప్రాతిపదికన రికార్డు సమయంలో పూర్తిచేసింది.

లింక్-1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్-2 లోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్‌ కేంద్రాన్ని (ప్యాకేజీ 8) సిద్ధంచేసింది. ఈపనులను రెండేళ్ల రికార్డు సమయంలో పూర్తిచేయడం ద్వారా మేఘా శక్తి సామర్ధ్యాలను ప్రపంచానికి చాటుకుంది.

ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీస్థాయిలో పంపుహౌస్‌ను కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేఘా ఏర్పాటు చేస్తున్నది. రోజూ గరిష్టంగా 3 టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మిస్తున్నఈ భారీ పథకంలో 20 పంపు హౌస్‌ల కింద మొత్తం 120 మెషీన్‌లను (ప్రతి మెషీన్‌లోను ఒక పంపు, ఒక మోటారు వుంటాయి) ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్‌లను మేఘా ఏర్పాటు చేస్తుండటాన్నిబట్టి ఎంతపెద్ద స్థాయిలో పనులు చేస్తున్నదీ అర్ధమవుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్‌ కేంద్రం

ఈపథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతుండగా అందులో 17 కేంద్రాలను మేఘా నిర్మిస్తున్నది. ఇప్పుడు మొదటిదశ కింద లింక్-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ లను పాక్షికంగా నీటిని పంపుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా లింక్-2 లోని ప్రపంచంలోనే అతిపెద్దదయిన భూగర్భ పంపింగ్‌ కేంద్రం (పాకేజీ 8) కూడా రోజుకు 2 టీఎంసీల నీటిని పంపుచేసే విధంగా సిద్ధంచేసింది.

ముఖ్యమంత్రుల చేతులమీదుగా….

ఈనెల 21 (శుక్రవారం) కాళేశ్వరం పథకాన్ని మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం వద్ద లాంఛనంగా ముఖ్యమంత్రులు ప్రారంభిస్తారు. ఇప్పటికే గోదావరి నీటిని మేడిగడ్డ పంపు హౌస్‌లోని ఫోర్బేలోకి తరలించారు. మోటారు ఆన్‌ చేయడం ద్వారా డెలివరీ సిస్టమ్‌ (భూగర్భంలోని పైపు) నుంచి నీరు ఎగువనవున్న అన్నారం బ్యారేజీలోకి ప్రవహిస్తుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజనీరింగ్ అద్భుతం

అత్యంత ప్రతిష్టాత్మక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో మేఘా డైరెక్టర్ బీ. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ” ప్రపంచంలో మరెక్కడా ఇంతపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌ గ్రౌండ్ పంప్‌ హౌజ్ ఈప్రాజెక్టు సొంతం. మేడిగడ్డ పంప్‌ హౌజ్‌లో 6 మెషిన్లను కేవలం పదినెలల రికార్డు సమయంలో నెలకొల్పడం మరో ప్రపంచ రికార్డు. ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుని పర్యవేక్షించే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.

ప్రపంచంలోనే తొలిసారి

ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా ఇంత భారీ స్థాయిలో ఎత్తిపోతల పథకాలు నిర్మించనే లేదు. ఇదే తొలి అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టిఎంసీల నీటిని పంపు చేయాలంటే 7152 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. మొదటి దశలో 2 టిఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4,992 మెగావాట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు.

ఈమొత్తం వ్యవస్థలో ప్రధానమైన పంపింగ్‌ కేంద్రాలను, వాటికి అవసరమైన విద్యుత్‌ సరఫరా వ్యవస్థను దాదాపుగా మేఘా నిర్మించింది. విద్యుత్‌ వ్యవస్థకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. పంపింగ్‌ కేంద్రాల్లో సివిల్‌ పనులు రికార్డు సమయంలో పూర్తికాగా, మెషీన్ల ఏర్పాటు (మోటారు, పంపు) పనులు చురుగ్గా జరుగుతుండగా ఈ సీజన్‌లో నీటిని పంపుచేసేందుకు అవసరమైన మెషీన్‌లను మేఘా సిద్ధంచేసింది.

