Telugu Global
National

మేఘా గో‘దారి’మళ్ళింపులో ప్రపంచ రికార్డు

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం… అనతికాలంలోనే  అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్‌ కేంద్రాల ఏర్పాటు… అతితక్కువ సమయంలో ఆచరణలోకి తీసుకురావడం… 3,436 మెగావాట్ల సామర్థ్యం…  ఇలా ఇంజనీరింగ్‌ చరిత్రలోనే ఏ పథకం కూడా దరిదాపుల్లో లేని విధంగా కాళేశ్వరంలో భారీ పంపింగ్‌ మిషన్‌లను మేఘా ఏర్పాటు చేసి ఇంజనీరింగ్‌ చరిత్రనే తిరగరాసింది. మూడేళ్ళకాలంలోనే 11 పంపింగ్‌ కేంద్రాలల్లో 3,436 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మిషన్‌ల ఏర్పాటుతో.. మొదటిదశ పనులు పూర్తిగా వినియోగంలోకి తెచ్చింది మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ […]

మేఘా గో‘దారి’మళ్ళింపులో ప్రపంచ రికార్డు
X

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం… అనతికాలంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్‌ కేంద్రాల ఏర్పాటు… అతితక్కువ సమయంలో ఆచరణలోకి తీసుకురావడం… 3,436 మెగావాట్ల సామర్థ్యం… ఇలా ఇంజనీరింగ్‌ చరిత్రలోనే ఏ పథకం కూడా దరిదాపుల్లో లేని విధంగా కాళేశ్వరంలో భారీ పంపింగ్‌ మిషన్‌లను మేఘా ఏర్పాటు చేసి ఇంజనీరింగ్‌ చరిత్రనే తిరగరాసింది.

మూడేళ్ళకాలంలోనే 11 పంపింగ్‌ కేంద్రాలల్లో 3,436 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మిషన్‌ల ఏర్పాటుతో.. మొదటిదశ పనులు పూర్తిగా వినియోగంలోకి తెచ్చింది మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌). కాళేశ్వరంలోని లింక్‌-1,2లను పూర్తిచేయడంతో రెండు టిఎంసీల నీటిని ఎత్తిపోయడం ప్రభుత్వానికి సాధ్యమైంది.

మేఘా పంపులతో ఎదురేగిన గోదావరి…. రెండేళ్ళలో 11 పంపింగ్‌ కేంద్రాల పూర్తితో ‘మేఘా’మరో రికార్డ్‌. లింక్‌-1 పూర్తితో 120 కి.మి ఎగువకు గోదావరి నీరు…. రివర్స్‌ పంపింగ్‌ ద్వారా గో‘దారి’ని మళ్లించడమే కాకుండా లక్ష్మీ పంప్‌హౌస్‌తో దిగువన ప్రాణహిత నీరు ఎగువ గోదావరిలోకి మళ్లింపు మరో అరుదు. గోదవరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ.. రైతుల్లో ఆశలు రేకెత్తిస్తూ… కాళేశ్వరాన్ని శర వేగంగా సిద్ధం చేసింది మేఘా ఇంజనీరింగ్‌. బీడుబారిన భూములను సస్యశామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని, పట్టుదలను ఆచరణలో సాధ్యం చేసింది మేఘా.

11 మిషన్లు… 22 డెలివరీ పైపుల ద్వారా … 13 కిలోమీటర్లు

తాజాగా లక్ష్మీ (మేడిగడ్డ) పంపింగ్‌ కేంద్రం నుంచి 11 మిషన్‌లతో ఒకేసారి నీటిని ఎత్తిపోయడం ద్వారా మొదటిదశ పనులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. తాజాగా లక్ష్మీ కేంద్రం ఫిబ్రవరి 15 తేది అర్థరాత్రి నుంచి 17వ తేది ఉదయం వరకు నాలుగు టిఎంసీల నీటిని ఎత్తిపోసింది. 11 మిషన్‌లు పనిచేయడం ద్వారా 22 డెలివరీ పైపుల ద్వారా విడుదలైన ఆ నీరు చూపరులకు కనువిందు చేసింది. పంపింగ్‌ కేంద్రం నుంచి జాలువారిన నీరు రైతుల గుండెలను పులకరింపచేశాయి. లక్ష్మీ నుంచి డిసి ద్వారా విడుదలైన నీరు 13 కిలోమీటర్ల మేర కాలువలో హోయలొలుకుతూ ప్రవహించి చివరకు సరస్వతి జలాశయానికి చేరిన నీరు సముద్రాన్ని తలపిస్తూ కళ్లకు ఇంపుగా ఆకట్టుకుంటోంది.

