Telugu Global
Others

కొరవడుతున్న ఓటర్ల నైతిక శక్తి

సమకాలీన భారత రాజకీయ చిత్రపటంలో తీవ్ర భావాలుగల రాజకీయ శక్తులకు అవకాశం ఉండడం ఆ రాజకీయాలు పరిణాత్మకమైనందువల్లే కాదు. ఓటర్లు తమ నైతిక శక్తిని వినియోగించుకోవడంలో విఫలం కావడం కూడా కారణమే. ఉదాహరణకు ఓటర్లు తమ నైతిక శక్తిని వినియోగించుకోవడం అంటే చట్ట వ్యతిరేకమైన, మానవాళికి తలవంపులు తెచ్చే అన్ని రకాల హింసా కాండను నిరాకరించడం. అలాంటి హింసాకాండను తిరస్కరించడమే సవ్యమైన మార్గాన్ని అనుసరించడం. మూక హత్యలు ఇలాంటివే. అవి చట్ట వ్యతిరేకమైనవే కాక మానవాళికి తలవంపులు […]

కొరవడుతున్న ఓటర్ల నైతిక శక్తి
X

సమకాలీన భారత రాజకీయ చిత్రపటంలో తీవ్ర భావాలుగల రాజకీయ శక్తులకు అవకాశం ఉండడం ఆ రాజకీయాలు పరిణాత్మకమైనందువల్లే కాదు. ఓటర్లు తమ నైతిక శక్తిని వినియోగించుకోవడంలో విఫలం కావడం కూడా కారణమే.

ఉదాహరణకు ఓటర్లు తమ నైతిక శక్తిని వినియోగించుకోవడం అంటే చట్ట వ్యతిరేకమైన, మానవాళికి తలవంపులు తెచ్చే అన్ని రకాల హింసా కాండను నిరాకరించడం. అలాంటి హింసాకాండను తిరస్కరించడమే సవ్యమైన మార్గాన్ని అనుసరించడం. మూక హత్యలు ఇలాంటివే. అవి చట్ట వ్యతిరేకమైనవే కాక మానవాళికి తలవంపులు తెచ్చేవి కూడా.

ఒక ప్రాంతంలో జరిగే హింసాకాండ అది వ్యక్తులు ప్రత్యక్షంగా పాల్పడినా, పరోక్షంగా పాల్పడినా లేదా రాజ్య వ్యవస్థలు ఆ పని చేసినా అది ఇతర ప్రాంతాల మీద కూడా ప్రభావం చూపుతుంది. హింసా కాండ లేదా ఒకానొక సందర్భంలో స్వేచ్ఛను హరించడం ఇతర ప్రాంతాల ప్రజల మీద కూడా ప్రభావం చూపుతుంది.

హింసా కాండ జరిగిన ప్రాంతాలలో నైతిక భీతికి దారి తీస్తుంది. అసలు తమకు స్వేచ్ఛ ఉందా లేదా అనుమానం జనానికి కలుగుతుంది. స్వేచ్ఛకు ఉన్న సామాజిక అవకాశం హింసా కాండను అణచడానికి వ్యవస్థ లేదా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న సందేహాన్ని కూడా కలిగిస్తుంది.

నైతికమైన భీతికి గల అవకాశాలను పోగొట్టడంలో ప్రభుత్వ వైఫల్యం ఓటర్లకు ఉన్న పరిమిత శక్తికి లోబడే ఉంటుంది. కేవలం ఓటుకు ఉన్న శక్తే అధికారం సవ్యమైంది అని చెప్పడానికి సరిపోదు.

ఓటుకు ఉన్న శక్తి ఒక్కటే సరిపోదు. ఎందుకంటే అది యథాతథవాద శక్తులకు సహాయకారి కావచ్చు. అందువల్ల ఓటర్ల నైతిక శక్తి హింసను తిరస్కరించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలి. ఈ నైతిక శక్తే సవ్యంగా వ్యవహరించడానికి తోడ్పడుతుంది.

ఈ సందర్భంలో మౌలికమైన స్వేచ్ఛ, అహింస ప్రధానమైన అంశాలవుతాయి. అయితే ఓటు వేసేటప్పుడు ప్రజల నైతిక శక్తి ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనికి అనుకూలమైన సమాధానం చెప్పడం దురదృష్టవశాత్తు సాధ్యం కాదు. ఎందుకంటే హింస చెలరేగినప్పుడు ప్రజలు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోతారు. ప్రజల కళ్ల ముందే ఈ హింస కొనసాగుతుంది. ప్రజలు తమ నైతిక శక్తిని వినియోగించనప్పుడు మరెవరో ఆ బాధ్యత నిర్వర్తించాలి. వారికి ఆ అధికారం ఉండాలి.

