Telugu Global
NEWS

రాజధానిపై సీఎం కీలక ఆదేశాలు

సీఆర్‌డీఏ పరిధిలోని నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హంగులు, ఆర్బాటాలు, అనవసర ఖర్చులు తగ్గించి… వాస్తవ కోణంలో ముందుకెళ్లాలని సూచించారు. భారీ స్థాయిలో ఒకేసారి నిర్మాణాలకు బడ్జెట్‌ సహకరించదని… కాబట్టి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు. రాజధాని పనులపై సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్‌మోహన్ రెడ్డి…రాజధానిలో రహదారుల నిర్మాణం, రైతులు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసే కార్యక్రమం, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఉద్యోగుల గృహనిర్మాణాలను కొనసాగించాలని నిర్ణయించారు. […]

రాజధానిపై సీఎం కీలక ఆదేశాలు
X

సీఆర్‌డీఏ పరిధిలోని నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హంగులు, ఆర్బాటాలు, అనవసర ఖర్చులు తగ్గించి… వాస్తవ కోణంలో ముందుకెళ్లాలని సూచించారు. భారీ స్థాయిలో ఒకేసారి నిర్మాణాలకు బడ్జెట్‌ సహకరించదని… కాబట్టి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు.

రాజధాని పనులపై సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్‌మోహన్ రెడ్డి…రాజధానిలో రహదారుల నిర్మాణం, రైతులు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసే కార్యక్రమం, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఉద్యోగుల గృహనిర్మాణాలను కొనసాగించాలని నిర్ణయించారు. అనవసర ఖర్చు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 75 శాతం పైగా పూర్తయిన పనులు ఏవైనా ఉంటే వాటికి ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తేవాలని… అందుకు నిధులు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.

సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీకి తాత్కాలిక భవనాలు ఉన్నందున… వాటి కోసం శాశ్వత భవనాల నిర్మాణంపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుందామని సీఎం సూచించారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో లక్ష వరకు మాత్రమే జనాభా ఉన్నందున 8 లైన్ల రోడ్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి రోడ్ల వెడల్పులు తగ్గించి నిర్మించాలని…భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్టు రోడ్లను విస్తరించేందుకు రోడ్లకు ఇరువైపులా భారీగా ఖాళీ స్థలం వదిలిపెట్టాలని సీఎం ఆదేశించారు.

సీఆర్‌డీఏ పరిధిలో రోడ్ల డిజైన్లలో ఎక్కడా తప్పుల్లేకుండా చూడాలని , రహదారుల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్ల వంటి అంశాలపై ఐఐటీ వంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు.

కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణానికి పోగా మిగిలిన భూమిని సుందరీకరించాలని సూచించారు.

శాఖమూరు పార్క్ వద్ద నిర్మించతలపెట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే హ్యాపీనెస్ట్‌లో 1200 ఫ్లాట్లు అమ్ముడుపోయాయని అధికారులు వివరించారు. ఆ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం శంకుస్థాపన మాత్రమే చేసిందని వివరించారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి… హ్యాపినెస్ట్‌ ప్రాజెక్టును కొసాగించాలని… అయితే దాని నిర్మాణం కోసం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి డబ్బు ఆదా చేయాలని అధికారులకు సూచించారు.

First Published:  25 Nov 2019 10:21 PM GMT
Next Story