Telugu Global
NEWS

గూగుల్‌ ఎర్త్‌ సాయంతో బాబు బంధువు కంపెనీకి చెక్

చంద్రబాబు హయాంలో ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు సాగించిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు అండతో అధిక ధరకు ప్రభుత్వానికి విద్యుత్‌ను అంటగడుతూ ప్రైవేట్‌ విద్యుత్ సంస్థలు ప్రజాధనాన్ని దోచిన విధానం వెలుగులోకి వస్తోంది. బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ విద్యుత్ రెండు రూపాయలకే దొరుకుతుంటే… చంద్రబాబు చేసుకున్న ధీర్ఘకాలిక ఒప్పందాల వల్ల విద్యుత్‌ సంస్థలకు యూనిట్‌కు 6.8 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం పీపీఏలను పునర్‌ సమీక్షించేందుకు సిద్ధమైంది. అయితే ధరలు తగ్గించి […]

గూగుల్‌ ఎర్త్‌ సాయంతో బాబు బంధువు కంపెనీకి చెక్
X

చంద్రబాబు హయాంలో ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు సాగించిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు అండతో అధిక ధరకు ప్రభుత్వానికి విద్యుత్‌ను అంటగడుతూ ప్రైవేట్‌ విద్యుత్ సంస్థలు ప్రజాధనాన్ని దోచిన విధానం వెలుగులోకి వస్తోంది.

బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ విద్యుత్ రెండు రూపాయలకే దొరుకుతుంటే… చంద్రబాబు చేసుకున్న ధీర్ఘకాలిక ఒప్పందాల వల్ల విద్యుత్‌ సంస్థలకు యూనిట్‌కు 6.8 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.

ఈనేపథ్యంలో జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం పీపీఏలను పునర్‌ సమీక్షించేందుకు సిద్ధమైంది. అయితే ధరలు తగ్గించి ప్రజాధనం ఆదా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విచిత్రంగా… ప్రతిపక్షం, కొన్ని పత్రికలు మాత్రం పీపీఏలు రద్దు చేయడానికి వీల్లేదు అధిక ధరకే ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటూ పట్టుపడుతున్నాయి.

ఈనేపథ్యంలో చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్ పేరుతో ప్రైవేట్ కంపెనీలు సాగించిన అనైతిక విధానాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం గూగుల్ ఎర్త్‌ సాయాన్ని తీసుకుంటోంది. సోలార్ ప్లాంట్ల వద్ద ఎప్పుడు సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు అన్న అంశాన్ని నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగింది.

తొలుత చంద్రబాబు ప్రభుత్వం తమకు సన్నిహితంగా ఉండే ప్రైవేట్ కంపెనీలతో 619 మెగావాట్ల విద్యుత్‌ కోసం ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్ యూనిట్‌కు ఏకంగా రూ. 6.8 చెల్లించేందుకు అంగీకరించింది. ఇక్కడే ప్రైవేట్ కంపెనీలు కొన్ని అడ్డదారులు తొక్కాయి. ఇందులో చంద్రబాబు బంధువుకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ కూడా ఉంది.

ప్రభుత్వం యూనిట్‌కు 6.8 రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకోగా… ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సోలార్‌ ప్యానల్స్ ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. దాంతో సౌర విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా భారీగా తగ్గిపోయింది. ఇక్కడే చంద్రబాబు సహకారంతో ప్రైవేట్ విద్యుత్ సంస్థలు కొత్త ఎత్తు వేశాయి.

ప్రపంచ వ్యాప్తంగా సోలార్ ప్యానల్స్ ధర తగ్గిన నేపథ్యంలో భారీగా ప్యానల్స్‌ను తెచ్చి వాటి ద్వారా అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఆ సమయానికి సౌర విద్యుత్‌ ధర కూడా 2.5 రూపాయలకు పడిపోయాయి. కానీ ఇలా అదనపు ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒప్పందం చేసుకున్న 610 మెగావాట్లకు కాకుండా ఏకంగా 950 మెగావాట్లకు పెంచేశారు. అలా పెంచిన ఉత్పత్తిని కూడా పాత ధరకే అంటే 6.8 రూపాయలకే ప్రభుత్వానికి అంటగట్టాయి కంపెనీలు.

ఈ దోపిడి ఎత్తుగడను అప్పట్లోనే ట్రాన్స్‌కో విజిలెన్స్ గుర్తించింది. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఒప్పందం చేసుకున్న మేరకే కాకుండా తక్కువ ఖర్చుతో అదనంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆ అదనపు విద్యుత్‌ను కూడా అధిక ధరకే కంపెనీలు అంటగట్టాయి. దీంతో డిస్కంలు భారీగా నష్టపోయాయి.

పీపీఏల పునర్‌ సమీక్ష వద్దు అంటూ ప్రైవేట్ కంపెనీలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో వీరి ఆట కట్టించేందుకు… గూగుల్ ఎర్త్‌ ద్వారా సోలార్ ప్యానల్స్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారన్నది నిర్ధారించేందుకు అధికారులు సిద్దమయ్యారు.

ఒప్పందానికి విరుద్దంగా సోలార్ ప్యాన్సల్ ధరలు తగ్గిన తర్వాత అదనంగా వాటిని ఏర్పాటు చేసి…. అదనపు ఉత్పత్తి చేశారని నిరూపించేందుకు గూగుల్ ఎర్త్ ద్వారా వివిధ కాలాల్లో సోలార్ ప్లాంట్‌ల వద్ద సోలార్ పలకల ఏర్పాటుకు సంబంధించి పాత ఫొటోలను వెలికితీసి కంపెనీల అక్రమాలను నిరూపించనున్నారు.

First Published:  25 Sep 2019 11:42 PM GMT
Next Story