లిమ్కా బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

ప్రపంచంలో భారీ ఎత్తిపోతల పథకాలుగా అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్‌ లోని గ్రేట్‌ మ్యాన్‌ మేడ్‌ రివర్‌ (జిఎంఎంఆర్) లాంటివాటిని చెప్పుకుంటారు. అయితే వీటి పంపుల సామర్ధ్యం కేవలం హార్స్‌ పవర్‌ లోనే ఉంది. వాటిని రెండుమూడు దశాబ్దాల సమయం తీసుకుని నిర్మించారు. ప్రపంచం మొత్తంమీద మన తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తిపోతల పథకాలు 2000 తరువాత మొదలయ్యాయి. అందులో హంద్రీనీవా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పట్టిసీమ, పురుషోత్త పట్నంలాంటి పథకాలు చెప్పుకోవచ్చు. అదే సమయంలో గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఎత్తిపోతల పథకాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ భారీ మెషీన్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనే ఉపయోగించారు. అయితే ఆపథకంలో మెషీన్ 40 మెగావాట్ల సామర్ధ్యం మాత్రమే కలిగివుంది.

దేశంలో ఎలక్ట్రోమెకానికల్‌ రంగంలో అగ్రగామిగా వున్న మేఘా రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి లిమ్కా బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్ లో హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని 2012 లోనే పూర్తిచేసి నిరాటంకంగా దాన్ని నిర్వహిస్తున్నది. ఈవిధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎత్తిపోతల పథకాలు మేఘా నిర్మించింది, నిర్మిస్తున్నది.

పంపుహౌస్‌ల నిర్మాణంలో రికార్డులే రికార్డులు

కాళేశ్వరం పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లలో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేస్తున్నారు. లింక్-1లోని ఈమూడు పంపుహౌస్‌ల కిందే 1720 మెగావాట్ల విద్యుత్‌ వియోగంలోకి వస్తోంది. అదేవిధంగా ప్యాకేజీ 8లోని భూగర్భపంపింగ్‌ కేంద్రంలో 7 యూనిట్లు ఏర్పాటు అవుతూండగా ఇప్పటికే రోజుకి 2 టీఎంసీలు పంపుచేసే విధంగా 5 యూనిట్‌లు సిద్ధంగా వున్నాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్‌ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి యూనిట్‌లు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటిని బిహెచ్ఇఎల్‌ విడిభాగాల రూపంలో సరఫరా చేసింది. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వియోగం వుంటుంది.

రెండేళ్ళలోనే పంపింగ్‌కు సిద్ధం

బిహెచ్ఇఎల్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలు మెషీన్లను విడిభాగాల రూపంలో సరఫరా చేశాయి. ప్యాకేజీ 11 లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తున్నది. ప్యాకేజీ 10 లోని నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటవుతున్నాయి. ప్యాకేజీ 6 లో ఇప్పటికే ఒక్కొక్కటి 124 మెగావాట్ల సామర్ధ్యంగల 7 యూనిట్లను ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. అత్యధికంగా మేడిగడ్డలో 17, సుందిళ్లలో 14, అన్నారంలో 12, ప్యాకేజీ-14లో 12, ప్యాకేజీ-21 లో 18 పంపులు ఏర్పాటు అవుతున్నాయి.

మొదటిదశలో 63 మెషీన్లు ఏర్పాటు లక్ష్యంగా మేఘా పనులు ప్రారంభించగా అనతి కాలంలో అంటే కేవలం 2ఏళ్ల సమయంలో 33 మెషీన్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ-8, ప్యాకేజీ-14లోని పంపుహౌస్‌లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా వున్నాయి.

సాగునీటి పథకాలు ముఖ్యంగా క్లిష్టమైన ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తికావడానికి దశాబ్దాల సమయం తీసుకుంటోంది.
అయినప్పటికీ కాళేశ్వరంలో పంపింగ్‌ కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన మేఘా చేపట్టి రెండేళ్ల కాలంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధం చేసింది. వీటి నిర్మాణంలో అనేక అరుదైన ఘనతలను మేఘా సొంతం చేసుకుంది.

