Telugu Global
National

రేవంత్‌ రెడ్డి కోసమే బాబు రంగంలోకి దిగారా?

తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో హఠాత్తుగా టీడీపీ బరిలో దిగడం చర్చనీయాంశమైంది. 2014లో బీజేపీతో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు. టీడీపీతో పొత్తు కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎంత హడావుడి చేసినా తెలంగాణలో ఆ పార్టీ మూలాలే కదిలిపోయాయి. దాంతో లోక్‌సభ ఎన్నికల్లో అసలు తెలంగాణలో పోటీకి టీడీపీ సాహసించలేదు. కానీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లోక్‌సభకు వెళ్లడంతో ఖాళీ […]

రేవంత్‌ రెడ్డి కోసమే బాబు రంగంలోకి దిగారా?
X

తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో హఠాత్తుగా టీడీపీ బరిలో దిగడం చర్చనీయాంశమైంది.

2014లో బీజేపీతో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు. టీడీపీతో పొత్తు కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎంత హడావుడి చేసినా తెలంగాణలో ఆ పార్టీ మూలాలే కదిలిపోయాయి. దాంతో లోక్‌సభ ఎన్నికల్లో అసలు తెలంగాణలో పోటీకి టీడీపీ సాహసించలేదు.

కానీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లోక్‌సభకు వెళ్లడంతో ఖాళీ అయిన హుజూర్‌నగర్‌ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టింది. అసలు ఎందుకు చంద్రబాబు ఇలా చేశారన్నదే ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న.

చంద్రబాబు ఇలా చేయడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు కనిపిస్తున్నాయి. హుజూర్‌నగర్‌ ఎన్నిక ద్వారా అనేక సంకేతాలు పంపుతున్నారు.

మొన్నటి వరకు కాంగ్రెస్‌తో చెట్టాపట్టేలేసుకుని తిరిగిన చంద్రబాబు… మోడీని దించేస్తా… మసి చేస్తా అంటూ కోతలు కోశారు. కానీ అసలు ఫలితం చంద్రబాబు ముఖానికి మసి అంటేలా చేసింది. అప్పటి నుంచి మోడీ పేరు కూడా ఎత్తలేదు బాబు.

కానీ మోడీకి, అమిత్ షాకు మాత్రం చంద్రబాబుపై ఇంకా కోపం తగ్గలేదు. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్‌తో లేను… ఆపార్టీతో స్నేహాన్ని వదిలేశానని బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపే ఉద్దేశంతోనే హుజూర్‌నగర్‌లో టీడీపీ బరిలో దిగింది.

అదే సమయంలో చంద్రబాబు మరో వ్యూహం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ పదవి కోసం ఉత్తమ్‌కి, రేవంత్ రెడ్డికి మధ్య వార్ నడుస్తోంది. హుజూర్‌నగర్‌ అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి మాట నెగ్గలేదు. దాంతో రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నాడు. కాంగ్రెస్‌లో ఉన్నా ఇప్పటికీ రేవంత్ రెడ్డి చంద్రబాబు సానుభూతిపరుడుగానే ఉంటున్నాడు. ఆ విషయం పలుమార్లు బహిరంగంగానే రుజువైంది.

రేవంత్ రెడ్డికి అడ్డుపడుతున్న ఉత్తమ్‌కు చెక్ పెట్టాలంటే హుజుర్‌నగర్‌లో ఆయన భార్య పద్మావతిని ఓడించడం ఒకటే మార్గమని రేవంత్ రెడ్డి వర్గం భావిస్తోంది. ఇందుకు సహకరించే కోణంలోనే చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని అక్కడ నిలిపి ప్రతిపక్షం ఓట్లు చీల్చేందుకు ప్లాన్ చేశారని భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో భార్యను గెలిపించుకోలేకపోతే ఉత్తమ్ హవా తగ్గుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి అవకాశాలు మెరుగుపడుతాయి. అదే జరిగితే రేవంత్ రెడ్డి ద్వారా టీ కాంగ్రెస్‌ తన కనుసన్నల్లో ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు అనుమానిస్తున్నారు.

First Published:  30 Sep 2019 8:04 PM GMT
Next Story