Telugu Global
NEWS

చంద్రబాబు కుంభకోణాన్ని అంకెలతో వివరించిన కాకాణి

చంద్రబాబు విద్యుత్ ఒప్పందాల్లో సాగించిన అవకతవకలను వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధారాలతో సహా వివరించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాకాణి చంద్రబాబు చేసుకున్న పీపీఏల వెనుక అసలు ఉద్దేశాలను సవివరంగా వివరించారు. పీపీఏలపై చంద్రబాబు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పీపీఏలను సమీక్షించ వద్దని హైకోర్టు చెప్పిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పీపీఏల విషయంలో ఏపీఈఆర్‌సీ వద్ద తేల్చుకోవాలని హైకోర్టు చెబితే అది పీపీఏలను సమీక్షించవద్దని చెప్పడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. […]

చంద్రబాబు కుంభకోణాన్ని అంకెలతో వివరించిన కాకాణి
X

చంద్రబాబు విద్యుత్ ఒప్పందాల్లో సాగించిన అవకతవకలను వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధారాలతో సహా వివరించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాకాణి చంద్రబాబు చేసుకున్న పీపీఏల వెనుక అసలు ఉద్దేశాలను సవివరంగా వివరించారు.

పీపీఏలపై చంద్రబాబు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పీపీఏలను సమీక్షించ వద్దని హైకోర్టు చెప్పిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పీపీఏల విషయంలో ఏపీఈఆర్‌సీ వద్ద తేల్చుకోవాలని హైకోర్టు చెబితే అది పీపీఏలను సమీక్షించవద్దని చెప్పడం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

ప్రజల సొమ్ము దోపిడికి గురవుతుంటే ఆ దోపిడిని కొనసాగించాలని ఏ కోర్టు అయినా ఆదేశాలు ఇస్తుందా… ఆ విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. అసలు పీపీఏలు, పోలవరం విషయంలో చంద్రబాబు ఎందుకు ఇంత ఉత్సాహం చూపుతున్నారో చెప్పాలన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా డబ్బు ఆదా చేస్తుంటే… పీపీఏలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వ సంస్థలపై భారం తగ్గించేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే… అది తప్పు ఎలా అవుతుందని చంద్రబాబును ప్రశ్నించారు.

ఇంత హీనమైన స్థితికి చంద్రబాబు ఎందుకు దిగజారిపోయారో అర్థం కావడం లేదన్నారు. పీపీఏలను సమీక్షిస్తే తనకు రావాల్సిన వాటా ఎక్కడ ఆగిపోతుందో అన్న ఆందోళన చంద్రబాబులో ఉన్నట్టుగా ఉందన్నారు.

థర్మల్ విద్యుత్‌ యూనిట్‌కు 4.20 రూపాయలకు దక్కుతున్న సమయంలో సంప్రాదాయేత విద్యుత్‌కు 4.84 పైసలు ఎందుకు చెల్లించారని కాకాణి ప్రశ్నించారు. థర్మల్ విద్యుత్‌ భారీగా మిగులు ఉన్న సమయంలో నిర్దేశించిన దాని కంటే అధికంగా సాంప్రదాయేత విద్యుత్‌ పేరుతో పవన విద్యుత్‌ను ఎందుకు కొన్నారని నిలదీశారు. చంద్రబాబు సన్నిహితులకు చెందిన గ్రీన్‌ కో, మైత్రితో పాటు మరో కంపెనీ నుంచే 63 శాతం విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారని కాకాణి వివరించారు.

సాంప్రదాయేత విద్యుత్‌ కొనుగోలు లక్ష్యాన్ని ఏపీఈఆర్‌సీ 5 శాతంగా పెట్టుకుంటే చంద్రబాబు వచ్చాక పరిస్థితి తారుమారైందని గణాంకాలతో సహా కాకాణి వివరించారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న 2012-13లో ఐదు శాతం సాంప్రదాయేత విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఏపీఈఆర్‌సీ లక్ష్యంగా పెట్టుకోగా… అంతకంటే తక్కువగా 2.05 శాతం మాత్రమే కొనుగోలు చేశారని వివరించారు.