ఇంజనీరింగ్‌ పనుల్లో ఇది ఒక రికార్డు

మేడిగడ్డ పథకానికి 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 177లక్షల ఘనపు మీటర్ల మట్టి పనిని పూర్తిచేసింది. అంటే రోజుకు సరాసరిన లక్షల ఘనపు మీటర్ల పని జరిగింది. ఇంజనీరింగ్‌ పనుల్లోఇది ఒక రికార్డు.

అదేవిధంగా 22 నెలల కాలంలో 8.62 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. సరాసరిన రోజుకు 1310 ఘనపు మీటర్ల నిర్మాణం చేయడం కూడా ఎత్తిపోతల పథకాల్లో రికార్డు. 18 నెలల కాలంలో 39700 టన్నుల పైపును భూగర్భంలో ఏర్పాటు చేయడం కూడా అరుదైనదే. 10 నెలల సమయంలో 6 మెషీన్లను మేడిగడ్డలో ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా జరగని విధంగా తక్కువ సమయంలో మేఘా ఏర్పాటు చేసింది.

అదేవిధంగా ఈఆర్ధిక సంవత్సరంలో అన్నారం ఎత్తిపోతల పథకంలో 8 నెలల కాలంలో 115 లక్షల ఘనపు మీటర్ల మట్టి పనిని, 23 నెలల్లో 6.13 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని, 20 నెలల కాలంలో 55,853 టన్నుల పైపును ఏర్పాటుచేసే పనిని మేఘా పూర్తిచేసింది. ఈ పంపింగ్‌ కేంద్రంలో కూడా 6 మెషీన్‌లు అదే సమయంలో పూర్తయ్యాయి.

సుందిళ్ల లోనూ….

ఇక సుందిళ్ల విషయానికి వస్తే 6 నెలల కాలంలో 108 లక్షల ఘనపు మీటర్ల మట్టి పనిని, 17 నెలల కాలంలో 6.34 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తిచేసింది. 21 నెలల కాలంలో 40447 టన్నుల పైపును భూగర్భంలోఅమర్చారు. 6 నెలల సమయంలో 6 మెషీన్‌లను పంపింగ్‌ కు సిద్ధం చేసారు.

భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్యాకేజీ-8 పంపింగ్‌ స్టేషన్

ఇది ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల పంపింగ్ స్టేషన్. భూగర్భంలో 330 మీటర్ల దిగువన నిర్మించారు. ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 7 యూనిట్లు కలిగిన ఈ పంపింగ్‌ స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించడం మరో అరుదైన విషయం. సాంకేతికంగా, శాస్త్రీయంగా ఇక్కడ భూమి దిగువన పంపింగ్‌ స్టేషన్‌ నిర్మించాల్సి వచ్చింది. దీని ద్వారా రోజుకు 3 టీఎంసీల నీరు ఎత్తిపోయడం జరుగుతుంది.

ఈ పనిని మేఘా ఛాలెంజింగ్‌గా తీసుకుని బిహెచ్ఇఎల్‌ సహకారంతో అనితర సాధ్యమయిన రీతిలో మొదటిదశ పూర్తిచేసింది. బిహెచ్ఇఎల్‌ సరఫరా చేసిన ఈమెషీన్లు సాంకేతికత రీత్యా అత్యాధునిక పరిజ్ఞానంతో తయారయినవి.

భూఅంతర్భాగంలో వీటిని ఏర్పాటు చేసినందున భవిష్యత్తులో ఎటువంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
మొత్తం పనిలో 40 శాతం బిహెచ్ఇఎల్‌ వాటా.. అంటే మోటార్లు, పంపులు, యంత్రపరికరాలు, విడిభాగాలు రూపంలో సరఫరా చేయడం కాగా, వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ప్యాకేజీ 8 వద్దకు తీసుకొచ్చాక వాటిని అక్కడ బిగించే కీలకమైన 60 శాతం పనిని మేఘా సాంకేతిక నైపుణ్యంతో పూర్తిచేసింది.