ఎందుకంటే జనమో, రాజ్య వ్యవస్థో తమ నైతిక శక్తిని, రాజ్యాంగ పరిధుల్ని అతిక్రమించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హింసకు దిగుతాయి. ఈ సందర్భంలో తీవ్ర రాజకీయ అభిప్రాయాలు ఉన్న శక్తులు సత్యాన్వేషణ కోసం నిజ నిర్ధారణకు ఉపక్రమిస్తాయి.

విచిత్రం ఏమిటంటే ఈ పరిస్థితుల్లో తీవ్ర రాజకీయ అభిప్రాయాలు గల శక్తులు రంగ ప్రవేశం చేసినప్పుడు ఎక్కువగా ప్రభుత్వంతో ఘర్షణ పడవలసిన అవసరమే ఉంటుంది తప్ప ప్రజలతో సంపర్కం తక్కువ ఉంటుంది. హింసను తిరస్కరించడంలో ప్రజలు తమ నైతిక శక్తిని వినియోగించడంలో విఫలం అవుతున్నందువల్ల తాము జోక్యం చేసుకోక తప్పదని తీవ్ర రాజకీయ అభిప్రాయాలున్న శక్తులు భావిస్తాయి.

తీవ్ర రాజకీయ అభిప్రాయాలు ఉన్న వారు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతుంటే ప్రభుత్వం ఆ అంశాన్ని విస్మరిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా తీవ్ర రాజకీయ అభిప్రాయాలు గల వారికి, యథాతథ వాదులకు మధ్య ఊగుడుబల్లలా తయారవుతుంది. పైగా తీవ్ర రాజకీయ అభిప్రాయాలుగల వారి ప్రయత్నాలు యథాతథ వాదుల ప్రయత్నాలకన్నా బలహీనంగా ఉంటాయి. అందుకే ఈ తీవ్ర అభిప్రాయాలున్న వారిని దీనికి వ్యతిరేకులు, దానికి వ్యతిరేకులు అని నిందిస్తుంటారు.

కావాల్సింది ఏమిటంటే నైతిక శక్తికి ప్రాధాన్యం ఉంది అని సచేతనంగా చెప్పగలగాలి. హింసాకాండను తిరస్కరించ గలగాలి. కానీ పరిస్థితి ఏమిటంటే తీవ్ర రాజకీయ అభిప్రాయాలు ఉన్న వారికి, మరో రకమైన యథాతథ వాదులకు మధ్య పరస్పరం శత్రు భావమే ఉంటుంది. సమాజంలోని బలహీన వర్గాల వారి మీద హింసా కాండ కూడదు అన్న విషయంలో పరస్పర అంగీకారం కుడిర్చే ప్రయత్నాలలో జరిగింది ఏమిటంటే ఈ రెండు వర్గాల మధ్య శత్రుభావమే పెరిగింది.

మూక దాడుల విషయంలోనూ ఇదే జరిగింది. హింసాకాండను వ్యతిరేకించడం తక్షణం, ఆ మాటకొస్తే అనునిత్యం జరగాలి. ఇది ఎన్నికలు జరిగే దాకా వాయిదా వేయాల్సింది కాదు. జాప్యం చేస్తే యథాతథ వాదులు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. సత్యం అన్న అంశాన్ని ఆలోచనలను నియంత్రించే వారు సొంతం చేసుకుంటారు. సత్యం నోరు మూయించడానికి వెంటపడి వేధిస్తారు.

పరస్పర అంగీకారం కుదరాలి అంటే వాస్తవమేమిటో నిక్కచ్చిగా చెప్పాలి. హింస చెల రేగినప్పుడు ప్రజా సంక్షేమానికి ఎలా విఘాతం కలిగిందో అహింసా మార్గ ప్రయోజనం ఏమిటో చెప్పాలి. హింసా మార్గాన్ని కొనసాగించి సామాజిక అభివృద్ధి సాధించిన, లేదా రాజకీయ అధికారం నిలబెట్టుకున్న సమాజం ఏదీ లేదు.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  20 Sep 2019 7:02 PM GMT
Next Story