Telugu Global
NEWS

మొన్న రిజిస్ట్రేషన్ శాఖ పై.... నేడు రెవెన్యూ ఆఫీసులపై ఏసీబీ దాడులు

రవాణాశాఖ కమిషనర్ గా ఉన్న సమయంలో సీతారామాంజనేయులు తన పనితీరుతో జగన్ ను ఆకర్షించారు. ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై ఉక్కుపాదం మోపారు. తన రాజకీయ పలుకుబడితో, అహంకారంతో ఏ అధికారులనూ పట్టించుకోని రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ ఆటకట్టించారు. అక్రమంగా నడుస్తున్న జేసీ బస్సులను సీజ్ చేసి సంచలనం సృష్టించారు. గడిచిన కొన్నేళ్లుగా బస్సుల సామ్రాజ్యాన్ని నిర్మించి అక్రమాలకు ఆలవాలంగా రాజకీయ అండదండలతో నిర్మించిన జేసీ దివాకర్ రెడ్డి […]

మొన్న రిజిస్ట్రేషన్ శాఖ పై....  నేడు రెవెన్యూ ఆఫీసులపై  ఏసీబీ దాడులు
X

రవాణాశాఖ కమిషనర్ గా ఉన్న సమయంలో సీతారామాంజనేయులు తన పనితీరుతో జగన్ ను ఆకర్షించారు. ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై ఉక్కుపాదం మోపారు. తన రాజకీయ పలుకుబడితో, అహంకారంతో ఏ అధికారులనూ పట్టించుకోని రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ ఆటకట్టించారు. అక్రమంగా నడుస్తున్న జేసీ బస్సులను సీజ్ చేసి సంచలనం సృష్టించారు.

గడిచిన కొన్నేళ్లుగా బస్సుల సామ్రాజ్యాన్ని నిర్మించి అక్రమాలకు ఆలవాలంగా రాజకీయ అండదండలతో నిర్మించిన జేసీ దివాకర్ రెడ్డి సామ్రాజాన్ని కూల్చిన ఘనత ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులదేనని అంటుంటారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అక్రమాలను కూడా బయటపెట్టి రికవరీ చేయించారు.

తాజాగా ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక సీతారామాంజనేయులు మరింత సత్తా చూపించారు. తన మార్క్ ను ఏసీబీపై కూడా వేశారు. ఏపీలోని అవినీతిని పెకిలించడానికి సీతారామాంజనేయులు సేవలు అవసరం అని భావించిన జగన్ ఏసీబీ పోస్టును కట్టబెట్టారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏసీబీ డీజీ పదవి చేపట్టగానే రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి అవినీతి ఉద్యోగుల్లో భయం నెలకొల్పారు.

తాజాగా రెవెన్యూశాఖపై వస్తున్న ఫిర్యాదులు, అవినీతిపై సీరియస్ అయ్యారు. ఏపీ రెవెన్యూ శాఖ అవినీతితో భ్రష్టుపట్టిందని భావించి దాన్ని పారద్రోలడానికి పూనుకున్నారు.

శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఏపీలో అవినీతికి ఆలవాలంగా మారిన రెవెన్యూ ఆఫీసులపై ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. శుక్రవారం ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు స్వయంగా సీఎం జగన్ ను కలిశారు. రెవెన్యూ కార్యాలయాలపై దాడులపై సీఎం జగన్ కు వివరించారు.

ఇలా రవాణా శాఖయే కాకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఇలా అన్ని శాఖలపై దృష్టి పెట్టి ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు అవినీతి అధికారులకు చెమటలు పోయిస్తున్నారు. జగన్ ఆదేశాలతో రెవెన్యూశాఖపై జరిగిన ఈ దాడి ఏపీ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.

First Published:  24 Jan 2020 5:12 AM GMT
Next Story