బావిలోకి దిగి వరుసగా ముగ్గురు మృతి
కుమురం భీం జిల్లాలో ఘోరం జరిగింది. బావిలోకి దిగిన ముగ్గురు వ్యక్తులు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ముత్యంపేటకు చెందిన కారెం మహేష్ ఇంట్లో ఒక చిన్న బావి ఉంది. మూడు అడుగుల వెడల్పుతో 30 అడుగుల లోతు మేర ఈ బావి ఉంది. మోటార్ మరమ్మత్తు కోసం తొలుత మహేష్ బావిలోకి దిగాడు. కానీ ఎంతకూ రాకపోవడంతో విద్యుత్ షాక్ ఏమైనా తగిలి ఉంటుందని అనుమానించిన అతడి బావ చొక్కాల శ్రీనివాస్ విద్యుత్ను ఆపేసి బావిలోకి […]
కుమురం భీం జిల్లాలో ఘోరం జరిగింది. బావిలోకి దిగిన ముగ్గురు వ్యక్తులు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ముత్యంపేటకు చెందిన కారెం మహేష్ ఇంట్లో ఒక చిన్న బావి ఉంది. మూడు అడుగుల వెడల్పుతో 30 అడుగుల లోతు మేర ఈ బావి ఉంది.
మోటార్ మరమ్మత్తు కోసం తొలుత మహేష్ బావిలోకి దిగాడు. కానీ ఎంతకూ రాకపోవడంతో విద్యుత్ షాక్ ఏమైనా తగిలి ఉంటుందని అనుమానించిన అతడి బావ చొక్కాల శ్రీనివాస్ విద్యుత్ను ఆపేసి బావిలోకి దిగాడు. కానీ అతడు కూడా తిరిగి రాలేదు. దాంతో శ్రీనివాస్ బావమరిది 19ఏళ్ల రాజేష్ కూడా దిగాడు. అతడు కూడా తిరిగి రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులంతా కలిసి తాడు సాయంతో ఒక యువకుడిని లోనికి దింపే ప్రయత్నం చేశాడు. అతడు బావిలోకి దిగుతున్న సమయంలో ఊపిరాడక ఇబ్బంది పడడంతో బయటకు తీశారు. ఆ తర్వాత కోడికి తాడు కట్టి బావిలో వేశారు. అది కాసేపటికే చచ్చిపోయింది.
బావిలో విషవాయువులు ఉన్నట్టు అనుమానించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు, అధికారులు వచ్చి జేసీబీ సాయంతో బావికి సమాంతరంగా తవ్వి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. బావి వెడల్పు కేవలం మూడు అడుగులు మాత్రమే ఉండడం, లోతు 30 అడుగులు ఉండడంతో సరైన గాలి, వెలుతురు కూడా లేక ఊపిరాడక వీరు చనిపోయారని అధికారులు చెబుతున్నారు.