  • 2013-14లో సాంప్రదాయేత విద్యుత్‌ కొనుగోలు లక్ష్యం 5 శాతం కాగా కొనుగోలు చేసింది 1.84 శాతం.
  • 2014-15లో సాంప్రదాయేత విద్యుత్‌ కొనుగోలు లక్ష్యం 5 శాతం కాగా కొనుగోలు చేసింది 4. 28 శాతం (ఆ ఏడాదే చంద్రబాబు సీఎం కావడంతో పెరిగిన సాంప్రదాయేత విద్యుత్ కొనుగోలు)
  • 2016-17లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సాంప్రదాయేత విద్యుత్ కొనుగోలు లక్ష్యం 5 శాతం కాగా… 5.59 శాతం కొనుగోలు చేశారు.
  • 2016-17 నాటికి కంపెనీలో చంద్రబాబు బేరసారాలు మొదలుపెట్టి 5 శాతం కొనాల్సి ఉన్నా 9.31 శాతం కొనుగోలు చేశారని కాకాణి వివరించారు.
  • 2017-18 లో ఏపీఈఆర్‌సీపై ఒత్తిడి తెచ్చి సాంప్రదాయేత విద్యుత్ కొనుగోలు లక్ష్యాన్ని 9 శాతానికి చంద్రబాబు పెంచారని…. అలా చేసి ఏకంగా 16.5 శాతం సాంప్రదాయేత విద్యుత్‌ను ప్రైవేట్ కంపెనీల నుంచి అధిక ధరకు కొనుగోలు చేశారని వెల్లడించారు .
  • 2018-19 వచ్చే సరికి 11 శాతం కొనుగోలు లక్ష్యాన్ని ఏపీఈఆర్‌సీ ద్వారా పెంచడంతో పాటు ఏకంగా ప్రైవేట్ కంపెనీల నుంచి 22. 6 శాతం విద్యుత్‌ కొనుగోలు చేశారని కాకాణి లెక్కలతో సహా వివరించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వరుసగా థర్మల్ విద్యుత్‌ మిగులు 2015-16లో 642 మిలియన్ యూనిట్లు, 2016-17లో 10వేల 470 మిలియన్ యూనిట్లు, 2017-18లో 12వేల 400 మిలియన్ యూనిట్లు మిగులు ఉందని కాకాణి వివరించారు.

అయినా సరే తక్కువ ధరకు దొరికే థర్మల్ విద్యుత్‌ను కాకుండా అధిక ధరకు విండ్‌ పవర్‌ను… అందులోనూ నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ కొనుగోలు చేయడం వల్ల ఏటా డిస్కంపై 5వేల కోట్ల నష్టం వచ్చి పడిందని వెల్లడించారు. అదే సమయంలో ఒప్పందాల మేరకు కొనుగోలు చేయకపోయినా థర్మల్‌ విద్యుత్‌ మిగులుకు యూనిట్‌కు రూపాయి 10 పైసలను థర్మల్ విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం ఫిక్స్‌డ్‌ రేటు కింద చెల్లించాల్సి వచ్చిందన్నారు.

చంద్రబాబు చేసిన పని వల్ల నాలుగేళ్లలో 30వేల మిలియన్ యూనిట్ల థర్మల్ పవర్‌కు యూనిట్‌కు రూపాయి 10పైసలు చొప్పున ఫిక్స్‌డ్ రేటు కింద డబ్బు చెల్లించాల్సి వచ్చిందన్నారు.

ఇంత బహిరంగంగా కుంభకోణం చేసిన చంద్రబాబు ఇప్పుడు పీపీఏను సమీక్షిస్తామంటే తన వాటాలు ఆగిపోతాయన్న ఆందోళనతో గగ్గోలు పెడుతున్నారని కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. తక్కువ ధరకే థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నా సరే దాన్ని తీసుకోకుండా… ఏపీఈఆర్‌సీ పెట్టుకున్న లక్ష్యాన్ని కూడా దాటేసి ప్రైవేట్ కంపెనీల నుంచి సాంప్రదాయేత విద్యుత్ ఎందుకు కొనుగోలు చేశారని సూటిగా ప్రజలకు చంద్రబాబు చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు.

జీయూవిఎన్‌ఎల్‌ సంస్థ నుంచి గుజరాత్‌ ప్రభుత్వం విండ్‌ పవర్‌ను యూనిట్‌ను రూ. 2.43కు కొనుగోలు చేసిందని.. కానీ చంద్రబాబు ప్రభుత్వం తనకు అనుకూలమైన మూడు కంపెనీల నుంచి యూనిట్‌ రూ. 4.84 కు కొనుగోలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

అనంతపురం జిల్లాలో ఉత్పత్తి అయ్యే పవన్ విద్యుత్‌కు పక్కనే ఉన్న కర్నాటకలో తయారవుతున్న పవన విద్యుత్‌కు ధరలో భారీ వ్యత్యాసం ఎందుకు ఉందో చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ చెప్పారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ అవినీతిని నిర్మూలించేందుకే రివర్స్ టెండరింగ్‌ ద్వారా 840 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయిందన్నారు.

గత ప్రభుత్వం పెద్దలు ముడుపులు కోసం పాకులాడితే జగన్‌ ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాకాణి వివరించారు.

First Published:  28 Sep 2019 6:59 AM GMT
Next Story