Telugu Global
NEWS

అందుకే అన్న క్యాంటీన్‌లో ఏసీ పెట్టలేదు

తన రాజకీయ జీవితమంతా పేదల కోసమే అని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెట్టడంతో పాటు క్యాంటీన్లలో ఏసీ పెట్టాలని భావించానని… కానీ భోజనం చేసేందుకు వస్తూపోతూ ఉంటారు కాబట్టి ఏసీ వీలుకాదంటే ఆ ఆలోచన వదిలిపెట్టానని చెప్పారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌ను నిర్మించానని… అదే స్పూర్తితో అమరావతిని సుందరమైన నగరంగా నిర్మించాలనుకున్నానన్నారు. అమరావతి ప్రాంతంలో ఎకరా 30 లక్షలు ఉన్న భూమి తన వల్ల 10 కోట్లకు చేరిందన్నారు. అలా […]

అందుకే అన్న క్యాంటీన్‌లో ఏసీ పెట్టలేదు
X

తన రాజకీయ జీవితమంతా పేదల కోసమే అని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెట్టడంతో పాటు క్యాంటీన్లలో ఏసీ పెట్టాలని భావించానని… కానీ భోజనం చేసేందుకు వస్తూపోతూ ఉంటారు కాబట్టి ఏసీ వీలుకాదంటే ఆ ఆలోచన వదిలిపెట్టానని చెప్పారు.

తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌ను నిర్మించానని… అదే స్పూర్తితో అమరావతిని సుందరమైన నగరంగా నిర్మించాలనుకున్నానన్నారు. అమరావతి ప్రాంతంలో ఎకరా 30 లక్షలు ఉన్న భూమి తన వల్ల 10 కోట్లకు చేరిందన్నారు. అలా సంపద సృష్టించానన్నారు. అమరావతిలో రెండు లక్షల కోట్ల విలువైన భూమి ఉందన్నారు. అలాంటి బంగారు బాతు అమరావతి అని చంద్రబాబు చెప్పారు.

గ్రామ సచివాలయాల్లో లక్షా 50వేల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. డబ్బులు లేనప్పుడు గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కాంట్రాక్టు పని చేసి ఉంటే వడ్డీతో సహా బిల్లులు చెల్లించాల్సిందేనన్నారు.

సోలార్‌ పవర్‌కు డబ్బులు ఇవ్వడు గానీ.. కర్నాటకలోని విద్యుత్‌కు మాత్రం అక్కడ డబ్బులు చెల్లించాలా అని ప్రశ్నించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని… ప్రతి ఒక్కరి డబ్బులు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని… డబ్బులు ఇప్పించి తీరుతామని చంద్రబాబు ప్రకటించారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన పనులకు డబ్బులు వచ్చి తీరుతాయని… వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ వారికి బిల్లులు ఎందుకు ఇవ్వరు తమాషా చేస్తున్నారా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వకపోతే భయపడిపోయి వైసీపీలో చేరుతారని అనుకుంటున్నారేమో అది అయ్యే పని కాదన్నారు.

ఒక మహిళను తీసుకుని నేరుగా ప్రధాని వద్దకు జగన్‌ వెళ్తున్నారని… ఎంతటి అవినాభావ సంబంధం ఉంటే అలా చేస్తారు అంటూ పరోక్షంగా ఐఏఎస్ శ్రీలక్ష్మీపై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒకాయన ప్రభుత్వంతో రాజీపడవచ్చు కదా అని సలహా ఇచ్చారని… కానీ తన జీవితంలో అలాంటి రాజీ ఉండదని ఆరోజే ఆయనకు చెప్పానని చంద్రబాబు చెప్పారు.

అసెంబ్లీలో 23 పులులు… 151 మేకలతో పోరాటం చేస్తున్నాయన్నారు. ఆ 23 మంది పులుల్లో మొదటి పులి అచ్చెన్నాయుడేనని పొగడ్తలు కురిపించారు. నాలుగు నెలలుగా తవ్వుతున్నా ఏ ఒక్క అవినీతిని కూడా జగన్ ప్రభుత్వం వెలికితీయలేకపోయిందని.. అది తన నిజాయితీ అని చంద్రబాబు చెప్పారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి జైలుకు వెళ్లిన వారిని సన్మానించాలని తాను నిర్ణయించుకున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసులు పెట్టారు కాబట్టే వారిని దేశభక్తులుగా తాను భావిస్తానని చంద్రబాబు చెప్పారు. పార్టీలో యువతకు పెద్దపీట వేసి మరో 30, 40 ఏళ్లకు అవసరమైన విధంగా పార్టీ నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు.

First Published:  21 Oct 2019 8:25 PM GMT
Next Story