Telugu Global
NEWS

తెలంగాణలో బీజేపీ ఎన్నికల యత్నం.. ఇస్తుందా ఫలితం?

తెలంగాణలో ఎన్నికల కాలం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. ఇతర ప్రధాన పార్టీల్లో.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, మజ్లిస్ కు తోడు బీజేపీ కూడా స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎప్పుడైతే లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాలను సొంతం చేసుకుందో.. అప్పటినుంచే తెలంగాణలో బలపడేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎన్నికలనూ అందుకు అవకాశంగా తీసుకుంటూ… […]

తెలంగాణలో బీజేపీ ఎన్నికల యత్నం.. ఇస్తుందా ఫలితం?
X

తెలంగాణలో ఎన్నికల కాలం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. ఇతర ప్రధాన పార్టీల్లో.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, మజ్లిస్ కు తోడు బీజేపీ కూడా స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎప్పుడైతే లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాలను సొంతం చేసుకుందో.. అప్పటినుంచే తెలంగాణలో బలపడేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎన్నికలనూ అందుకు అవకాశంగా తీసుకుంటూ… బీజేపీ నాయకత్వం ఓ లీకును ఇచ్చింది. తెలంగాణలోని నిజామాబాద్ కేంద్రంగా పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపిందనేది ఆ లీకు సారాంశం. ప్రస్తుతానికి ఈ విషయం అధికారికంగా బయటకు రాలేదు కాబట్టి.. పెద్ద చర్చ జరగడం లేదు కానీ.. అధికారికంగా వచ్చి ఉంటే మాత్రం చర్చ కాదు.. రచ్చే అయి ఉండేది.

కారణం ఏంటంటే.. తెలంగాణలో ఎన్నికల కోడ్ నడుస్తుండగా.. ఈ లీకు రావడాన్ని టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు తప్పుబట్టేవి. ఈ ప్రమాదాన్ని బీజేపీ నాయకత్వం ముందే ఊహించిందో ఏమో కానీ.. లీకులతో సరిపెట్టేసింది. కాసిన్ని ఆసక్తికరమైన విషయాలను మాత్రమే బయటికి చెప్పింది.

అందులో ప్రధాన పాయింట్ ఏంటంటే.. నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు కాబోయే.. పసుపు ప్రమోషన్ హబ్ కు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన సుగంధ ద్రవ్యాల పంటల అభివృద్ధి బాధ్యతలతో పాటు… మార్కెటింగ్ కు సంబంధించి పూర్తి అధికారాలు ఉంటాయట. కేంద్రం కూడా.. ఈ హబ్ కి భారీగా నిధులు కేటాయించనుందట. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే అధికారిక ఉత్తర్వులు వచ్చేస్తాయట.

ఇలా.. లీకుల్లోనే నిజామాబాద్ పసుపు కేంద్రం తెలంగాణలో చర్చనీయాంశమైంది. గతంలో.. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్.. భారీ మెజారిటీతో కవితపై గెలిచారు. తాను గెలిస్తే పసుపు బోర్డు సాధిస్తానని ప్రచారం చేశారు. తీరా గెలిచిన తర్వాత.. బోర్డు విషయాన్ని పక్కన పెట్టేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంతలో.. ఎన్నికలు వచ్చాయి. అందుకే.. బీజేపీ హడావుడిగా ఈ విషయాన్ని ప్రకటించి ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఊహాగానాల సంగతెలా ఉన్నా.. లీకుల ప్రకారంగా.. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే.. నిజంగానే తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు ఉంటాయి. మళ్లీ తాత్సారం చేస్తే.. ఖచ్చితంగా ఆ పార్టీ భవిష్యత్తుపై ఈ లీకులు ప్రభావం చూపిస్తాయి.

First Published:  15 Jan 2020 10:15 PM GMT
Next Story