Telugu Global
NEWS

ఆఖరి టెస్టులో భారత్ కు డూ ఆర్ డై

టెస్ట్ నెగ్గితేనే సిరీస్ డ్రాగా ముగిసే చాన్స్ న్యూజిలాండ్ లో నాలుగువారాల భారత పర్యటన ముగింపు దశకు చేరింది. రెండుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ లో భాగంగా క్ర్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ స్టేడియం వేదికగా.. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరి టెస్ట్…ఆతిథ్య న్యూజిలాండ్ కు చెలగాటం, టాప్ ర్యాంకర్ భారత్ కు సిరీస్ సంకటంగా మారింది. వెలింగ్టన్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో 10 వికెట్ల ఘోరపరాజయం చవిచూసిన విరాట్ సేన…ఆఖరిటెస్టులో ఆరునూరైనా నెగ్గి…1-1తో సిరీస్ ను సమం […]

ఆఖరి టెస్టులో భారత్ కు డూ ఆర్ డై
X
  • టెస్ట్ నెగ్గితేనే సిరీస్ డ్రాగా ముగిసే చాన్స్

న్యూజిలాండ్ లో నాలుగువారాల భారత పర్యటన ముగింపు దశకు చేరింది. రెండుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ లో భాగంగా క్ర్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ స్టేడియం వేదికగా.. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరి టెస్ట్…ఆతిథ్య న్యూజిలాండ్ కు చెలగాటం, టాప్ ర్యాంకర్ భారత్ కు సిరీస్ సంకటంగా మారింది.

వెలింగ్టన్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో 10 వికెట్ల ఘోరపరాజయం చవిచూసిన విరాట్ సేన…ఆఖరిటెస్టులో ఆరునూరైనా నెగ్గి…1-1తో సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది.

వెలింగ్టన్ వికెట్ తో పోల్చిచూస్తే హాగ్లే ఓవల్ పిచ్ బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉంటుందని భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే చెబుతున్నాడు. క్రైస్ట్ చర్చి వాతావరణం, వికెట్ కు స్వింగ్ బౌలింగ్ కు అనుకూలించినా…బ్యాట్స్ మన్ సైతం రాణించే అవకాశం ఉండటంతో…భారత్ సర్వశక్తులూ కూడదీసుకొని..సత్తా చాటుకోవాలన్న కసితో ఉంది.

ఓపెనర్లపైనే తీవ్ర ఒత్తిడి…

భారత ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్- పృథ్వీ షా మొదటి వికెట్ కు ఇచ్చే భాగస్వామ్యం పైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. న్యూజిలాండ్ ను అధిగమించాలంటే తొలిఇన్నింగ్స్ లో 400 నుంచి 500 వరకూ స్కోరు చేసి తీరాల్సి ఉంది.

కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, నయావాల్ పూజారా, మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ సైతం.. స్థాయికి తగ్గట్టుగా ఆడితేనే విజయం సాధ్యమవుతుంది.

షమీ, బుమ్రాల వైపే భారత్ చూపు…

పేస్ బౌలింగ్ కు అనువుగా ఉన్న తొలిటెస్ట్ వికెట్ పైన భారత బౌలర్లలో ఇశాంత్ శర్మ ఒక్కడే స్థాయికి తగ్గట్టుగా ఆడి రాణించాడు. షమీ, బుమ్రాలు విఫలం కావడం భారతజట్టు పరాజయానికి కారణంగా నిలిచింది.

ఆలోపాన్ని రెండోటెస్టులో సవరించుకోవాలన్న లక్ష్యంతో సాధన చేసి మరీ సమరానికి సిద్ధమయ్యారు. స్పిన్నర్ అశ్విన్ స్థానంలో లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు లేకపోలేదు.

ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్…

తొలిటెస్టులో పవర్ ఫుల్ భారత్ ను నాలుగురోజుల్లోనే 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన న్యూజిలాండ్ …సిరీస్ లోని ఆఖరిటెస్టులో సైతం స్థానబలంతో చెలరేగిపోగలనన్న ధీమాతో ఉంది.

ఫాస్ట్ బౌలర్ల జోడీ ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలతో పాటు…జెయింట్ ఆల్ రౌండర్ జామీసన్, సీనియర్ ఆల్ రౌండర్ గ్రాండ్ హోమీ నిలకడగా రాణించడంపైనే…కివీస్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

బ్యాటింగ్ లో కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, మాజీ కెప్టెన్ రోజ్ టేలర్…కొండంత అండగా ఉన్నారు. రెండోటెస్టులో సైతం టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి.

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ ఆఖరి టెస్టు ఐదురోజులపాటు సాగుతుందా? భారత్ దెబ్బతిన్న బెబ్బులిలా పోరాడి… కివీలను కంగు తినిపించడం ద్వారా సిరీస్ ను 1-1తో సమం చేయగలుగుతుందా? తెలుసుకోవాలంటే కొద్దిరోజులపాటు వేచిచూడక తప్పదు.

First Published:  27 Feb 2020 8:01 PM GMT
Next Story