Telugu Global
NEWS

కుటుంబరావుకు బిగ్‌ షాక్

చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన కుటుంబరావుకు కొత్త ప్రభుత్వం పెద్ద షాక్‌ ఇచ్చింది. విజయవాడ నడిఒడ్డున 200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఈ భూమిని కుటుంబరావు చంద్రబాబు సాయంతో తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కుటుంబరావు కుటుంబసభ్యులు బోర్డులు కూడా పెట్టేశారు. దీనిపై ఇటీవల స్పందన కార్యక్రమానికి ఒక ఫిర్యాదు వచ్చింది. ప్రభుత్వ భూమిని కుటుంబరావు కబ్జా చేసిన అంశాన్ని ఫిర్యాదుదారుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో […]

కుటుంబరావుకు బిగ్‌ షాక్
X

చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన కుటుంబరావుకు కొత్త ప్రభుత్వం పెద్ద షాక్‌ ఇచ్చింది. విజయవాడ నడిఒడ్డున 200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఈ భూమిని కుటుంబరావు చంద్రబాబు సాయంతో తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

కుటుంబరావు కుటుంబసభ్యులు బోర్డులు కూడా పెట్టేశారు. దీనిపై ఇటీవల స్పందన కార్యక్రమానికి ఒక ఫిర్యాదు వచ్చింది. ప్రభుత్వ భూమిని కుటుంబరావు కబ్జా చేసిన అంశాన్ని ఫిర్యాదుదారుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో అధికారులు వెళ్లి శుక్రవారం భూమిని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబరావు ఫ్యామిలీ ఏర్పాటు చేసిన బోర్డులను అధికారులు తొలగించారు.

200 కోట్ల విలువైన ఈ భూమిని కాజేసేందుకు కుటుంబరావు పెద్ద కథే నడిపారు. 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ప్రధాన నగరాల్లో ఏ వ్యక్తి కూడా 18వందల చదరపు గజాలకు మించి స్థలం కలిగి ఉండకూడదు. 18 వందల చదరపు గజాలకు మించి ఉంటే అది ప్రభుత్వ పరమవుతోంది. ఆ సమయంలో కుటుంబరావు కుటుంబానికి విజయవాడలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ నిబంధనల కంటే అధికంగా భూమి ఉంది. అది చట్ట ప్రకారం నేరుగా ప్రభుత్వపరమవుతుందని భావించిన కుటుంబరావు కొత్త ఆలోచన చేశారు.

అదే సమయంలో రైల్వే శాఖ తన అవసరాల కోసం భూమిని సేకరించే పనిలో ఉందని తెలుసుకున్న కుటుంబరావు కుటుంబం తమ 5.1 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించి నష్టపరిహారం పొందాలని భావించింది. కానీ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ నుంచి తప్పించుకునేందుకు కుటుంబరావు ఫ్యామిలీ ఈ ఎత్తువేసిందని తెలుసుకున్న రైల్వే శాఖ నష్టపరిహారం చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్‌వోసీ తీసుకువస్తేనే నష్టపరిహారం ఇస్తామని స్పష్టం చేసింది.

దాంతో 1996లో కుటుంబరావు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లోనూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మౌనం దాల్చాయి. 5.1 ఎకరాల భూమి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి చెందుతుందని తెలిసినా ఆ విషయాన్ని కోర్టు ముందు చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రాలేదు. దాంతో కుటుంబరావుకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇక్కడే రైల్వే శాఖ తీరు అనుమానాలకు తావిచ్చింది. నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించకుండా… అసలు భూమే తమకు అవసరం లేదని కుటుంబరావు ఫ్యామిలీనే తీసుకోవచ్చు అంటూ ప్రకటించింది. దీంతో కుటుంబరావు కుటుంబం 200 కోట్ల విలువ చేసే భూమిని రైల్వే శాఖ నుంచి నేరుగా 2018 సెప్టెంబర్‌12న తీసుకుంది.

ఆ స్థలం చుట్టూ ఇప్పటికే కుటుంబరావు ఫ్యామిలీ గోడ కూడా కట్టేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇచ్చిన మౌఖిక ఆదేశాల కారణంగానే రైల్వే అధికారులు, ఇటు రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఈ భూమి విషయంలో అభ్యంతరం తెలపలేదు.

నిజానికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ భూమి ఏపీ ప్రభుత్వానికి చెందాల్సింది. కానీ దాని నుంచి తప్పించుకునేందుకు తొలుత రైల్వే శాఖకు ఇచ్చి నష్టపరిహారం తీసుకునేందుకు కుటుంబరావు కుటుంబం ప్రయత్నించింది. ఆ తర్వాత చక్రం తిప్పి రైల్వే శాఖ ద్వారానే ఈ భూమి తమకు వద్దు అని చెప్పించారు.

అప్పుడు సీన్‌లోకి ఎంటరై భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన ఏపీ ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్టు ఊరుకుంది. దీంతో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ ప్రకారం ప్రభుత్వానికి చెందాల్సిన భూమి కుటుంబరావుకే వెళ్లిపోయింది. అయితే కొత్త ప్రభుత్వం కుటుంబరావుకు షాక్‌ ఇచ్చింది.

First Published:  13 Sep 2019 8:38 AM GMT
Next Story