Telugu Global
NEWS

టీడీపీకి తలనొప్పిగా గల్లా ప్రకటన

చంద్రబాబుకు అనుకూలమైన వారంతా ఇప్పుడు అమరావతి ముంపు ప్రాంతం కాదంటున్నారు. వీరిలో కొందరు గతంలో అమరావతి రాజధానికి సరైన ప్రాంతం కాదని వాదించిన వారూ ఉన్నారు. కానీ మారిన రాజకీయపరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లైన్ తీసుకున్నారు. టీడీపీ నేతలు అమరావతికి ముంపు సమస్య లేదని వాదిస్తున్నారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఇలా చెబుతున్నారు గానీ… గతంలో ఇదే టీడీపీ నేతలు పలు వేదికల మీద అమరావతికి ముంపు ప్రమాదం ఉందని అంగీకరించారు. చివరికి చంద్రబాబు కూడా. […]

టీడీపీకి తలనొప్పిగా గల్లా ప్రకటన
X

చంద్రబాబుకు అనుకూలమైన వారంతా ఇప్పుడు అమరావతి ముంపు ప్రాంతం కాదంటున్నారు. వీరిలో కొందరు గతంలో అమరావతి రాజధానికి సరైన ప్రాంతం కాదని వాదించిన వారూ ఉన్నారు. కానీ మారిన రాజకీయపరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లైన్ తీసుకున్నారు. టీడీపీ నేతలు అమరావతికి ముంపు సమస్య లేదని వాదిస్తున్నారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఇలా చెబుతున్నారు గానీ… గతంలో ఇదే టీడీపీ నేతలు పలు వేదికల మీద అమరావతికి ముంపు ప్రమాదం ఉందని అంగీకరించారు. చివరికి చంద్రబాబు కూడా.

మాస్టర్ ప్లాన్ ఇచ్చిన సింగపూర్ కంపెనీ కూడా కొండవీటి వాగు వల్ల రాజధాని ప్రాంతంలో 13వేల 500 ఎకరాలు ముంపుకు గురవుతుందని వివరించింది. వారం పది రోజుల పాటు ఆ నీరు అలాగే నిలిచి ఉంటుందని కూడా ఎత్తిచూపింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు కూడా అమరావతికి ముంపు ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ముంపు ప్రమాదం ఉన్న 10వేల ఎకరాల భూమిని మట్టితో పూడ్చి వరద నుంచి కాపాడుతామంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

అమరావతికి ముంపు ప్రమాదం ఉందన్న అంశాన్ని లోక్‌సభలో కూడా టీడీపీ అంగీకరించింది. 2016 డిసెంబర్‌లో గల్లా జయదేవ్ లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అమరావతిలో 13వేల 500 ఎకరాలు ముంపుకు గురవుతుందని… ఆ ముంపు నుంచి రాజధానిని రక్షించేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందని సెలవిచ్చారు.

అలా వరద నుంచి రాజధానిని కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు గాను ప్రపంచ బ్యాంకు నుంచి వెయ్యి 96 కోట్ల రుణం ఇప్పించాలంటూ లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా జయదేవ్‌ కోరారు. అలా రుణం ఇప్పిస్తే వరద రాజధాని మీదకు రాకుండా మళ్లిస్తామంటూ విజ్ఞప్తి చేశారు.

ఇదే కాకుండా 2016 మే నెలల్లో టీడీపీ అనుకూల పెద్ద పత్రిక కూడా అమరావతి ముంపుపై ఒక కథనం రాసింది. కొండవీటి వాగుకు వరద వస్తే 13వేల 500 ఎకరాలు నీటిలో చిక్కుకుంటుందని వెల్లడించింది. ఏటా మూడుసార్లు ఇలా వరదలో చిక్కుకుంటుందని పెద్ద కథనం రాసింది.

మాస్టర్ ప్లాన్‌లో సింగపూర్ కంపెనీ చెప్పిన అంశాన్ని, లోక్‌సభలో గల్లా జయదేవ్ చెప్పిన విషయాన్ని, 2016మేలో టీడీపీ పెద్ద పత్రిక కథనంలో ప్రచురించిన అంశాన్నే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ మంత్రులు చెబుతుంటే మాత్రం టీడీపీ నేతలు అంగీకరించలేకపోవడం విచిత్రంగా ఉంది.

First Published:  30 Aug 2019 11:35 PM GMT
Next Story