ఇప్పటివరకు హంద్రీ-నీవానే ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాగా అందులోని పంపింగ్‌ కేంద్రాలను కూడా మేఘా నిర్మించింది. ఇప్పుడు తాజాగా దాదాపు మూడేళ్ళలోపే కాళేశ్వరంలో 3,436 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మిషన్‌లను 11 పంపింగ్‌ కేంద్రాలల్లో ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాని స్థాయిలో కాళేశ్వరంలో ఆచరణ సాధ్యం చేసి చూపించింది.

కాళేశ్వరంలో ప్రాజెక్ట్ లో మొత్తం 22 పంపింగ్‌ స్టేషన్లు ఉండగా ఎంఇఐఎల్‌ మాత్రమే 17 పంప్ హౌస్లను నిర్మిస్తోంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకాలకు ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచ చరిత్రలోనే కేవలం 59 మిషన్‌ ద్వారా 3436 మెగావాట్ల సామర్థ్యంతో పంపింగ్‌ కేంద్రాలు నిర్మించడం అనేది ఇంతవరకు ఎక్కడా సాధ్యం కాలేదు. హంద్రీ-నీవాలో 43 పంపింగ్‌ కేంద్రాలల్లోని 269 మిషన్‌ ద్వారా దాదాపు 653 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపింగ్‌ వ్యవస్థను మేఘా ఏర్పాటు చేయడమే ప్రపంచంలో పెద్దదిగా రికార్డులకెక్కగా ఇప్పుడు కాళేశ్వరం మొదటిదశలో 6 రెట్లు ఎక్కువగా అంటే 3,436 మెగావాట్ల సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది.

ఇంజనీరింగ్‌ వండర్‌ 3436 మెగావాట్లు

కాళేశ్వరం ద్వారా 7200 మెగావాట్ల సామర్థ్యంతో 3 టిఎంసీల నీటిని రోజుకు పంప్‌చేసే విధంగా పనులు జరుగుతుండగా అందులో 2 టిఎంసీల నీటిని రోజుకు పంప్‌చేయడానికి 4,992 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపింగ్‌ కేంద్రాలతో పాటు అంతే విద్యుత్‌ సరఫరా అవసరం అవుతుంది. ఇందులోనూ అత్యధిక భాగం మేఘానే పూర్తిచేసింది.

11 పంపింగ్‌ కేంద్రాల్లో 59 మిషన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా 3,436 మెగావాట్లు రెండున్నరేళ్ళ కాలంలో నిర్మించడం మరో ఇంజనీరింగ్‌ వండర్‌గా గుర్తింపు పొందింది. పంపింగ్‌ కేంద్రాల నిర్మాణంలో ఇంతవరకు దరిదాపుల్లో మరే ప్రాజెక్ట్‌ కూడా లేదు. అయితే మొదటిదశలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంప్‌హౌస్‌లను పూర్తిగా వినియోగిస్తుడడంతో దాదాపు 50 టిఎంసీల నీటిని మిడ్‌మానేరుకు పంప్‌చేసి అక్కడి నుంచి లోయర్‌ మానేరుకు విడుదల చేశారు.

తాజాగా మళ్ళీ లక్షీ కేంద్రం నుంచి 11 మిషన్‌లతో పంపింగ్‌ ప్రారంభించగా సరస్వతి, పార్వతి కేంద్రాల నుంచి కూడా పూర్తిస్థాయిలో పంపింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సరస్వతిలో 4 మిషన్‌లు పంపింగ్‌ చేస్తున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్‌ కేంద్రంగా పేరొందిన గాయత్రి లక్ష్మీపూర్‌ పంపింగ్‌ కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో 7 మిషన్‌లను వినియోగిస్తూ నీటిని మిడ్‌మానేరుకు పంప్‌చేస్తున్నారు. మొదటిదశలో 2 టిఎంసీల నీటిని పంప్‌చేయాలనే ప్రభుత్వ లక్ష్యం లక్ష్మీ (మేడిగడ్డ) నుంచి మిడ్‌మానేరు వరకు అనతికాలంలోనే సాధ్యమైంది.

