Telugu Global
NEWS

కమ్యూనిస్టులు ఎక్కడ?

ఉద్యమాలలో ఎప్పుడూ ముందుండే ఉభయ కమ్యూనిస్టు పార్టీల గొంతు కొంతకాలం నుంచి వినపడడం లేదు. ప్రజలకు నష్టం జరిగే ప్రభుత్వ ఒప్పందాలపై పోరాడడానికి ముందుండే సీపీఐ, సీపీఎం పార్టీలు కొంత కాలం నుంచి ఉనికిలో లేకుండా పోయాయి. విద్యుత్‌ చార్జీలు పెరిగినందుకు పెద్ద ఎత్తున ఉద్యమించి బషీర్‌బాగ్‌ కాల్పుల వరకూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సీపీఎం పార్టీ నాయకులు కూడా ఇప్పుడు విద్యుత్‌ అంశాలపై మాట్లాడడం లేదు. జగన్‌ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న […]

కమ్యూనిస్టులు ఎక్కడ?
X

ఉద్యమాలలో ఎప్పుడూ ముందుండే ఉభయ కమ్యూనిస్టు పార్టీల గొంతు కొంతకాలం నుంచి వినపడడం లేదు. ప్రజలకు నష్టం జరిగే ప్రభుత్వ ఒప్పందాలపై పోరాడడానికి ముందుండే సీపీఐ, సీపీఎం పార్టీలు కొంత కాలం నుంచి ఉనికిలో లేకుండా పోయాయి.

విద్యుత్‌ చార్జీలు పెరిగినందుకు పెద్ద ఎత్తున ఉద్యమించి బషీర్‌బాగ్‌ కాల్పుల వరకూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సీపీఎం పార్టీ నాయకులు కూడా ఇప్పుడు విద్యుత్‌ అంశాలపై మాట్లాడడం లేదు.

జగన్‌ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ కొనుగోళ్ళ ఒప్పందం పై పునఃసమీక్ష జరపాలని నిర్ణయించింది. మార్కెట్‌లో దొరికే ధర కన్నా ఎక్కువ ధర చెల్లించి చంద్రబాబు ప్రభుత్వం కొద్దిమంది ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర నీకింతా… నాకింతా అనే ధోరణిలో విద్యుత్‌ కొనుగోళ్ళు జరుపుతోందని…. దేశ వ్యాప్తంగా సౌర విద్యుత్‌ రూ. 2.44కి దొరుకుతుంటే టీడీపీ సర్కార్‌ టెండర్లకు పిలవకుండా రూ. 4.80కి కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇలాంటి ఒప్పందాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇప్పటికే డిస్కమ్‌లు విద్యుత్‌ సరఫరా దారులకు సుమారు 18 వేల కోట్లు బకాయి పడ్డాయి. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలల్లో 70 శాతం ఒప్పందాలు కేవలం ఐదారు కంపెనీలతోనే కావడం విశేషం.

గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ఆ భారం ప్రజలమీద పడుతుంది. విద్యుత్‌ చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే ఈ ఒప్పందాల సమీక్ష పై మరోసారి ఆలోచించాలని కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి, ఆయన కార్యదర్శి లేఖలు రాసినప్పటికీ…. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ లభిస్తున్నప్పుడు ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? ఆ భారాన్ని ప్రజల పై ఎందుకు వేయాలి? అని జగన్‌ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

ఈ అంశం పై మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు కొనుగోలు ఒప్పందాలను సమీక్షించకూడదని, దాని వల్ల పెట్టుబడిదారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, కొత్త పెట్టుబడులు రావని, ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతారని…. వినిపించాల్సిన కథలన్నీ వినిపిస్తున్నారు.

అయితే ఇంత రచ్చ జరుగుతున్నా… ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం తమ అభిప్రాయాన్ని ఎక్కడా బలంగా చెప్పడం లేదు. ఏదోవైపు స్టాండ్‌ తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం వీడడం లేదు. గతంలో ప్రతి ఉద్యమాన్నీ ముందుండి నడిపించిన కమ్యూనిస్టుల వారసులేనా వీళ్ళు? అనే అనుమానం వస్తోంది ప్రజలకు.

First Published:  17 July 2019 9:01 PM GMT
Next Story