Telugu Global
National

20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిన ట్రూజెట్

దేశవ్యాప్తంగా విమానయాన సేవలు అందిస్తున్న ట్రూజెట్‌ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను రెట్టింపు అంటే 10కి పెంచుకుని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయిన ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ట్రూజెట్‌ క్రమంగా దేశవ్యాప్తంగా… ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు అనతికాలంలోనే విస్తరించింది. 2015 జులై 12 న రెండు ఎటిఆర్‌-72 విమానాలతో ప్రారంభమైన సంస్థ అనతికాలంలోనే వాటిని 5కు పెంచుకోగలిగింది. దేశవ్యాప్తంగా 20 […]

20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిన ట్రూజెట్
X

దేశవ్యాప్తంగా విమానయాన సేవలు అందిస్తున్న ట్రూజెట్‌ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను రెట్టింపు అంటే 10కి పెంచుకుని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయిన ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ట్రూజెట్‌ క్రమంగా దేశవ్యాప్తంగా… ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు అనతికాలంలోనే విస్తరించింది. 2015 జులై 12 న రెండు ఎటిఆర్‌-72 విమానాలతో ప్రారంభమైన సంస్థ అనతికాలంలోనే వాటిని 5కు పెంచుకోగలిగింది. దేశవ్యాప్తంగా 20 కేంద్రాలకు విమాన సర్వీసులను ప్రస్తుతం నడుపుతోంది.

ఓవైపు ప్రాంతీయ విమాన సర్వీసులు ఆర్థిక సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మూతపడుతుంటే మేఘా ఏర్పాటు చేసిన ట్రూజెట్‌ మాత్రం తన సేవలను, వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ పటిష్టపడటమే కాకుండా లాభాల బాటలోకి అడుగుపెడుతోంది.

ప్రధానంగా ‘ఉడాన్‌’ పథకం కింద సేవలను అందజేస్తూ 2019 డిసెంబరు నాటికి 5 విమానాల నుంచి 10 విమానాలను నడిపే విధంగా ఏర్పాట్లు, ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మేఘా డైరెక్టర్‌ కె.వి. ప్రదీప్‌ తెలిపారు.

ట్రూజెట్‌ ‘ఉడాన్‌’ రూట్లలో 73 శాతం సామర్ధ్యంతో సమర్ధంగా సేవలను అందిస్తోంది. ఈ పథకం కింద సేవలను అందించే అతిపెద్ద విమానయాన సంస్థగా ట్రూజెట్‌ పేరు సంపాదించుకుంది. గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు కూడా దేశంలో విమాన సేవలు అందుబాటులోకి తేవాలనే ప్రధానమంత్రి ఉద్దేశంలో భాగంగా ప్రారంభించిన ‘ఉడాన్‌’ పథకం కింద తొలుత దక్షిణ భారతదేశంలో సేవలు ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా సేవలను విస్తరిస్తోంది ట్రూజెట్‌.

దేశంలో 20 నగరాలకు సేవల విస్తరణ

గడచిన ఏడాది కాలంలో అహ్మదాబాద్‌ను ట్రూజెట్‌ రెండవ కేంద్రంగా చేసుకుని తన సిబ్బందిని 700కు పైగా పెంచుకుంది. త్వరలో మరో బేస్‌ కేంద్రాన్ని ట్రూజెట్‌ ఏర్పాటు చేయనుంది. అంతేకాక ప్రస్తుతం వున్న 5 విమానాలతో దేశంలోని 20 గమ్యస్థానాలకు సేవలను నిర్వహిస్తోంది. తక్కువ ధరకు టికెట్లు అందించడం, ముందుగానే సీట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం, బోర్డింగ్‌ పాస్‌ లో వ్యాపార ప్రకటనలు ముద్రించడం వంటి చర్యలను చేపట్టింది. దేశీయ విమానయాన సేవలు అందిస్తున్న ట్రూజెట్‌ అంతర్జాతీయ విమానయానం చేసే ప్రయాణికులకు సైతం ఉపయోగపడేలా వారికి కనెక్టివిటీ కల్పించేందుకు గానూ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుందని ట్రూజెట్ సిఎఫ్ఓ విశ్వనాధ్ చెప్పారు

సామాజిక సేవలో కూడా..

