Telugu Global
Others

రైతుల దుర్గతి మార్చని సంస్కరణలు

భారత వ్యవసాయ రంగంలో పరిణామాత్మక మార్పులు తీసుకు రావడానికి కొన్ని సంస్కరణలు చేపట్టాలని 2019 జూన్ 15న జరిగిన నీతీ ఆయోగ్ అయిదవ పాలక మండలి సమావేశంలో కోరారు. నిర్యావసర వస్తువుల చట్టం (ఇ.సి.ఎ.), 1955నాటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం (ఎ.పి.ఎం.సి.)లో సంస్కరణలు తీసుకు రావాలని నీతీ ఆయోగ్ కోరింది. దేశమంతటా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకు పోయి ఉన్నందువల్ల, దీనివల్ల దిగజారుతున్న వ్యవసాయ ఆదాయాలకు కొంత ఊరట కలగవచ్చు. మిగులు ఉత్పత్తుల సమస్యను […]

రైతుల దుర్గతి మార్చని సంస్కరణలు
X

భారత వ్యవసాయ రంగంలో పరిణామాత్మక మార్పులు తీసుకు రావడానికి కొన్ని సంస్కరణలు చేపట్టాలని 2019 జూన్ 15న జరిగిన నీతీ ఆయోగ్ అయిదవ పాలక మండలి సమావేశంలో కోరారు.

నిర్యావసర వస్తువుల చట్టం (ఇ.సి.ఎ.), 1955నాటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం (ఎ.పి.ఎం.సి.)లో సంస్కరణలు తీసుకు రావాలని నీతీ ఆయోగ్ కోరింది. దేశమంతటా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకు పోయి ఉన్నందువల్ల, దీనివల్ల దిగజారుతున్న వ్యవసాయ ఆదాయాలకు కొంత ఊరట కలగవచ్చు.

మిగులు ఉత్పత్తుల సమస్యను ఎలా పరిష్కరించాలో దిక్కు తోచని తరుణంలో నిత్యావసర వస్తువుల చట్టాన్ని సంస్కరించాలనుకోవడం గురించి చర్చించవలసిందే. మార్కెట్లు సమీకృతం కావడానికి ఈ చట్టం అవరోధంగా ఉంది. దీన్ని సడలిస్తే గిరాకీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మార్కెట్లో ధర పెరిగితే మరో మార్కెట్లో దాని ప్రభావం కనిపిస్తుంది.

అంటే రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర దక్కే అవకాశం ఉంటుంది. సరుకు ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పుడు ధర తగ్గుతుంది కనక వినియోగదార్లకు ఉపకరిస్తుంది.

అయితే ఈ సంస్కరణలు ఏ రీతిలో ఉంటాయో నీతీ ఆయోగ్ నుంచి, ప్రభుత్వం నుంచి సరైన సంకేతాలు లేనందువల్ల వినియోగదార్ల మనసుల్లో అనుమానాలు ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే అడ్డ దిడ్డంగా పెరిగే ధరలవల్ల వినియోగదార్లకు రక్షణ ఉండదా? నిత్యావసర వస్తువుల చట్టం ఉన్నప్పటికీ ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ప్రభుత్వాలు ధరలను అదుపు చేయలేక పోయాయి.

ప్రభుత్వం తమ దగ్గర ఉండే సరుకుపై పరిమితి గురించి ప్రకటించినప్పుడల్లా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఉదాహరణకు 2003 లో ప్రభుత్వం నిర్ణయించిన కోటాలు, చక్కెర విడుదల వల్ల చక్కెర ధర టన్నుకు రూ. 250 చొప్పున పెరిగింది. అలాగే 2014 జనవరి నుంచి జులై మధ్య ప్రభుత్వం నిలవల మీద పరిమితి ప్రకటించినప్పుడు మినప పప్పు ధర కిలోకు రూ. 14, పెసర పప్పు ధర రూ. 8, సిరి శెనగ పప్పు ధర రూ. 9 చొప్పున పెరిగాయి. బియ్యం ధర కిలోకు రూపాయి నుంచి రెండు దాకా పెరిగింది.

ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొంత సరుకుని తమ దగ్గర నిలవ ఉంచుకుంటే ధరలు నియంత్రించడానికి అనువుగా ఉంటుంది. నిత్యావసర వస్తువుల చట్టాన్ని సడలించడంవల్ల అంతగా ప్రయోజనం ఉండదన్న అనుమానాలు కలుగుతున్నాయి.

నిత్యావసర వస్తువుల చట్టాన్ని సడలించడంవల్ల సాంక్రమిక ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం ధర నిర్ణయించే వస్తువుల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక పంటకు ప్రభుత్వం కొంత ధర ప్రకటిస్తె పండిన పంటనంతా ప్రభుత్వం కొనాలి. చెరుకు పండించే రైతులకు రాజకీయ పలుకుబడి ఉన్నందువల్ల ఆ వర్గం సడలింపును సమ్మతించదు.

ఎందుకంటే చట్టాన్ని సడలించడంవల్ల వారు చెరుకు రవాణాను తమ ఇష్టానుసారం కొనసాగించ లేరు. తమకు తోచినట్టుగా ధర పెంచలేరు. చక్కెర ఫ్యాక్టరీలు చెరుకు తీసుకునే పరిమితి తొలగించడం వల్ల చెక్కర కర్మాగారాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు చెల్లించవు. కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన చట్టబద్ధమైన కనీస ధర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ధర చెల్లించవు. మిగులు నిలవలకు అయ్యే ఖర్చును ఎటు తిరిగి వినియోగదార్లే భరించవలసి వస్తుంది.

చెరుకు రైతులకు రాజకీయ పలుకుబడి ఉన్నందువల్ల ప్రభుత్వం చేయగలిగింది ఏమీ ఉండడం లేదు. ఇలాంటి అనుభవాన్నిబట్టి చూస్తే వ్యవసాయ రంగంలో “సహకారాత్మక ఫెడరలిజం కేవలం మాటలకే పరిమితం అవుతుంది తప్పు చేతలలో కాదు.” వసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం అమలులో ఏం జరిగిందో అనుభవంలో ఉన్నదే. అన్ని రాష్ట్రాలు ఈ సవరణలను ఒకే రీతిలో అమలు చేయవు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం సూచించే సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు అంగీకరిస్తాయన్నది రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది.

ఈ సందర్భంలో చట్టంలో సడలింపులకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వివరణే ఎక్కువగా కలత కలిగించే అంశం. పెట్టుబడులను, ప్రధానంగా కార్పొరేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ పని చేయాలని సంకల్పించారు. ఇలాంటి వివరణలు చాలా వరకు “మార్కెట్ కాల్పనికత”పై ఆధారపడ్డవే.

ప్రైవేటు రంగం వ్యవసాయ రంగ పరిణాత్మక మార్పులకు దోహం చేస్తుందని, మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని అనుకోవడమే… కేవలం సిద్ధాంత స్థాయికి పరిమితమైందే. ఇలాంటి చర్యలు సంకల్పించడానికి 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ “కనీస స్థాయిలో ప్రభుత్వం, అత్యధిక స్థాయిలో పాలన” అని ఇచ్చిన హామీ కొంతవరకు కారణం.

అయితే పాలన ఎలా ఉంటుందో స్పష్టమైన మార్గం గోచరించనప్పుడు అనుకున్న మార్కెట్ ఏకీకరణ ఎంత మేరకు సాధ్యమో తెలియదు. రైతులకు, ముఖ్యంగా చిన్న కమతాలు ఉన్న వారికి ఇది ఎలా ఉపయోగపడుతుందో అంతుపట్టదు. సరుకు నిలవ చేయడం, ముప్పు ఎదుర్కునే సామర్థ్యం, సమాచారంపై నియంత్రణ మార్కెట్ శక్తి ఎలా ఉంటుందో నిర్ణయించడానికి కొలమానాలుగా ఉంటాయి. రెండో సారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం సంకల్పించిన అంశాలు “అనుకూల వాతావరణం” కల్పిస్తే తప్ప సాధ్యమయ్యే వ్యవహారం కాదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  27 Jun 2019 1:32 AM GMT
Next Story