నిర్మాణ రంగంలోముఖ్యంగా ఎలక్ట్రోమెకానికల్‌ పనుల్లో 25 ఏళ్ల అనుభవం కలిగిన మేఘా ఈపనిని అత్యంత క్లిష్ట పరిస్థితులను సైతం ఎదుర్కొని విజయవంతంగా పూర్తిచేసింది. ఈపంపు హౌస్‌లో ప్రత్యేకత రెండుటన్నెల్స్ పక్కపక్కనే నిర్మితమవడం. వీటిని కుడిఎడమ టన్నెల్స్ గా పిలుస్తుంటారు. 10.5 మీటర్ల వ్యాసంతో వీటిని తొలిచి నిర్మించారు. ఒక్కొక్కటి 4,133 మీటర్ల పొడవున వున్నాయి. వీటి లైనింగ్‌ తదితర పనులు కూడా పూర్తయ్యాయి.

అతిపెద్ద సర్జ్‌ పూల్స్

పంపుహౌస్‌తో పాటుగా ఇందులోని సర్జ్‌ పూల్స్‌, అడిషనల్ సర్జ్‌ పూల్స్ కూడా ప్రపంచంలోనే అతిపెద్దవి. పైగా భూగర్భంలో ఇలా నిర్మించడం ఇదే తొలిసారి. పంపు హౌస్‌ పరిమాణం 330 మీటర్ల లోతు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తులో వుందంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. పంపు చేయడానికి అవసరమైన నీరు సర్జ్‌ పూల్స్ కు చేరుతుంది. ఇక్కడ భారీ పరిమాణంలో నీరు వుండాలి. అందుకు తగిన విధంగా 3 సర్జ్‌ పూల్స్ ను నిర్మించారు. 200x20x67.8 మీటర్ల పరిమాణంతో ప్రధాన సర్జ్‌ పూల్‌ నిర్మాణం పూర్తయింది. అదనపు సర్జ్‌ పూల్ నిర్మాణం 60x20x69.5 మీటర్ల సామర్ధ్యంతోను పూర్తి చేశారు. 2వదశ పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం 189.5 మీటర్ల దిగువన 115x25x64.75 మీటర్ల పరిమాణంతో పని పూర్తయింది. అదేవిధంగా ట్రాన్స్‌ పార్మర్స్‌ను కూడా ప్రత్యేకంగా కింది భాగంలో నిర్మించారు.

పంపుహౌస్‌ దిగువభాగం…

అంటే నేలభాగం గ్రౌండ్‌ లెవెల్‌ నుంచి 330 మీటర్ల దిగువకు ఉండటం ఒక ప్రత్యేకత. వర్టికల్‌ పంపును 138 మీటర్ల దిగువన ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. ప్రతి మోటారు పంపు బరువు 2,376 మెట్రిక్‌ టన్నులు ఉందంటే ప్రతీ యూనిట్ ఎంత పెద్దదో చెప్పాల్సిన పనిలేదు.

అరుదైన విద్యుత్‌ వ్యవస్థ

రోజుకు 3 టిఎంసీల నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7,152 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. దేశంలో కొన్నిరాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల మొత్తం విద్యుత్‌ డిమాండే అంత వుంటుందంటే ఈపథకం ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మొదటి దశలో రెండు టిఎంసీల నీటిని సరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థను, అందులో సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు, ట్రాన్స్‌ మిషన్లను 3057 మెగావాట్ల సామర్ధ్యంమేర మేఘా నిర్మించింది.

తాగు, సాగునీటి అవసరాలకోసం ఇంతపెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనతికాలంలోనే అంటే రెండేళ్లవ్యవధిలో ఇంతపెద్ద విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మేఘా మరో రికార్డు అధిగమించింది. ఈప్రాజెక్టు ద్వారా మొత్తం 37.08 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు రావచ్చు. దీంతో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తవుతుంది.

First Published:  19 Jun 2019 2:29 AM GMT
Next Story