Telugu Global
CRIME

ప్రేమికులు కనిపిస్తే.... ఆ నకిలీ పోలీసుకు పండగే !

తన జీవితంలో జరిగిన ఒక ఘటన అతడికి ప్రేమికులపై ద్వేషాన్ని పెంచింది. తన కక్షను ప్రేమికులపై తీర్చుకుంటూ లక్షల రూపాయల సొత్తును కాజేశాడు. చివరకు పోలీసులు వలపన్ని పట్టుకోవడంతో కటకటాల పాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం…. యాదాద్రి జిల్లా మల్లపురానికి చెందిన చింతల చందు అలియాస్ చంద్రశేఖర్ వృత్తి రీత్యా డ్రైవర్. గతంలో అతను ఒక ట్రావెల్స్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో అతని సోదరినిని ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడు. అప్పటి నుంచి […]

ప్రేమికులు కనిపిస్తే.... ఆ నకిలీ పోలీసుకు పండగే !
X

తన జీవితంలో జరిగిన ఒక ఘటన అతడికి ప్రేమికులపై ద్వేషాన్ని పెంచింది. తన కక్షను ప్రేమికులపై తీర్చుకుంటూ లక్షల రూపాయల సొత్తును కాజేశాడు. చివరకు పోలీసులు వలపన్ని పట్టుకోవడంతో కటకటాల పాలయ్యాడు.

పోలీసుల వివరాల ప్రకారం….

యాదాద్రి జిల్లా మల్లపురానికి చెందిన చింతల చందు అలియాస్ చంద్రశేఖర్ వృత్తి రీత్యా డ్రైవర్. గతంలో అతను ఒక ట్రావెల్స్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో అతని సోదరినిని ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడు. అప్పటి నుంచి ప్రేమ జంట కనపడితే అతనికి కోపం నషాళానికి అంటేది. ఈ క్రమంలో అతను అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద నిర్జన ప్రదేశంలో ఉన్న ప్రేమ జంటను 2015లో దోచుకున్నాడు. వారిని బెదిరించి 2వేల నగదు దోచుకున్నాడు.

అయితే బాధితులు పోలీసులకు పిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై తిరిగి వచ్చిన తర్వాత సొంతూరికి వెళ్లి చేపల వ్యాపారం ప్రారంభించాడు. కానీ అతనికి వ్యాపారంలో నష్టం వచ్చింది. నష్టాలను పూడ్చుకోవడానికి పాత పద్దతినే మళ్లీ అనుసరించాడు.

ఈ సారి సాధారణ వ్యక్తిలా కాకుండా పోలీసులా వెళ్లి ప్రేమికులను టార్గెట్ చేసేవాడు. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు నిర్జన ప్రదేశాల్లో తిరిగే ప్రేమికులను టార్గెట్ చేసి యువతుల బంగారు గొలుసులు, చెవి దిద్దులు దోచుకునేవాడు. ఇలా రాచకొండ కమిషనరేట్ ప్రాంతంలో 27, సైబరాబాద్ పరిధిలో 3 దోపిడీలు చేశాడు. అయితే చాలా మంది పరువు పోతుందని పిర్యాదు చేయలేదు.

కాగా, దోపిడీకి గురైన నలుగురు ప్రేమికులు ఇప్పుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి విచారణ చేసి అబ్దుల్లాపూర్ ఓఆర్ఆర్ వద్ద చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను బుధవారం రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు చెప్పారు.

First Published:  26 Jun 2019 10:40 PM GMT
Next Story