కేరళలో వరదలు సంభవించినప్పుడు బాధితులకు తన వంతు సేవగా పలు ప్రాంతాల నుండి కేరళకు ఆహారం, మందులు, మంచినీరు, దుస్తులు తమ విమానాల్లో ఉచితంగా రవాణా చేసిన ఏకైక విమానయాన సంస్థగా నిలిచింది. ‘వింగ్స్‌ ఆఫ్‌ హోప్‌’ కార్యక్రమంలో గ్రామీణ బాలలకు ఉచితంగా విమాన ప్రయాణాన్ని అందించింది. ట్రూజెట్‌ నాల్గవ వార్షికోత్సవ సందర్భంగా తలసీమియా బాధితులకోసం ట్రూజెట్‌ సంస్థ సిబ్బంది 100 మంది జులై 5న రక్తదానం నిర్వహించారు.

అదే సమయంలో విమాన ప్రయాణం అంటే తెలియని పేద వృద్ధ మహిళలను 45 మందిని నాందేడ్‌కు ఉచితంగా తమ విమానంలో తీసుకువెళ్ళారు. అదే విధంగా అనాధ పిల్లలను బళ్లారి, కడప తదితర ప్రాంతాలకు విమానంలో ఉచితంగా తీసుకువెళ్లడంతో పాటు అనేక అవగాహన కార్యక్రమాలను ట్రూజెట్‌ నిర్వహించింది.

లాభాలతో, విజయవంతంగా : కెవి. ప్రదీప్‌

మేఘా డైరెక్టర్‌ కె.వి. ప్రదీప్‌ మాట్లాడుతూ… గడచిన నాలుగేళ్లుగా ట్రూజెట్‌ ప్రాంతీయ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రాంతీయ సేవల విభాగంలో తమతోపాటుగా ప్రారంభమైన విమానసేవల కంపెనీల్లో ట్రూజెట్‌ ఒక్కటే విజయపథంలో సాగుతోందన్నారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఉడాన్‌’ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు విమాన సేవలు అందించడం తమకు మంచి అవకాశమని పేర్కొన్నారు. దశలవారీగా దీన్ని మరింత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామన్నారు.

సంస్థ సిఇఒ, రిటైర్డ్‌ కల్నల్ ఎల్‌.ఎస్‌.ఎన్‌. మూర్తి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాలను విమాన సేవ పరిధిలోకి తీసుకువచ్చే అంశంలోట్రూజెట్‌ విశేషమైన కృషి చేసిందన్నారు. ఇది మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాతృ సంస్థ మేఘా నుండి తమకు పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు. అంతేగాక విమానాల నిర్వహణ, విమానాశ్రయాల సేవలు, పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌, బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో పాటు 700 మంది సిబ్బందితో ట్రూజెట్‌ దేశీయ విమానయాన రంగంలో మరింత విస్తృతం కానుందని చెప్పారు.

ఈ నాలుగేళ్ల ప్రస్థానంలో…

నాలుగేళ్ల క్రితం అంటే 2015 జులై నెలలో టర్బోమేఘా ఏవియేషన్‌ లిమిటెడ్‌ తన విమాన సేవల బ్రాండ్‌ ట్రూజెట్‌ పేరుతో తన సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ కేంద్రాలుగా దేశంలో 20కి పైగా పట్టణాలకు వారానికి 300 విమాన సర్వీసులను అందిస్తున్నది. ముంబయ్‌, చెన్నయ్‌, బెంగళూరు, గోవా, ఔరంగాబాద్‌, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, సేలం, విద్యానగర్‌, మైసూర్‌, నాందేడ్‌, పోర్‌బందర్‌, నాసిక్‌, కాండ్లా, జైసల్మీర్‌, ఇండోర్‌ నగరాలకు తన విమానాలను నడుపుతున్నది.

గత నాలుగేళ్లలో దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి పలు అవార్డులను, ప్రశంసలను అందుకుంది. కార్యక్రమంలో ట్రూజెట్ సీసీవో సుధీర్ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  12 July 2019 5:20 AM GMT
Next Story