Telugu Global
NEWS

బాబు మాటలనే పలికిన పవన్‌ కల్యాణ్

వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలి మూడేళ్ల వరకు పల్లెత్తు మాట అనని పవన్‌ కల్యాణ్… జగన్‌ మోహన్ రెడ్డి మాత్రం వంద రోజుల్లోనే ఫెయిల్ అయిపోయారని తీర్మానించేశారు. టీడీపీ ప్రయోజనాలతో ముడిపడిన కీలకమైన అంశాలనే పవన్‌ కల్యాణ్ తన ప్రెస్‌మీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కరకట్ట నివాసం వద్ద డ్రోన్‌ లు […]

బాబు మాటలనే పలికిన పవన్‌ కల్యాణ్
X

వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలి మూడేళ్ల వరకు పల్లెత్తు మాట అనని పవన్‌ కల్యాణ్… జగన్‌ మోహన్ రెడ్డి మాత్రం వంద రోజుల్లోనే ఫెయిల్ అయిపోయారని తీర్మానించేశారు. టీడీపీ ప్రయోజనాలతో ముడిపడిన కీలకమైన అంశాలనే పవన్‌ కల్యాణ్ తన ప్రెస్‌మీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కరకట్ట నివాసం వద్ద డ్రోన్‌ లు ఎగిరిన అంశాన్ని మరోసారి ప్రస్తావించి తప్పుపట్టారు.

ఇసుక మాఫియా వల్లే టీడీపీ ఓడిపోయిందన్న పవన్ కల్యాణ్… జగన్ కూడా ఇసుక మాఫియాను అడ్డుకోలేకపోతున్నారని ఆరోపించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇసుకే లేకుండా చేశారని కొత్త ప్రభుత్వంపై పవన్ మండిపడ్డారు. జగన్‌ది జన విరుద్ద పాలన అని ఆరోపించారు. నిరుద్యోగులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో తెచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కూడా చంద్రబాబు తరహాలోనే పవన్ హేళన చేశారు. గ్రామ వాలంటీర్లకు పెళ్లిళ్లు కూడా కాబోవని ఇటీవల చంద్రబాబు శాపనార్థాలు పెట్టగా… పవన్‌ కల్యాణ్ కూడా గ్రామ వాలంటీర్లను కొరియర్‌ వ్యవస్థతో పోల్చారు.

రాష్ట్ర ఖజానాకు పెనుభారం అయ్యేలా 20, 30 ఏళ్లకు అధిక ధరకు చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కొనసాగించాలని పవన్‌ కల్యాణ్ డిమాండ్ చేశారు. పీపీఏ రద్దు వల్ల గందరగోళ పరిస్థితిని సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 13 శాతం బీరు అమ్మకాలు పెరిగాయని.. ఈ గణాంకాలను ప్రభుత్వం దాస్తోందని ఆరోపించారు.

రాజధానిని మార్చితే ఊరుకోభోమన్నారు. రాజధాని అంటే 34 వేల ఎకరాలు భూమి కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. రాజధానిపై గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో 100 రోజుల పాలనలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌… కియో కారు ప్రతినిధులను బెదిరిస్తే ఇక పెట్టుబడులు ఎలా వస్తాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

పవన్‌ కల్యాణ్ ప్రెస్ మీట్ మొత్తం చూస్తే ఆయన వైసీపీ ఏం చేసినా దాన్ని స్వాగతించేందుకు సిద్దంగా లేరన్నది స్పష్టమవుతోంది. గతంలో ఉదయం లేస్తే ఉద్దానం అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్ … ఆసమస్యకు కొత్త ప్రభుత్వం శాశ్వత ప్రతిపాదికన చర్యలు తీసుకున్నా, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నా, మంచినీటి పథకం తీసుకొస్తున్నా దాన్ని మాత్రం అభినందించలేకపోయారు.

వీటితో పాటు పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలను మాట్లాడడం ఆయన అభిమానులనే ఆశ్చర్యపరిచింది. జగన్ ప్రభుత్వం ఈ మూడు నెలలలో అమలు చేసిన అనేక కార్యక్రమాలను అమలుచేయలేదని పవన్ కళ్యాణ్ అనడం ఆయన పట్ల గౌరవం తగ్గించింది.

First Published:  14 Sep 2019 1:58 AM GMT
Next Story