Telugu Global
National

నిజమైన చాంపియన్ మహేంద్రసింగ్ ధోనీ

భరతమాత ముద్దుబిడ్డగా సైనిక సేవ కాశ్మీరు లోయలో ధోనీ గస్తీ విధులు మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్ కు రెండు ప్రపంచకప్ లు అందించిన మొనగాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన ఘనుడు. గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు ఘనమైన సేవలు అందిస్తూనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆర్జించిన నిగర్వి. ఖరీదైన విదేశీ కార్లు, విలాసవంతమైన భవంతులు, ఇండియా సిమెంట్స్ లో కీలక పదవి ఉన్నా.. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర […]

నిజమైన చాంపియన్ మహేంద్రసింగ్ ధోనీ
X
  • భరతమాత ముద్దుబిడ్డగా సైనిక సేవ
  • కాశ్మీరు లోయలో ధోనీ గస్తీ విధులు

మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్ కు రెండు ప్రపంచకప్ లు అందించిన మొనగాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన ఘనుడు.

గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు ఘనమైన సేవలు అందిస్తూనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆర్జించిన నిగర్వి. ఖరీదైన విదేశీ కార్లు, విలాసవంతమైన భవంతులు, ఇండియా సిమెంట్స్ లో కీలక పదవి ఉన్నా.. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీలో ఓ నిజమైన దేశభక్తుడు దాగి ఉన్నాడు.

క్రికెటర్ టు వీరజవాన్…

మహేంద్ర సింగ్ ధోనీ పూర్వీకులకు భారత సైనిక దళాలతో సంబంధం ఉంది. వృత్తి రీత్యా ధోనీ తండ్రి మోటార్ ఆపరేటర్ గా ఉన్నా… ధోనీ విశ్వవిఖ్యాత క్రికెటర్ గా నిలిచినా… ఓ సైనికుడుగా సేవ చేయాలని కంకణం కట్టుకొన్నాడు.

2011 లోనే భారత ప్రాదేశిక దళాలకు చెందిన పారాట్రూప్ వింగ్ లో ధోనీ…గౌరవ లెఫ్ట్ నెంట్ కర్నల్ హోదా సంపాదించాడు. హోదాను అలంకరణ కోసం మాత్రమే కాదు… తాను సుక్షితుడైన సైనికుడు కావటానికి కఠోర శిక్షణ పొందాడు.

ఆగ్రాలోని భారత సైనిక దళాల పారా ట్రూప్ శిక్షణ విభాగంలో.. ఐదుసార్లు పారా ట్రూప్ జంప్ లు చేయడం ద్వారా సుక్షితుడైన పారాజంపర్ గా గుర్తింపు సంపాదించాడు.

ప్రపంచకప్ తో 2 మాసాల విరామం..

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత… ధోనీ వ్యూహాత్మకంగా రెండుమాసాల విరామం తీసుకొన్నాడు. ఈ విలువైన సమయాన్ని దేశసేవకు వినియోగించాలని నిర్ణయించాడు.

భార్య సాక్షి, కుమార్తె జీవాకు దూరంగా ఉంటూ.. సైనికులలో ఓ సైనికుడుగా ఉంటూ సేవ చేయాలని భావించాడు. జులై 31 నుంచి ఆగస్టు 15 వరకూ సైనికుడుగా సేవ చేయటానికి అనుమతి సంపాదించాడు.

గస్తీ విధుల్లో మహేంద్రసింగ్ ధోనీ…

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా భారత క్రికెట్ కు అసమాన సేవలు అందించిన ధోనీ…తన జీవితంలో తొలిసారిగా… అంకితభావం కలిగిన ఓ సైనికుడుగా.. కాశ్మీర్ లోయలో గస్తీ విధుల్లో పాల్గోనున్నాడు.

కాశ్మీర్ లోయలోని తమ బృందంతో పాటే ఉంటూ…ధోనీ గస్తీ విధులతో పాటు గార్డుగా కూడా సేవచేయనున్నట్లు సైనికదళాలు ప్రకటించాయి.

ఓ సాధారణ సైనికుడులానే ధోనీ సైతం తన రెండుమాసాల కాలాన్ని గడుపనున్నాడు.

భారత క్రికెట్ చరిత్రలోనే సైనికదళాలకు ..ఓ సైనికుడుగా రెండుమాసాలు సేవ చేసిన ఘనతను ధోనీ మాత్రమే దక్కించుకొనే అవకాశం ఉంది.

విరామ సమయాన్ని కుటుంబసభ్యులతో విలాసవంతంగా గడపాల్సిన ధోనీ…కాశ్మీర్ లోయలో సైనికుడుగా సేవలు అందించాలని నిర్ణయించడం చూస్తే… ఈ జార్ఖండ్ డైనమైట్ పై వందరెట్లు అభిమానం పెరిగిపోక తప్పదు.

First Published:  25 July 2019 9:55 AM GMT
Next Story