Telugu Global
National

సంక్షోభం లో కర్ణాటక సర్కార్ ?

దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు అంటూ కాలం గడుపుతున్న కర్ణాటకలోని కుమారస్వామి సర్కార్ మళ్లీ కష్టాల్లో పడింది. కాంగ్రెస్ సాయంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుమారస్వామి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మొదటి నుంచీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన అలా అమెరికా వెళ్ళగానే తన సర్కారుకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్, ఆనంద్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేస్తూ […]

సంక్షోభం లో కర్ణాటక సర్కార్ ?
X

దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు అంటూ కాలం గడుపుతున్న కర్ణాటకలోని కుమారస్వామి సర్కార్ మళ్లీ కష్టాల్లో పడింది. కాంగ్రెస్ సాయంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుమారస్వామి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మొదటి నుంచీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

ఇప్పుడు ఆయన అలా అమెరికా వెళ్ళగానే తన సర్కారుకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్, ఆనంద్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేస్తూ ఆ పత్రాలను స్పీకర్ కు పంపించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కుమారస్వామి సర్కారు ఇరకాటంలో పడింది. ఇప్పటికే బొటాబొటి గా ఉన్న సభ్యుల సంఖ్య ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో కాసింత తగ్గింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఒకటి, రెండు రోజులలో వీరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు కర్ణాటకలోని సంకీర్ణ సర్కారులో జరుగుతున్న పరిణామాలను భారతీయ జనతా పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, మరో 9 మంది రాజీనామాకు సిద్ధపడటం తమకు అనుకూలించే అంశమని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ నాయకుడు యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాతో పాటు రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా మంగళవారం నాడు తన దూతను బెంగళూరుకు పంపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లో వచ్చిన చీలికలను తమకు అనుకూలంగా మార్చుకుని సర్కారు ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేయడం, మరో 9 మంది అందుకు సిద్ధంగా ఉండడం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ఇంట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల డిమాండ్లపై చర్చించడంతో పాటు అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామితో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మొత్తానికి కర్ణాటక రాజకీయం రోజురోజుకూ రసవత్తరమైన మలుపులు తిరుగుతూ రాజకీయ ఆసక్తిని కలుగజేస్తోంది.

First Published:  1 July 2019 9:34 PM GMT
Next Story