Telugu Global
National

ట్విట్టర్‌లో బీజేపీకి మరో బిస్కెట్ వేసిన బాబు

తన రాజకీయ ప్రత్యర్థుల్లో కొందరిని ఏకంగా కేంద్ర ప్రభుత్వం జైలుకు కూడా పంపిన నేపథ్యంలో నెక్ట్స్ టార్గెట్ చంద్రబాబే అంటూ కొందరు ఇటీవల వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో చేతులు కలిపి.. అన్ని ప్రాంతీయ పార్టీలను మోడీకి వ్యతిరేకంగా ఏకం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు, కాంగ్రెస్‌కు ఆర్ధిక సాయం చేయడం, అమిత్ షా తిరుమల వస్తే రాళ్లతో, చెప్పులతో కొట్టించడం వంటివి చేసిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మోడీ పేరు ఎత్తేందుకు కూడా సాహసించడం […]

ట్విట్టర్‌లో బీజేపీకి మరో బిస్కెట్ వేసిన బాబు
X

తన రాజకీయ ప్రత్యర్థుల్లో కొందరిని ఏకంగా కేంద్ర ప్రభుత్వం జైలుకు కూడా పంపిన నేపథ్యంలో నెక్ట్స్ టార్గెట్ చంద్రబాబే అంటూ కొందరు ఇటీవల వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో చేతులు కలిపి.. అన్ని ప్రాంతీయ పార్టీలను మోడీకి వ్యతిరేకంగా ఏకం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు, కాంగ్రెస్‌కు ఆర్ధిక సాయం చేయడం, అమిత్ షా తిరుమల వస్తే రాళ్లతో, చెప్పులతో కొట్టించడం వంటివి చేసిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మోడీ పేరు ఎత్తేందుకు కూడా సాహసించడం లేదు.

ఇంతలోనే సుజనాచౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీ చేర్చుకోవడం చంద్రబాబుకు కాస్త ఊరటనిచ్చే అంశమే. అయినా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రాన్ని దువ్వే ప్రయత్నాలు మొదలుపెట్టారా అన్న అనుమానం కలుగుతోంది.

ఇప్పటికే తాను కాంగ్రెస్ నుంచి విడిపోయానని మోడీ, అమిత్ షాలకు సిగ్నల్స్ పంపేందుకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలవకుండా ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెట్టాడు బాబు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా తన బొమ్మే వేసుకుని ప్రచారం చేసుకున్నాడు చంద్రబాబు. ఎక్కడా కూడా కేంద్రానికి, మోడీకి క్రెడిట్ రాకుండా జాగ్రత్తపడ్డాడు. 24 గంటల విద్యుత్ పథకం విషయంలోనూ బాబు తీరు అలాగే ఉండేది.

కేంద్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ సరఫరా పథకం కింద ఏపీని ఎంపిక చేయడంతో కోతలు లేకుండా పోయాయి. కానీ ఐదేళ్లలో ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ వల్లే నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పలేదు. తానే మొత్తం విద్యుత్ వ్యవస్థను ఒంటి చేత్తో దారికి తెచ్చానని చంద్రబాబు చెప్పుకునేవాడు.

కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు బాబు. భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడం, బాబు గతంలో తెచ్చిన విద్యుత్‌ అప్పును తిరిగి విద్యుత్‌ రూపంలోనే ఉత్తరాధి రాష్ట్రాలకు అందించాల్సి రావడంతో ఏపీలో విద్యుత్ కొరత ఏర్పడింది.

ఈ పరిస్థితిని విమర్శిస్తూ ట్వీట్ పెట్టిన చంద్రబాబు… తాను నిరంతరం విద్యుత్‌ ఇవ్వడానికి కేంద్ర సహకారం కూడా కారణమని అంగీకరించాడు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తాను నిరంతర విద్యుత్‌ ఇచ్చానని కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిందని విమర్శించాడు.

పనిలో పనిగా తాను అధిక ధరకు 20ఏళ్లకు తాను చేసుకున్న పీపీఏల రాగం కూడా వినిపించాడు. పీపీఏలను రద్దు చేయకుండా ప్రైవేట్ కంపెనీ నుంచి విద్యుత్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు తీర్మానించాడు. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా… భవిష్యత్తులో విద్యుత్ ధరలు మరింత తగ్గుతాయని తెలిసినా చంద్రబాబు మాత్రం తన సన్నిహితులకు చెందిన ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి భారీ ధరకు…. 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. వాటి వల్ల ఏటా డిస్కంలపై 5వేల కోట్ల భారం పడుతోంది.

మొత్తం మీద గతంలో విద్యుత్ విషయంలో ఘనత మొత్తం తనదేనని చెప్పుకున్న చంద్రబాబు… ఇప్పుడు మాత్రం అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేసిందని అంగీకరించడమే ఆసక్తిగా ఉంది.

First Published:  1 Oct 2019 3:02 AM GMT
Next Story