ఇదే ప్రాజెక్ట్‌లోని ప్యాకేజ్‌-21,27,28 తోపాటు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ పంపింగ్‌ కేంద్రాల్లో మిషన్‌ ఏర్పాటు పూర్తయ్యాయి. అయితే ఈ కేంద్రాల నుంచి నీటిని పంప్‌చేయడం ప్రారంభం కాలేదు. అలాగే లక్ష్మీ కేంద్రంలో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 మిషన్‌లు ఏర్పాటు కాగా సరస్వతి కేంద్రంలో 8, పార్వతి కేంద్రంలో 9 మిషన్‌లు వినియోగంలోకి వచ్చాయి. వీటి సామర్థ్యం కూడా ఒక్కొక్కటి 40 మెగావాట్లు. భూగర్భలో 470 అడుగుల దిగువన నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్‌ కేంద్రంలో 973 మెగావాట్ల సామర్థ్యంతో మిషన్‌లు పూర్తిగా నీటిని ఎత్తిపోస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఎంఇఐఎల్‌ ప్రధానంగా సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పనులు చేయగా అందుకు అవసరమైన పంపింగ్‌ మిషన్‌లను బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలం లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజీనిరింగ్‌ సంస్థలు సమకూర్చాయి. ఈ ప్రాజెక్ట్‌లోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌ పంపింగ్‌ కేంద్రాల్లో మొత్తం 8 మిషన్‌లకు గాను ఇప్పటికే 5 పూర్తయ్యాయి. మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయి.

మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని రోజుకు రెండు టిఎంసీల చొప్పున తీసుకు వచ్చేందుకు అవసరమైన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో కాళేశ్వరం నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభించగా ఇప్పటికీ మొదటి దశలో రెండు టిఎంసీల నీటిని లింక్‌-1, లింక్‌-2ల్లో పూర్తిచేశారు.

మేఘా విద్యుత్‌ సరఫరా

కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4,627 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవసరం కాగా అందులో 3057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్‌ అనతికాలంలోనే నిర్మించి చరిత్ర సృష్టించింది. ఇందులో 400 కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగిన ఆరు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, దాదాపు 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్‌ మిషన్‌ లైన్లను ఎంఈఐఎల్‌ కేవలం రెండేళ్ల కాలంలో పూర్తిచేసింది. ఈ పథకంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఎంతపెద్దదంటే.. తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్థ్యం దాదాపు 16 వేల మెగావాట్లు. దీనితో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థ మొత్తం తెలంగాణ విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో పావువంతు ఉందంటే ఇది ఎంత భారీ వ్యవస్థో అర్థం చేసుకోవచ్చు.

కాళేశ్వరానికి ప్రాణం పోసిన ‘మేఘా’ గాయత్రి

అతి తక్కువ సమయంలోనే మేఘా పంపింగ్‌ కేంద్రాలు 44 టిఎంసీల నీటిని ఎత్తిపోశాయి. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ నీటిని పంప్‌చేయడం కూడా ఓ రికార్డ్‌. లక్ష్మీపంప్‌హౌస్‌ ద్వారా 37.16 టిఎంసీలు, సరస్వతి పంప్‌హౌస్‌ ద్వారా 32 టిఎంసీల నీరు ఎత్తిపోయడం, పార్వతి పంప్‌హౌస్‌ నుంచి దాదాపు 30 టిఎంసీల నీటిని ఎత్తిపోశాయి. మిగిలిన పంప్‌హౌస్‌లతో పోలిస్తే గాయత్రీ నుంచి అధికంగా నీరు అందించడానికి కారణం దీని సామర్థ్యం ఎక్కువ కావడంతో పాటు దిగువన ఉన్న శ్రీపాదసాగర్‌ ఎల్లంపల్లి జలశయానికి ఎగువ నుంచి గోదావరి వరద నీరు కూడా లభించింది. ఎల్లంపల్లికి లింక్‌-1లోని పార్వతి నుంచి నీటిని పంప్‌చేయడమే కాకుండా గోదావరి నుంచి సహజసిద్ధంగా వచ్చిన ప్రవాహం కూడా గాయత్రికి చేరడంతో ఇక్కడ మిగిలిన పంపింగ్‌ కేంద్రాలకన్నా ఎక్కువ నీటిని ఎగువకు ఎత్తిపోయడం సులభం అయ్యింది.

First Published:  18 Feb 2020 10:20 PM GMT
Next Story