Telugu Global
National

ప్రంజల్ పాటిల్.... మొట్టమొదటి మహిళా అంధ ఐఏఎస్ అధికారి

జీవితంలో ఏదైనా సాధించాలంటే అంగవైకల్యం ఒక అడ్డు కానే కాదని ఎందరో వ్యక్తులు నిరూపించారు. చిత్రాలు గీస్తూ.. పరుగులు తీస్తూ.. తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి తన అంధత్వాన్ని కూడా జయించి ఏకంగా సబ్ కలెక్టర్ అయ్యింది. ఆమె పేరే ప్రంజల్ పాటిల్. దేశంలో మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిగా రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన ప్రంజల్ పాటిల్ తన 6వ ఏటే చూపు కోల్పోయింది. అయినా సరే తల్లిదండ్రుల […]

ప్రంజల్ పాటిల్.... మొట్టమొదటి మహిళా అంధ ఐఏఎస్ అధికారి
X

జీవితంలో ఏదైనా సాధించాలంటే అంగవైకల్యం ఒక అడ్డు కానే కాదని ఎందరో వ్యక్తులు నిరూపించారు. చిత్రాలు గీస్తూ.. పరుగులు తీస్తూ.. తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి తన అంధత్వాన్ని కూడా జయించి ఏకంగా సబ్ కలెక్టర్ అయ్యింది. ఆమె పేరే ప్రంజల్ పాటిల్. దేశంలో మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిగా రికార్డు సృష్టించింది.

మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన ప్రంజల్ పాటిల్ తన 6వ ఏటే చూపు కోల్పోయింది. అయినా సరే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన చదువును కొనసాగించింది. అలా ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో అంతర్జాతీయ వ్యవహారాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2016లో తొలి సారి యూపీఎస్సీ రాసి 773 ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకుతో తనకు ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) ఉద్యోగం వచ్చింది. కాగా, ఆమె అంధురాలని తెలుసుకొని ఆమెకు ఇచ్చిన పోస్టును రద్దు చేశారు.

అయినా నిరాశకు గురవ్వని ప్రాంజల్ మరో సారి యూపీఎస్సీకి గట్టిగా ప్రయత్నించింది. దీంతో ఈ సారి 124వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యింది. ఇక ముస్సోరీలో శిక్షణ తీసుకునే సమయంలోనే ఆమెను కేరళ కేడర్‌కు ఎంపిక చేశారు. అంతే కాక ఎర్నాకులం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా ట్రైనింగ్ పొందారు. శిక్షణ అనంతరం ఆమె తిరువునంతపురం జిల్లా సబ్ కలెక్టర్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా తన అనుభవాన్ని ఆమె మీడియాతో షేర్ చేసుకున్నారు. చిన్నతనంలో తనకు చూపు పోయిన తర్వాత తన కంటికి ఎన్నో సార్లు సర్జరీలు జరిగాయని.. ఆ సమయంలో ఎంతో బాధగా ఉండేదని ఆమె పేర్కొంది. ఎన్ని సర్జరీలు జరిగినా అన్నీ విఫలమయ్యాయని చెప్పారు. అయినా సరే జీవితంలో ఏనాడు వెనుకడుగు వేయలేదని.. ఏదో ఒకటి సాధించాలనే తపనే తనను ఇవ్వాళ ఈ స్థితికి చేర్చిందని ఆమె గర్వంగా చెప్పారు. ఆమెకు తిరువునంతపురంలో ఘనంగా స్వాగతం లభించింది.

దేశంలో మొట్టమొదటి మహిళా అంధ ఐఏఎస్‌గా ప్రంజల్ రికార్డు సృష్టించగా.. మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్ తివారి ఇప్పటికే రికార్డులకెక్కారు.

First Published:  14 Oct 2019 8:55 PM GMT
Next Story